breaking news
Servicing Center
-
విమానయాన రంగానికి కొత్త రెక్కలు
సాక్షి, హైదరాబాద్: భారత్ ప్రస్తుతం సంస్కరణల ఆధారిత దేశంగా మారి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఫ్రాన్స్కు చెందిన దిగ్గజ ఏరోస్పేస్, రక్షణరంగ సంస్థ సఫ్రాన్ రూ. 1,300 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లోని జీఎంఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండ్రస్టియల్ పార్క్ సెజ్లో ఏర్పాటు చేసిన ‘లీప్’ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతు, ఓవర్హాల్ (ఎంఆర్ఓ) కేంద్రాన్ని (సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా) ప్రధాని బుధవారం వర్చువల్గా ప్రారంభించారు.వచ్చే ఏడాది నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్న ఈ కేంద్రంలో ఏటా 300 వాణిజ్య విమానాలకు చెందిన ‘లీప్’ఇంజిన్ల సరీ్వసింగ్ వీలవనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘నేటి నుంచి భారత విమానయాన రంగం కొత్త పుంతలు తొక్కనుంది. సఫ్రాన్ కంపెనీకి చెందిన ఈ కొత్త కేంద్రం భారత్ను ఒక గ్లోబల్ ఎంఆర్ఓగా మార్చేందుకు సహాయపడుతుంది’అని చెప్పారు.ఈ కేంద్రం విమానాయన రంగంలో దేశ యువతకు ప్రత్యేకించి దక్షిణాది ప్రాంత యువతీయువకులకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందన్నారు. సఫ్రాన్ బోర్డు, అధికారుల బృందంతో జరిగిన చర్చల్లో భారత్పట్ల వారికి ఉన్న విశ్వాసం, ఆశాభావాన్ని గమనించినట్లు పేర్కొన్నారు. దేశంలో సఫ్రాన్ పెట్టుబడులు ఇదే వేగంతో కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా సఫ్రాన్ బృందానికి ప్రధాని అభినందనలు తెలియజేశారు. సఫ్రాన్ సంస్థ ఏర్పాటు చేసిన విమాన ఇంజిన్ సర్వీస్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న సీఎం రేవంత్రెడ్డి, చిత్రంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, సంస్థ ప్రతినిధులు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి... భారత విమానయాన రంగం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో ఒకటని ప్రధాని మోదీ చెప్పారు. దేశీయ విమానయాన మార్కెట్ ఇప్పుడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మార్కెట్గా ఉందని వివరించారు. దేశ ప్రజల ఆకాంక్షలు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయన్న ఆయన.. వాటి ఫలితంగా దేశంలో విమాన ప్రయాణానికి డిమాండ్ పెరుగుతోందన్నారు. డిమాండ్ను తీర్చడానికి విమానయాన సంస్థలు విమానాల సంఖ్యను పెంచుకుంటున్నాయని తెలిపారు. భారతీయ విమానయాన కంపెనీలు 1,500 కంటే ఎక్కువ కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చినట్లు మోదీ పేర్కొన్నారు. పెరిగిన ఎంఆర్ఓ అవసరం... విమానయాన రంగం వేగంగా విస్తరిస్తున్నందున ఎంఆర్ఓ కేంద్రాల అవసరం కూడా పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం మరమ్మతుల కోసం దేశంలో 85 శాతం విమానాలు విదేశాలకు వెళ్తున్నాయని.. ఈ పరిణామం విమానయాన సంస్థల ఖర్చుల పెరుగుదల, సరీ్వసుల్లో జాప్యానికి కారణమవుతోందని మోదీ పేర్కొన్నారు. ఇది దేశ విమానయాన రంగానికి ఏమాత్రం మంచిది కాదని.. అందుకే ప్రపంచంలోని ప్రధాన ఎంఆర్ఓ కేంద్రాల్లో ఒకటిగా భారత్ను నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.తొలిసారిగా ఒక అంతర్జాతీయ సంస్థ భారత్లో డీప్ లెవెల్ సరీ్వసింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తోందని మోదీ తెలియజేశారు. సఫ్రాన్ అందించే అంతర్జాతీయ స్థాయి శిక్షణ, విజ్ఞాన బదిలీ, భారతీయ సంస్థలతో భాగస్వామ్యం రాబోయే ఏళ్లలో మొత్తం ఎంఆర్ఓ వ్యవస్థకు కొత్త ఊపు, దిశను ఇచ్చే శ్రామిక శక్తిని తయారు చేసేందుకు సహాయపడుతుందని ప్రధాని చెప్పారు. డిజైన్ ఇన్ ఇండియా.. ‘డిజైన్ ఇన్ ఇండియా’ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని.. ఈ నేపథ్యంలో భారత్లో విమాన ఇంజిన్, విడిభాగాల తయారీ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ప్రధాని మోదీ సఫ్రాన్ బృందాన్ని కోరారు. ఏరోస్పేస్ ప్రొపల్షన్ సిస్టమ్స్లో సఫ్రాన్ కంపెనీ విస్తృతంగా పనిచేస్తోందన్న ప్రధాని.. ప్రొపల్షన్ వ్యవస్థల డిజైన్, తయారీ కోసం కూడా భారత నైపుణ్యాలు, అవకాశాలను ఉపయోగించుకోవాలని కంపెనీని కోరారు. ‘మేం పెద్ద కలలు కంటున్నాం. అంతకంటే పెద్ద పనులు చేస్తున్నాం. ఉత్తమ ఫలితాలను అందిస్తున్నాం’అని ప్రధాని పేర్కొన్నారు. సులభతర వ్యాపారానికి భారత్ ప్రాధాన్యం ఇస్తోందని మోదీ చెప్పారు. రక్షణ రంగంలోనూ 74 శాతం ఎఫ్డీఐ.. ప్రైవేటు రంగానికి అవకాశంలేని రక్షణ వంటి రంగాల్లోనూ ఇప్పుడు 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)కు అనుమతిచి్చనట్లు ప్రధాని మోదీ తెలిపారు. అంతరిక్ష రంగంలోనూ కీలక విధానాన్ని అవలంబించినట్లు వెల్లడించారు. ఈ చర్యలు ప్రపంచానికి ‘భారత్ పెట్టుబడులను స్వాగతిస్తుంది.. ఆవిష్కరణలను స్వాగతిస్తుంది’అనే స్పష్టమైన సందేశాన్ని పంపాయన్నారు.ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాలు అంతర్జాతీయ తయారీదారులను భారత్లో తయారీ వైపు ఆకర్షించాయని ప్రధాని చెప్పారు. తమ పాలనలో 40 వేలకుపైగా నిబంధనలను తగ్గించి జాతీయ ఏకగవాక్ష విధానం ద్వారా అనుమతులను మంజూరు చేస్తున్నట్లు వివరించారు. జీఎస్టీ సంస్కరణలు, ఫేస్లెస్ ట్యాక్స్ అసెస్మెంట్, కొత్త కారి్మక కోడ్లు, దివాలా కోడ్ వంటి చర్యల ఫలితంగా భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు చెందిన పెట్టుబడిదారులకు ఒక విశ్వసనీయ భాగస్వామిగా, ఒక ప్రధాన మార్కెట్గా, వేగంగా దూసుకుపోతున్న తయారీ కేంద్రంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వృద్ధికి ‘సఫ్రాన్’మైలురాయి: సీఎం రేవంత్రెడ్డి సఫ్రాన్ సంస్థ తమ కార్యకలాపాల విస్తరణకు తెలంగాణను ఎంచుకోవడం రాష్ట్ర వృద్ధికి ఒక మైలురాయి అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశంలో ‘లీప్’ఇంజిన్ల తొలి ఎంఆర్వో కేంద్రం ఇదేనన్నారు. ఈ కేంద్రంలో వెయ్యి మంది సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుందన్నారు. ఇది రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలకు ఊతమిస్తుందని చెప్పారు. రఫేల్ యుద్ధ విమానాల్లో వినియోగించే ఎం88 సైనిక ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతుల కోసం సఫ్రాన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న మరో ఎంఆర్ఓకు శంకుస్థాపన చేసుకున్నామని సీఎం రేవంత్ వెల్లడించారు.భారత వైమానిక దళం, భారత నావికాదళానికి ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. భారత్లోని ప్రధాన ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్గా హైదరాబాద్ మారిందన్నారు. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీల పారిశ్రామిక విధానం, ఎంఎస్ఎంఈ విధానం దేశంలోనే అత్యుత్తమని చెప్పారు. సఫ్రాన్, బోయింగ్, ఎయిర్ బస్, టాటా, భారత్ ఫోర్జ్ వంటి సంస్థలు హైదరాబాద్ను తయారీ, పరిశోధన, అభివృద్ధి కోసం ఎంచుకున్నాయని సీఎం తెలిపారు. ఏరోస్పేస్, రక్షణ రంగంలో ఎగుమతులు గత ఏడాది రెట్టింపు అయ్యాయని వ్యాఖ్యానించారు.9 నెలల్లో రూ.30,742 కోట్లకు చేరుకున్నట్లు చెప్పారు, మొదటిసారిగా మన ఫార్మా ఎగుమతులను ఈ రంగం అధిగమించిందన్నారు. 100 ఐటీఐలను ఏటీఎస్లుగా మార్చామని, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ విమానాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెడుతుందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. 30 వేల ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రాష్ట్ర విజన్ను డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్కు అందర్నీ ఆహ్వనిస్తున్నట్లు సీఎం తెలిపారు.బెంగళూరు–హైదరాబాద్ను డిఫెన్స్, ఏరోస్పేస్ కారిడార్గా ప్రకటించాలని ఈ సందర్భంగా రేవంత్రెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంతి రామ్మోహన్నాయుడు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, సఫ్రాన్ గ్రూప్ చైర్మన్ రాస్ మెకలెన్స్, సీఈవో, డైరెక్టర్ ఒలివర్ అండ్రీస్, ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్ సీఈవో స్టీఫెన్ క్యూయల్, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
సెకనుకు మూడు వాహనాలు డెలివరీ
మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ 2025 మే నెలలో 24.5 లక్షలకు పైగా వాహనాలను సర్వీస్ అందించడం ద్వారా అమ్మకాల అనంతరం చేసిన సర్వీస్లో రికార్డు నెలకొల్పింది. మే నెలలో దేశవ్యాప్తంగా మారుతీ సుజుకీ నిమిషానికి 170 వాహనాలను సర్వీస్ చేసి డెలివరీ చేసింది. అంటే సెకనుకు దాదాపు మూడు వాహనాలను డెలివరీ చేసినట్లయింది.ఈ విజయం మారుతీ సుజుకీ విస్తృతమైన సర్వీస్ నెట్వర్క్ సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. మెట్రో నగరాలు, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో 5,400కుపైగా సర్వీసు సెంటర్లున్నాయని సంస్థ పేర్కొంది. తాజా రికార్డులో భాగంగా పెయిడ్ సేవలు, ఉచిత సేవలు, రన్నింగ్ రిపేర్లు ఉన్నాయి.ఇదీ చదవండి: మీ వయసు 30 లోపా? తప్పక తెలియాల్సినవి..ఈ సందర్భంగా మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి టకేచి మాట్లాడుతూ ‘కంపెనీ చరిత్రలో ఒక నెలలో 24.5 లక్షలకు పైగా వాహనాలకు సర్వీస్ చేయడం ఇదే మొదటిసారి. ఇది సర్వీస్ నెట్వర్క్ స్థాయిని, సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. దేశవ్యాప్తంగా మా సేవా బృందాలు, డీలర్ భాగస్వాముల అవిశ్రాంత కృషి ఫలితమిది’ అన్నారు. -
ఇదేందయ్యా ఇది.. రూ.11 లక్షల కారు రిపేరుకు రూ.22 లక్షలు!
సాక్షి, బెంగళూరు: వరదలతో పాడైపోయిన కారును బాగు చేయించుకుందామనుకున్న ఓ వ్యక్తికి విచిత్రమైన సంఘటన ఎదురైంది. తన కారు రిపేర్ కోసం సర్వీస్ సెంటర్ వాళ్లు ఇచ్చిన ఎస్టిమేట్ స్లిప్ చూసి అవాక్కయ్యాడు. రూ.11 లక్షల విలువైన వోక్స్వాగన్ పోలో హ్యాచ్బ్యాక్ కారును రిపేర్ చేసేందుకు రూ.22 లక్షలు అవుతుందని అంచనా వేశారు. తనకు ఎదురైన ఈ సంఘటనను లింక్డ్ఇన్లో షేర్ చేశారు అనిరుధ్ గణేశ్. బెంగళూరులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గణేశ్ కారు పాడైపోయింది. పూర్తిగా నీటిలో మునిగిపోవటంతో ఇంజిన్ పనిచేయటం లేదు. దాంతో వోక్స్వాగ్ సర్వీస్ సెంటర్కు తీసుకెళ్లారు గణేశ్. సుమారు 20 రోజుల తర్వాత కారు సర్వీస్ కోసం రూ.22 లక్షలు అవుతుందని అంచనా వేసి పంపించారు. దీంతో ఇన్సూరెన్స్ సంస్థను సంప్రదించారు గణేశ్. కారు పూర్తిగా పాడైపోయిందని, దానిని రిపేర్ సెంటర్ నుంచి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు. అయితే.. అక్కడి నుంచి తీసుకెళ్లాలంటే రూ.44,840 చెల్లించాలని సర్వీస్ సెంటర్ వాళ్లు చెప్పటంతో మరోమారు అవాక్కవ్వాల్సి వచ్చింది. కారు డ్యామేజ్ అంచనా వేసేందుకు పత్రాలు సిద్ధం చేసినందుకు గానూ ఆ ఫీజు కట్టాలని సూచించారు. ఈ విషయంపై వోక్స్వాగన్ సంస్థకు ఫిర్యాదు చేశారు గణేశ్. చివరకు రూ.5000 వేలు కట్టి కారు తీసుకెళ్లాలని సంస్థ సూచించింది. కారు రిపేరు కోసం ఇచ్చిన ఎస్టిమేషన్ స్లిప్ ఇదీ చదవండి: దసరా ఎఫెక్ట్: హైవేలపై పెరిగిన వాహనాల రద్దీ -
త్వరలో ఆర్టీసీ సర్వీసింగ్ సెంటర్లు
సాక్షి, అమరావతి: ఆదాయ మార్గాలు పెంచుకునే దిశగా ఆర్టీసీ సన్నాహాలు ముమ్మరం చేసింది. ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి ఉన్న విలువైన భూములను వాణిజ్య అవసరాలకోసం సద్వినియోగం చేసుకోవడంపై దృష్టిసారించింది. ఆర్థిక శాఖ సూచనలతో ఈ దిశగా కార్యాచరణ ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఆర్టీసీ గ్యారేజీలు, డిపోలను ప్రైవేట్ వాహనాల సర్వీసింగ్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఆర్టీసీకి ప్రస్తుతం రాష్ట్రంలో విలువైన ప్రదేశాల్లో గ్యారేజీలు, డిపోలు ఉన్నాయి. ఒక్కో గ్యారేజీ పది ఎకరాల్లోను, డిపోలు ఆరేడు ఎకరాల్లోను విస్తరించి ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల సర్వీసింగ్ చేస్తున్నారు. అదే గ్యారేజీలు, డిపోల్లో ప్రైవేటు వాహనాలకు కూడా సర్వీసింగ్ సేవలు అందించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటికే ఆర్టీసీ విజయనగరం, ఏలూరు, కర్నూలుల్లో టైర్ సర్వీసింగ్ సెంటర్లను నిర్వహిస్తోంది. అదే రీతిలో రాష్ట్రంలోని ఆర్టీసీ గ్యారేజీలు, డిపోలలో పూర్తిస్థాయిలో ఆటోమొబైల్ సర్వీసింగ్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఈ మేరకు కార్యాచరణ చేపట్టేందుకు అధికారుల కమిటీని నియమించింది. తక్కువ చార్జీతో మెరుగైన సేవలు ప్రైవేటు సర్వీసింగ్ సెంటర్ల కంటే మెరుగైన రీతిలో తక్కువ ధరకు వాహనాల సర్వీసింగ్ సేవలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. సాధారణ సర్వీసింగ్, అన్ని రకాల రిపేర్లు, బాడీ పెయింటింగ్, వాటర్ సర్వీసింగ్ మొదలైన సేవలు అందిస్తారు. ఆర్టీసీ టెక్నికల్ స్టాఫ్ స్కిల్డ్ సేవలు అందిస్తారు. అన్స్కిల్డ్ సేవల కోసం అవుట్ సోర్సింగ్ విధానంలో సిబ్బందిని నియమిస్తారు. ప్రస్తుతం గ్యారేజీల్లో ఉన్న మౌలిక వసతులతోపాటు అవసరమైన యంత్ర పరికరాలు కొనుగోలు చేస్తారు. ఆర్టీసీ వాహనాలు, ప్రైవేటు వాహనాలకు వేర్వేరుగా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఏర్పాటు చేస్తారు. ఆర్టీసీ వాహనాల స్పేర్ పార్టులు, ప్రైవేటు వాహనాల స్పేర్ పార్టులకు వేర్వేరుగా స్టోర్ రూమ్లు, రికార్డులు నిర్వహిస్తారు. తద్వారా ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చూస్తారు. తొలిదశలో భారీ వాహనాలకు సర్వీసింగ్ సేవలను అందుబాటులోకి తెస్తారు. అనంతరం కార్లు, ఎస్యూవీలు, ఇతర వాహనాల సర్వీసింగ్ అందిస్తారు. తొలిదశలో నాలుగైదు కేంద్రాల్లో రెండు నెలల్లో సర్వీసింగ్ సేవలను ప్రారంభించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అనంతరం అన్ని ఆర్టీసీ డిపోలు, గ్యారేజీల్లో ప్రైవేటు వాహనాల సర్వీసింగ్ సేవలను విస్తరించనున్నారు. ప్రైవేటు సర్వీసింగ్ కేంద్రాల కంటే మెరుగైన రీతిలో తక్కువ చార్జీలకు ఆర్టీసీ ఆటోమొబైల్ సర్వీసింగ్ సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆర్టీసీ ఈడీ కృష్ణమోహన్ చెప్పారు. -
పని చేసే చోటే చోరీ!!... అయితే చివరికి...
గచ్చిబౌలి: పని చేసే గ్యారేజ్కు కన్నం వేసిన ఓ మెకానిక్ భారీ చోరీకి పాల్పడి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. అసీఫ్నగర్కు చెందిన మహ్మద్ తాహెర్ అయ్యప్పసొసైటీలోని శ్రీ మోటార్స్ మల్టీబ్రాండ్ లగ్జరీ కారు సర్వీసింగ్ సెంటర్లో మెకానిక్గా పని చేస్తున్నారు. షోరూం యజమాని గేడంపేట్లో మరో షోరూమ్ను ఏర్పాటు చేసేందుకు నగదు తీసుకువచ్చి సర్వీసింగ్ సెంటర్లోని అల్మారా పెట్టాడు. ఈ విషయాన్ని గుర్తించిన తాహెర్ నగదు కాజేసేందుకు తన స్నేహితులైన సయ్యద్ జావెద్, సైఫ్ మొయినొద్ధీన్తో కలిసి పథకం పన్నాడు. తెల్లవారు జాము ముగ్గురు కలిసి బైక్పై గ్యారేజ్కు వచ్చారు. తాహెర్ దూరంగా ఉండి వచ్చిపోయేవారిని గమనిస్తుండగా, సైఫ్ మొయినొద్ధీన్ సర్వీస్ సెంటర్ వెనక డోర్ స్క్రూలు తొలగించి లోపలికి ప్రవేశించాడు. లాకర్ను తెరిచి నగదు తీసుకెళ్లాడు. మర్నాడు వాచ్మెన్ బాలరాజు అల్మారా తలుపు తెలిచి ఉండటాన్ని గుర్తించి యజమానికి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు తాహెర్గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించాడు. అతడు ఇచ్చిన సమాచారంతో మిగతా నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.55 లక్షల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. చోరీ సొత్తు మూడు భాగాలుగా.. చోరీ చేసిన సొమ్మును తాహెర్ రూ.20 లక్షలు, జావెద్ రూ.20 లక్షలు, సైఫ్ మొయినొద్ధీన్ రూ.15 లక్షలు పంచుకున్నారు. అయితే ఇందులోంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు తాహెర్ యథావిధిగా సర్వీసింగ్ సెంటర్కు వస్తున్నాడు. దాదాపు 45 మందిని విచారించిన పోలీసులు చివరికి తాహెర్ను నిందితుడిగా గుర్తించారు. సమావేశంలో మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, సీఐ రాజేంద్ర ప్రసాద్, ఎస్ఓటీ సీఐ శివ ప్రసాద్, ఎస్ఐ విజయ వర్ధన్ పాల్గొన్నారు. -
రూ.200 కోసం!
మన కారో.. బైకో నెలకోసారైనా వాటర్ సర్వీసింగ్కు ఇస్తుంటాం. అయితే ఆ డబ్బులు ఎందుకు వృథా చేయడం అనుకున్నవారు ఏం చేస్తారు. ఇంట్లోనే బకెట్లో నీరు తీసుకుని ఎంచక్కా పొద్దున్నే శుభ్రం చేసుకుంటారు. అయితే ఓ చైనీయుడు మాత్రం రూ.200ను ఆదా చేసుకునేందుకు ఓ చెత్త ఆలోచన చేశాడు. ఆ తర్వాత నాలుక్కరుచుకున్నాడు. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్కు చెందిన ఓ వ్యక్తి తన ఖరీదైన ల్యాండ్రోవర్ ఎస్యూవీని కడుక్కోవాలనుకున్నాడు. అయితే అందుకు రూ.200 ఖర్చు అవుతుందని వెనుకడుగు వేశాడు. అంతేకాదు ఎంచక్కా తనే శుభ్రం చేయాలని భావించాడు. అదేదో తన ఇంటిలోనే కడిగితే ఇది వార్తే కాదు. ఇంతకీ అతడేం చేశాడంటే.. దగ్గర్లో ఉన్న నదిలో కారును శుభ్రం చేయాలని భావించాడు. అనుకున్నదే తడవు అక్కడికి వెళ్లి ఒడ్డుకు దగ్గరగా తక్కువ ప్రవాహం ఉన్న ప్రాంతంలోకి కారును దింపి.. శుభ్రం చేసుకుంటున్నాడు. అయితే అప్పుడే పక్కనే ఉన్న డ్యాం నుంచి గేట్లు తెరిచారు. దీంతో ఆ కారున్న చోటికి నీటి ప్రవాహం పెరిగింది. వెంటనే మనోడు పక్కనే ఉన్న ఓ బండరాయిపైకి చేరుకున్నాడు. కానీ వెళ్లిపోతున్న కారును తీసుకురాలేకపోయాడు. వెంటనే అక్కడున్న జనం ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని కారును ఒడ్డుకు చేర్చారు. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమంలో పెట్టడంతో నెటిజన్లు జోకుల మీద జోకులు పేలుస్తున్నారు. పాపం రూ.200ల కోసం చూసుకుంటే దాదాపు 50 లక్షల కారును పోగొట్టుకునే వాడు పాపం! -
ఆన్లైన్లో జాగ్రత్త సుమా!
తక్కువ ధరకు వస్తోంది కదా అని శ్రీనివాస్ ఆన్లైన్లో ల్యాప్టాప్ కొన్నాడు. రెండునెలలు వాడాక బాగా స్లోగా ఉండటంతో హార్డ్వేర్ నిపుణుడైన స్నేహితుడికి చూపించగా... దాన్లో నాసిరకం విడిభాగాలున్నట్లు చెప్పాడు. కంపెనీ సర్వీసింగ్ సెంటర్కి తీసుకెళ్లి చూపిస్తే అది ఆథరైజ్డ్ డీలర్ వద్ద కొన్నది కాదని, వారంటీ ఇవ్వలేమని చెప్పేశారు. నచ్చకుంటే తిరిగి పంపడానికి ఆన్లైన్ కంపెనీ ఇచ్చిన గడువు అప్పటికి పూర్తయిపోవటంతో చేసేదేమీ లేక తలపట్టుకున్నాడు.సుకుమార్ది మరో కథ. ఆన్లైన్లో ఫోన్ కొన్నాడు. ఫోన్ బాగానే ఉంది. వారం రోజులు వాడాక మోజు తీరింది. నచ్చకపోతే తిరిగి పంపడానికి కంపెనీ ఇచ్చిన గడువింకా ఉండటంతో వెనక్కి పంపేశాడు. కంపెనీ తిరిగి తీసుకుని.. డబ్బులు ఆన్లైన్లోనే వెనక్కిచ్చేసింది. సుకుమార్కు మొబైల్ పంపిన కంపెనీ (సెల్లర్) నిజానికి పక్కాగా ఒరిజినల్ వస్తువులు పంపేదే. కానీ సుకుమార్ తిరిగి పంపేయటంతో ఆన్లైన్ కంపెనీ నిబంధనల ప్రకారం దాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదు. ఆ వస్తువు వాడేసింది కావటంతో పూర్తి ధరకు అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది. నష్టపోవటం సెల్లర్ వంతయింది. ఇవండీ ఆన్లైన్ కథలు... నిజానికివన్నీ చిన్నచిన్న సమస్యలే. తక్కువ మందికి పరిమితమైనవే. కానీ ఇప్పుడిప్పుడే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఈ-కామర్స్ రంగంపై వీటి ప్రభావం మాత్రం తక్కువేమీ కాదు. ఈ-కామర్స్ బూమ్ను ఆసరా చేసుకుని కొందరు విక్రేతలు నాసిరకం ఉత్పత్తులను, కొత్తగా మార్చిన పాత ఉత్పత్తులను అంటగడుతున్నారు. కొందరు కస్టమర్లు ప్రొడక్టులో లోపంలేకున్నా.. నచ్చలేదంటూ వెనక్కిచ్చేస్తున్నారు. ప్యాక్లో రాళ్లు వచ్చాయనేవారు కొందరైతే... విడిభాగాలను మార్చేసే కస్టమర్లు మరికొందరు. ఇవన్నీ ఈ-కామర్స్ రంగం ముందున్న సవాళ్లు. రిటర్న్స్ పాలసీ మారాలా? ఉత్పత్తికి ఏదైనా నష్టం వాటిల్లినా, లోపమున్నా వెనక్కిచ్చి కొత్తది పొందొచ్చు. డబ్బులూ వెనక్కి పొందొచ్చు. ప్రొడక్ట్ నచ్చకపోయినా మార్చుకోవచ్చు. విభాగం, ఈ-కామర్స్ కంపెనీనిబట్టి కస్టమర్లు 7-30 రోజుల్లో ఉత్పత్తులను వెనక్కి పంపే వీలుంది. కస్టమర్ల డబ్బులకు రక్షణ కల్పించేందుకే ఈ-కామర్స్ కంపెనీలు రిటర్న్స్ పాలసీని పాటిస్తున్నాయి. కస్టమర్లు ఫిర్యాదు చేస్తే విక్రేతలు ఆ ఉత్పత్తిని వెనక్కి తీసుకోవాల్సిందే. లేకపోతే ఆన్లైన్ కంపెనీలు విక్రేతలకు చెల్లింపులను నిలిపివేస్తాయి. ఎలక్ట్రానిక్స్లోనే అధిక నకిలీలు... అంతర్జాతీయ బ్రాండ్ల పేరిట నాసిరకం ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు వచ్చేస్తున్నాయి. భారత ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో ఈ నకిలీల వాటా 5 శాతంతో రూ.2,500 కోట్ల వరకూ ఉంటుందని అంచనా కాగా ఇది 2015లో రూ.5,600 కోట్లకు చేరుకుంటుందని ఈ మధ్య టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్వయంగా చెప్పారు. నియంత్రణ లేకపోవటంతో ఇవి ఆన్లైన్లోకి చొరబడుతున్నాయి. ఉదాహరణకు రవికిరణ్ అనే కార్పొరేట్ ఉద్యోగి అలీబాబాకు చెందిన అలీ ఎక్స్ప్రెస్.కామ్లో రూ.6,500 విలువగల లెనోవో స్మార్ట్ఫోన్ బుక్ చేశారు. ఆయనకు నకిలీది రావటంతో కంపెనీకి ఫిర్యాదు చేశాడు. విక్రేత ఆ ఫోన్తో పాటు రూ.4 వేలు పరిహారంగా చెల్లించాడు. ఆన్లైన్ కంపెనీలపై ఫిర్యాదులు పెరుగుతున్నాయని, అధీకృత రిటైలర్ల వద్ద కొంటే సమస్యలుండవని సిరి కమ్యూనికేషన్స్ ప్రమోటర్ ఎం.చిరంజీవి, టెక్నోవిజన్ ఎండీ సికందర్ చెప్పారు. మోసాల ప్రభావం ఇదీ... కొందరు కస్టమర్లు విడిభాగాలను మార్చి, ఉత్పత్తి బాగులేదన్న కారణంతో తిరిగి పంపేస్తారు. ఐటీ ఉత్పత్తుల విక్రయాల్లో ఉన్నవారు ఎక్కువగా ఇలాంటివి చేస్తుండటంతో ఐటీ ఉత్పత్తుల దుకాణాలు అధికంగా ఉన్న అమీర్పేట, సికింద్రాబాద్ ప్రాంతాలకు డెలివరీ ఇచ్చేందుకు ఈ-రిటైలర్లు నో చెబుతున్నారు. ఆన్లైన్ వల్ల తమ అమ్మకాలు పడిపోయాయని, అందుకే తామూ ఆన్లైన్లోకి వెళ్లామనేది వ్యాపారి హమీద్ మాట. ఆన్లైన్ ధరల పోటీని తట్టుకోవడానికి ఒకోసారి విడిభాగాలను మారుస్తున్నట్లు అంగీకరించారాయన. ‘‘ఒరిజినల్ 2జీబీ ర్యామ్ రూ.2,500, హార్డ్ డిస్క్ 1 టీబీది రూ.4 వేల దాకా ఉంటుంది. వీటిని మార్చకపోతే మరీ తక్కువ ధరకు అమ్మటం కష్టం’ అన్నారాయన. మరో వ్యాపారి రవీందర్ మాట్లాడుతూ... ‘‘డెల్ ఐ3 3541 మోడల్ డీలర్ ధర రూ.29,500. హైదరాబాద్లోని గ్రే మార్కెట్ వ్యాపారులకు రూ.23 వేలకే వస్తోంది. వారు ఆన్లైన్లో తక్కువ లాభానికే అమ్ముతున్నారు’’ అని చెప్పారు. తాము ఒరిజినల్ వస్తువులు విక్రయిస్తున్నా 10 శాతంపైగా వస్తువులు వెనక్కి రావడంతో ఆన్లైన్కు గుడ్బై ెప్పేశామని మొబైల్ వ్యాపారి శ్రీనివాస్ వెల్లడించారు. ‘‘ల్యాప్టాప్లు 7వేల వరకూ అమ్మితే 1500 వరకూ తిరిగొచ్చేశాయి. వీటిలో అధికం అమీర్పేట్, సికింద్రాబాద్ ప్రాంతాలకు డెలివరీ ఇచ్చినవే. అందుకే ఆన్లైన్కు గుడ్బై చెప్పేశాం’’ అన్నారాయన. సీటీసీకి చెందిన 80 శాతం మంది వ్యాపారులు ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ నుంచి తప్పుకున్నట్లు మరో వ్యాపారి నిజాముద్దీన్ చెప్పారు. - హైదరాబాద్, బిజినెస్ బ్యూరో


