నెల్లూరు(క్రైమ్): నేర నియంత్రణ చర్యల్లో భాగంగా బాలాజీ నగర్ పోలీసులు శుక్రవారం స్టేషన్ పరిధిలోని శ్రామికనగర్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. బృందాలుగా విడిపోయిన సిబ్బంది ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలను సేకరించారు. పత్రాలు సక్రమంగా లేని 20 ద్విచక్ర వాహనాలు, ఒక కారును స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. ఓ సస్పెక్ట్ షీటర్ను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. నేర ప్రవృత్తిని వీడి సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఎస్సైలు విజయ్శ్రీనివాస్, సూర్యప్రకాష్రెడ్డి స్థానికులతో మాట్లాడారు. మహిళలు, చిన్నారుల రక్షణ చట్టాలు, శక్తియాప్, డయల్ 112, ఎల్హెచ్ఎంఎస్, హెల్మెట్ ధారణ, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలన్నారు. వాహనపత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, అసాంఘిక కార్యకలాపాలను గుర్తిస్తే తక్షణమే సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.


