breaking news
stopworks
-
లేటరైట్ తవ్వకాలు.. నిలిపివేత
ఎక్కడి పనులు అక్కడే నిలిపివేయాలని ఆదేశాలు ‘సాక్షి’ వార్తకు స్పందించిన అధికారులు తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించిన ఆర్డీవో తవ్విన ఖనిజం పరిశీలన.. నిర్వాహకులపై ప్రశ్నల వర్షం నిరంతర నిఘా వేయాలని.. నివేదిక పంపాలని తహశీల్దార్కు ఆదేశం ‘లోకల్ రుబాబు’ ప్రకంపనలు రెండోరోజు కూడా కొనసాగాయి. ఎటువంటి అనుమతులు లేకుండా.. గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ చేయరాదన్న నిబంధనలున్నా.. అన్నింటినీ కాలరాసి విలువైన లేటరైట్ ఖనిజాన్ని తవ్వి.. కోట్లు దోచుకుంటున్నా ఇన్నాళ్లు కనీసం అటువైపు చూడని జిల్లా యంత్రాంగం ఎట్టకేలకు స్పందించి. ఈ అక్రమ తవ్వకాలపై ‘సాక్షి’ లో వచ్చిన కథనంతో ఆలస్యమైనా.. ఉన్నతాధికార యంత్రాంగం తీవ్రంగానే స్పందించింది. మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించింది. ఎక్కడి పనులు అక్కడే నిలిపివేయాలని ఆదేశించింది. నర్సీపట్నం: అక్రమంగా సాగుతున్న లైటరైట్ ఖనిజ తవ్వకాలకు రెడ్ సిగ్నల్ పడింది. తవ్వకాలతోపాటు రవాణాను తక్షణమే నిలిపివేయాలని సోమవారం ఆ ప్రాంతానికి వెళ్లిన నర్సీపట్నం ఆర్డీవో సూర్యారావు అధికారులను ఆదేశించారు. దీనిపై విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించారు. లేటరైట్ అక్రమ తవ్వకాలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలకు ఆయన స్పందించారు. సోమవారం మధ్యాహ్నం తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి స్వయంగా వెళ్లి పరిశీలించారు. అప్పటికీ అక్కడ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్న విషయాన్ని గమనించారు. తీవ్రంగా స్పందిస్తూ తవ్వకాలు, ఖనిజ రవాణాను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న నిర్వహకుల ప్రతినిధులతో మాట్లాడారు. రోజుకు ఎన్ని లారీలు రవాణా అవుతాయనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. వారిపై ప్రశ్నల వర్షం కురిపించగా.. సరైన సమాధానాలు చెప్పలేక వారు నీళ్లు నమిలారు. దాంతో పనులను నిలిపివేయాలని.. ఇకముందు తవ్వకాలు జరగకుండా నిఘా వేయాలని స్థానిక తహశీల్దారు కనకారావును ఆదేశించారు. అలాగే మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదిక రూపొందించి కలెక్టర్కు పంపాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో తవ్వకాలు జరపకూడదని స్పష్టం చేశారు. అలాకాకుండా తవ్వకాలు మళ్లీ ప్రారంభమైతే మైనింగ్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో ‘సాక్షి’తో మాట్లాడుతూ మైనింగ్ లీజుకు సంబంధించి గత ఏడాది చివర్లో పంచాయతీ తీర్మానాలు తప్పుగా చేసినట్లు ఫిర్యాదు అందిందన్నారు. జిల్లా పంచాయతీ అధికారి దానిపై విచారణ కూడా జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారన్నారు. ఆ తర్వాత తవ్వకాలు ప్రారంభానికి ఇచ్చిన నిరభ్యంతర పత్రం రద్దు చేశారో.. లేదో తెలపాలంటూ ఇటీవల గనులశాఖ అధికారులు తహశీల్దారును కోరారని, దానిపై ఇప్పటికే నివేదిక పంపామన్నారు. ఈ వ్యవహారంలో కలెక్టర్ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఆర్డీవో సూర్యారావు వివరించారు. -
పర్యాటకానికి సెగ
అరొకర నిధులు.. సాగని పనులు ప్రచారం.. ఆర్భాటం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే సాక్షి, విశాఖపట్నం: ‘విశాఖపట్నాన్ని ప్రపంచంలోనే అందమైన నగరంగా తీర్చిదిద్దుతాం.. పర్యాటకరంగంలో అభివద్ధి చేసి ప్రపంచ పటంలో నిలుపుతాం.. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా తయారు చేస్తాం.. నిధులెంతైనా ఇస్తాం.. బీచ్లను సుందరంగా రూపొందిస్తాం.. ఆ విధంగా ముందుకుపోతాం..’ ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటనకు వచ్చిన ప్రతిసారీ వేదికలపై వల్లించే ఉపన్యాసం. ఆయన అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత గత ఏడాది (జులై 9న) విశాఖలోని బీచ్ల సుందరీకరణ పేరిట రూ.16 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో ఉత్తరం (నార్త్) విభాగం పరిధిలోని బీచ్ల అభివద్ధికి 13.49 కోట్లు, దక్షిణ పరిధిలోని పనులకు రూ.1.50 కోట్లు కేటాయించారు. వీటిలో ఉత్తర పరిధిలోని ఆర్కే బీచ్ బ్యాలెన్స్ పనులకు రూ.2.70 కోట్లు, రుషికొండ బీచ్ అభివద్ధికి రూ.3.40 కోట్లు, సాగర్నగర్ బీచ్కు రూ.65 లక్షలు, ఎండాడకు రూ.80 లక్షలు, తొట్లకొండకు రూ.కోటి, మంగమారిపేట బీచ్కు రూ.1.50 కోట్లు, భీమిలి బీచ్ విస్తరణ పనులకు రూ.3.40 కోట్లు చొప్పున వెచ్చించాల్సి ఉంది. ఇందులో ఆర్కే బీచ్ పనులు మాత్రమే పూర్తయ్యాయి. రుషికొండలో ల్యాండ్స్కేపింగ్, చిల్డ్రన్ పార్కు, యాంఫిథియేటర్, పార్కింగు, షాపులు, ఫుడ్కోర్టు, టాయిలెట్లు వంటి పనులు జరగాల్సి ఉంది. ఇక్కడ పనులు పడుతూ లేస్తూ సాగుతున్నాయి. ఒకపక్క నిధుల కొరత, మరోపక్క సముద్రతీరం కోత వెరసి రుషికొండ పనులను సాగనివ్వడం లేదు. ఇక సాగర్నగర్, ఎండాడ బీచ్ల అభివద్ధికి కేంద్ర అటవీశాఖ అనుమతి పెండింగులో ఉంది. అటు నుంచి గ్రీన్సిగ్నల్ రాకపోవడంతో తాటాకు గుడిసెలు, పార్కింగ్, టాయిలెట్లు వంటి పనులనే ప్రారంభించలేదు. అలాగే మంగమారిపేటలో టాచ్డ్ షెడ్లు, పార్కింగు, కెఫిటేరియా, వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ అక్కడ స్థలంపై కోర్టులో స్టే ఉండడంతో అడుగు ముందుకు పడలేదు. భీమిలి బీచ్ రోడ్డు అభివద్ధి పనులకు ఆటంకాలు తప్పలేదు. భీమిలి తీరంలో వాటర్ స్పోర్ట్స్, పచ్చదనం, షెడ్లు, వగైరాలతో సుందరంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఇంతలో నాలుగు లైన్ల రోడ్డు ఈ ప్రతిపాదిత బీచ్ వైపే రావడంతో అదీ అర్థాంతరంగా ఆగిపోయింది. ఇప్పటికే అక్కడ సుమారు రూ.40 లక్షల విలువైన పనులు జరిగిపోయాయి. ప్రస్తుతం ఈ బీచ్ ప్రాజెక్టుకు మంగళం పాడేసే పరిస్థితికి వచ్చింది. మరోవైపు దక్షిణ విభాగం పరిధిలోని యారాడ బీచ్లో రూ.కోటిన్నరతో చేపట్టాల్సిన పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఎప్పుడు ప్రారంభమవుతాయో అధికారులకు కూడా తెలియని పరిస్థితి. జిల్లాలోని ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం తీరంలో రూ.కోటిన్నరతో చేపట్టిన అభివద్ధి పనులు అక్టోబర్ నాటికి పూర్తవుతాయని పర్యాటక అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టులన్నిటికీ సుమారు రూ.16 కోట్లు అవసరం కాగా ఇప్పటిదాకా కేవలం రూ.4 కోట్లు కూడా విడుదల కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలా జిల్లాలోనూ, నగరంలోనూ ప్రతిష్టాత్మకంగా చేపట్టే పర్యాటక ప్రాజెక్టులు, బీచ్ సుందరీకరణ పనుల వేగం నత్తతో పోటీపడుతున్నాయి. ప్రభుత్వం ప్రచారంలో చూపే అట్టహాసం నిధుల విడుదల, వాటికెదురయ్యే అడ్డంకుల పరిష్కారంలో చూపితే సుందర విశాఖ పర్యాటకులను ఆకట్టుకుంటుందని విశాఖ వాసులు అభిప్రాయపడుతున్నారు.