రాజమహేంద్రవరం సిటీ: జీఎస్ఎల్ మెడికల్ కళాశాలకు చెందిన మెడికో డాక్టర్ ప్రియాంక మృతి నేపథ్యంలో ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ వైఎస్సార్ సీపీ పోరాటం సాగిస్తుందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ప్రకటించారు. ఆదివారం ప్రియాంక మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు రోజుల కిందట ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద మెడికో డాక్టర్ ప్రియాంకను ఉద్దేశ పూర్వకంగా కారుతో ఢీకొట్టి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు. తీవ్రంగా గాయపడిన ప్రియాంక బ్రెయిన్ డెడ్ స్థితికి చేరుకుని, ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడవడం చాలా బాధాకరమన్నారు. ప్రియాంక తండ్రి ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని.. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత, మంత్రి నారా లోకేష్ ఇలా ఎవరు తమ కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదని అన్నారని తెలిపారు. ఇంతటి తీవ్రమైన ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని అనిపిస్తుందన్నారు. ప్రధానంగా ప్రకాశ్నగర్ సీఐ ఈ ఘటనను కేవలం ప్రమాదంగా నమోదు చేసి, నిందితులకు స్టేషన్ బెయిల్ లభించేలా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిందితులపై హత్యాయత్నం, సంబంధిత కఠిన నేరాల కింద కేసులు నమోదు చేయాలన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బలమైన సందేశం ఇవ్వడానికే, సోమవారం రాజమహేంద్రవరంలో అన్ని కాలేజీలు, విద్యాసంస్థల బంద్కు పిలుపునిస్తున్నట్టు భరత్రామ్ ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా విద్యా సంస్థలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఈ బంద్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఫ నేడు విద్యా సంస్థల బంద్
ఫ మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్


