● యానాదుల సంక్షేమ సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు పెంచలయ్య
నెల్లూరు(వేదాయపాళెం): ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఎస్టీ వర్గీకరణను వెంటనే చేపట్టాలని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య డిమాండ్ చేశారు. నెల్లూరు భక్తవత్సలనగర్లోని గిరిజన భవన్లో ఆదివారం ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెంచలయ్య మాట్లాడుతూ హామీలు నెరవేర్చకపోతే రానున్న ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గ పరిధిలో యానాదులు తమ సత్తా చాటుతారని హెచ్చరించారు. వాగ్దానాలను విస్మరించే వారికి తగిన గుణపాఠం చెబుతామని పేర్కొన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అక్టోబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల ఎదుట వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. నవంబర్ 16న యానాదుల ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి కార్యవర్గ సభ్యులు హాజరై పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బాపట్ల బ్రహ్మయ్య, కోశాధికారి చలంచర్ల పెద బ్రహ్మయ్య, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చేవూరు సుబ్బారావు, మహిళా విభాగం అధ్యక్షురాలు చెంబేటి ఉష, నీలం అంకమ్మ, పొన్నూరు అంకమరావు, మానికల మురళి తదితరులు పాల్గొన్నారు.


