ప్రజావాణిపై అలసత్వం వద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణిపై అలసత్వం వద్దు

Jul 6 2026 11:57 PM | Updated on Jul 6 2026 11:57 PM

● కలెక్టర్‌ రాజర్షి షా

కై లాస్‌నగర్‌: ప్రజావాణిలో అందించే అర్జీలపై అలసత్వం వహించకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్‌ రాజర్షి షా అధికారులను అదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు అందజేస్తూ పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఆర్‌ఎస్‌ చిత్రు, రాజేశ్వర్‌, డీఆర్వో స్రవంతి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా వివిధ సమస్యలకు సంబంధించి ఈవారం 94 అర్జీలు అందాయి. అందులో కొందరి నివేదన.

బస్సు సౌకర్యం కల్పించాలి

మా గ్రామం నుంచి పాఠశాల, కళాశాల సమయానికి బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఆదిలాబాద్‌ నుంచి జీవితికి బస్సు ఉన్నా అది సమయానికి రావడం లేదు. స్పందించి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశాం.

– జామిని గ్రామ విద్యార్థులు, సాత్నాల

డబ్బులిస్తేనే బడికి రావాలంటున్నారు

నా కూతురు జ్యోత్స్న ఉట్నూర్‌లోని పూలాజీ బాబా పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పథకం కింద సీటు రావడంతో చేర్పించాను. ఉచితంగా వసతితో కూడిన విద్య అందించాల్సి ఉండగా యాజమాన్యం డబ్బులు అడుగుతుంది. బుక్స్‌, యూనిఫాం, దోబి, మెడికల్‌ ఫీజులు చెల్లిస్తేనే బడికి అనుమతిస్తామని చెబుతున్నారు. గతేడాది కూడా ఫీజులు చెల్లించాం. కూలీనాలి చేసుకునే మాకు భారంగా మారుతుంది. నా బిడ్డను పాఠశాలకు అనుమతించేలా చూడాలని కోరుతున్నా. – బాలేరావు ప్రతిమ, ఇంద్రవెల్లి

ఇంటి పట్టాలు ఇవ్వాలి

మా గ్రామంలోని సర్వేనంబర్‌ 59లో గత ప్రభుత్వం మాకు ప్లాట్లు ఇచ్చింది. 15 ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నాం. అయితే పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. పలుమార్లు మండల స్థాయి అధికా రులకు వినతులు ఇచ్చినా స్పందన లేదు. తహసీల్దార్‌ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి పట్టాల కోసం తీర్మానం చేసినా ప్రయోజనం లేదు. విచారణ జరిపించి ఆదుకోవాలని కోరుతున్నాం.

– కూర గ్రామస్తులు, జైనథ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement