బీఆర్ఎస్ పోరుబాట
కై లాస్నగర్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా ఎన్నికల హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ బుధవారం ఆందోళన చేపట్టింది. ఆదిలాబాద్లో మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో, బోథ్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు.
జిల్లాకేంద్రంలో పోరుబాట పేరిట ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు’ అనే 420 అడుగుల ఫ్లెక్సీతో పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎన్నికల హామీలతో కూడిన ప్లకార్డులు, బాకీకార్డులను ప్రదర్శిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామని గద్దెనెక్కిన సీఎం రేవంత్రెడ్డి వెయ్యి రోజులైనా పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రికి ఆ పదవీలో కొనసాగే అర్హత లేదని విమర్శించారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీని రాష్ట్రంలో ఏ ఒక్కరికై నా అమలు చేసినట్లు నిరుపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మనోహర్, నర్సింగరావు, అజయ్, సాజీదోద్దీన్, యూనిస్ అక్బాని, వసంత్, ప్రమోద్ రెడ్డి, మమత, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు.
దద్దరిల్లిన బోథ్
బోథ్: ఎన్నికల వేళ ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలను దారుణంగా మోసం చేసిందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ విమర్శించారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాకు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. కాంగ్రెస్ బాకీపడ్డ పథకాలను గుర్తుచేస్తూ ప్రజలకు ప్రత్యేకంగా రూపొందించిన బాకీ కార్డులు అందజేశారు. వాటితో సెల్ఫీలు దిగి వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్జాదవ్ మాట్లాడుతూ, మోసపూరిత హామీలతో కాలం వెళ్లదీస్తున్న కాంగ్రెస్కు రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ ప్రాంత వాసుల చిరకాల ఆకాంక్ష అయిన బోథ్ రెవెన్యూ డివిజన్ సాధన కోసం శాసనసభ లోపల, వెలుపల రాజీలేని పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. ఇందులో బోథ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


