జిల్లాలో ప్రతికూల పరిస్థితులు జలాశయాల్లో పడిపోతున్న నీటిమట్టాలు పంటల ఎదుగుదలపై ప్రభావం
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో ప్రస్తుతం 33 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 21 మండలాలు ఉండగా, 20 మండలాల్లో వర్షాభావం నెలకొంది. ఒక్క తలమడుగు మండలంలో మాత్రమే సాధారణ వర్షపాతం ఉంది. పది రోజుల క్రితం మామూలు వర్షం తప్పితే మళ్లీ జాడలేకుండా పోయింది. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.
తగ్గుతున్న నీటిమట్టాలు..
ఈ సీజన్లో ఆగస్టు మొదటి వారంలో కురిసిన వర్షాలు మినహా మిగతా అన్ని వారాల్లో అత్యధికంగా లోటు వర్షపాతమే నమోదైంది. అప్పుడు కురిసిన ఆ వర్షాలకు జలాశయాల్లో నీరు చేరింది. ప్రస్తుత పొడి వాతావరణం కారణంగా ఆవిరయ్యే పరిస్థితి నెలకొంది. నీటిమట్టాలు గణనీయంగా తగ్గుతున్నాయి. సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్ట్ల్లో ఈ ప్రభావం కనిపిస్తోంది. జిల్లాలో 298 చెరువులు ఉండగా, అన్ని చెరువులు సగం మాత్రమే నిండాయి. దీంతో భూగర్భజలాలు గణనీయంగా పడిపోతున్నాయి. బోరుబావుల పరిస్థితి అలాగే ఉంది. రా బోయే రోజుల్లో వర్షాలు పడకపోతే తాగునీటి ఎద్దడి కూడా తలెత్తే అవకాశం లేకపోలేదు.
పంటల పరిస్థితి..
జిల్లావ్యాప్తంగా 5లక్షల 94వేల ఎకరాల్లో పత్తి, సోయా, కంది, మొక్కజొన్న తదితర పంటలు ఈ వానాకాలంలో సాగయ్యాయి. అత్యధికంగా 4.37 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. పంటలు పూత, కాత దశలో ఉండగా, డ్రైస్పెల్ కారణంగా పంట ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఇది ఆదిలాబాద్ శివారు లాండసాంగ్వి గ్రామంలో రైతు రాజేందర్ పత్తి చేను. ఇప్పటికే పూత, కాతతో విరివిగా ఉండాల్సిన పంట ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తుంది. అనుకున్న స్థాయిలో కాయలు కాయకపోవడం, ఉన్న వాటికి సైతం సరిపడా తేమ లభించక ఎదుగుదల లోపించింది. ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు సరిపడా వర్షాలు లేవు. ఇది పంటపై ప్రభావం చూపుతుంది. దిగుబడిపై రైతు ఆశలు సన్నగిల్లుతున్నాయి.
వర్షపాతం వివరాలు.. (జూన్ 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు)
సాధారణం : 897.5 మి.మీ.లు
కురిసింది : 597.1 మి.మీ.లు
లోటు : 33 శాతం


