బోథ్: ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు మంగళవారం తెల్లవారు జామున సొనాల మండల కేంద్రంలో పోలీసులు ‘కమ్యూనిటీ కాంటాక్ట్’ నిర్వహించారు. సరైన పత్రాలు, పెండింగ్ చలానాలు, నంబరు ప్లేట్లు లేని 232 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.వెంకటనర్సయ్య తెలిపారు. వీటిలో ఫేక్ నంబర్ ప్లేట్ అమర్చిన ఒక కారును గుర్తించి, నిందితుడిపై బీఎన్ఎస్ సెక్షన్ 318(4) కింద చీటింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరి వద్ద నుంచి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని ఎకై ్సజ్ కేసులు నమోదు చేశామని, గంజాయి సేవిస్తున్న మరొకరిపై కూడా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, సీఐలు సీహెచ్.రమేశ్, బి. ప్రణయ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి.వెంకటి, టి.మురళి, ఎన్.చంద్రశేఖర్, ఎస్సైలు వి.పురుషోత్తం, రమేశ్, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


