ఏడాదిలో పది రోజుల పాటు..
ప్రతీ నెల మూడో శనివారం
ఆ రోజున ఆటపాటలు, ప్రయోగాలతోనే చదువు
నేడు ‘బ్యాగ్లెస్ డే’కు శ్రీకారం
ఆదిలాబాద్టౌన్: పుస్తకాల బరువు మోస్తూ ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు నెలలో ఒకరోజు ఉపశమనం కలిగించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రతి నెలా మూడో శనివారం బ్యాగ్లెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ రోజున విద్యార్థులు ఆటపాటలు, ప్రయోగాలతో గడుపుతారు. అదే రోజు పాఠశాలలో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించనున్నారు. విద్యార్థుల ప్రగతి, పాఠశాల అభివృద్ధిపై చర్చించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష తెలంగాణ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. విద్యా సంవత్సరంలో పది రోజుల పాటు విద్యార్థులు పుస్తకాల బ్యాగు లేకుండానే పాఠశాలకు హాజరై, వివిధ కార్యకలాపాల్లో పాల్గొనేలా కార్యక్రమాన్ని రూపొందించారు. జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు ఉపాధ్యాయులకు మార్గదర్శకాలు జారీ చేశారు.
ఆటపాటలతో..
బ్యాగ్లెస్ డేలో భాగంగా విద్యార్థులతో చిత్రలేఖ నం, హస్తకళలు, కథలు చెప్పడం, క్రీడలు, స్థానిక క ళలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్న చిన్న ప్ర యోగాలు, నైపుణ్య ఆధారిత కార్యకలాపాలు నిర్వహించనున్నారు. అలాగే స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించనున్నా రు. పాఠశాలల్లో నిర్వహించే కార్యక్రమాల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రో త్సహించాలని సూచించారు. ప్రతి కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార సామర్థ్యం, బృంద స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా ప్రణాళిక రూపొందించాల్సి ఉంటుంది.
సృజనాత్మకత పెంచేందుకు..
బ్యాగ్లెస్ డే సందర్భంగా విద్యార్థులకు స్థానిక వృత్తులు,వ్యవసాయం,చేతివృత్తులు, పర్యావరణ పరి రక్షణ, సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయి కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. స్థానిక కళాకారులు, నిపుణులు, తల్లిదండ్రులు, సమాజంలోని ఇతర వ్యక్తుల సహకారం కూడా అవసరమైన సందర్భాల్లో తీసుకో వాలని సూచించారు. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అందించడంతో పాటు వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. పాఠశాల స్థాయిలో నిర్వహించిన కార్యకలాపాలను నమోదు చేసి, వాటి ద్వారా విద్యార్థుల్లో వచ్చిన మార్పును కూడా పరిశీలించనున్నారు.
నేటి నుంచి అమలు..
బ్యాగ్లెస్ డే కార్యక్రమాన్ని జిల్లాలో శనివారం నుంచి అమలు చేయనున్నారు. ప్రతినెల మూడో శనివా రం ఈ కార్యక్రమాన్ని ఉంటుందని విద్యాశాఖ అధి కారులు పేర్కొన్నారు. ఈనెల 19న, నవంబర్ 21, డిసెంబర్ 19, ఫిబ్రవరి 20 తేదీల్లో ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. పుస్తకాల బరువు లేకుండా ఒక రోజు పాఠశాలకు వచ్చే విద్యార్థులు ఆటలు, పాటలు, ప్రయోగాలు, సృజనాత్మక కార్యక్రమాలతో గడపడం ద్వారా చదువుపై మరింత ఆసక్తి పెంచుకునే అవకాశం ఉంటుందని విద్యాశాఖ భావి స్తోంది. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడేలా బ్యాగ్లెస్ డేస్ను పాఠశాలల్లో విజయవంతంగా అమలు చేయాలని అధికారులు సూచించారు.
చదువుపై విద్యార్థుల్లో
ఆసక్తి పెంచేలా
ప్రతిరోజు పుస్తకాలతో కుస్తీ పడుతున్న విద్యార్థులు నెలలో ఒకరోజు పాఠశాలల్లో ఆటపాటలతో గడిపేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రతి మూడో శనివారం బ్యాగ్లెస్ డే కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా విద్యార్థులకు వివిధ అంశాలకు సంబంధించి నేర్పించడం జరుగుతుంది. ఆటపాటలతో వారిలో సృజనాత్మకత పెరుగుతుంది. – డి.మాధవి, డీఈవో
జిల్లాలో
మొత్తం పాఠశాలలు 1,494
విద్యార్థులు 1లక్ష 60వేలు


