breaking news
ratha saptami
-
అధికార గణం ‘అతి’రథ సేవ ఆదిత్యుని సాక్షిగా ప్రత్యక్ష నరకం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణస్వామి దర్శన ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. వీవీఐపీల సేవలకు పెద్దపీట వేసి, సామాన్య భక్తులను పూర్తిగా విస్మరించింది. అరగంటలో దర్శనం కల్పిస్తామని ప్రకటించి ఏడెనిమిది గంటలకుపైగా ప్రత్యక్ష నరకం చూపించింది. అధికారులు, పాలకుల సమన్వయ లోపంతో కిక్కిరిసిన క్యూలైన్లలో కొందరు స్పృహ తప్పి పడిపోయారు. ప్రధాన జంక్షన్ల వద్ద తోపులాటలు జరిగాయి. శనివారం అర్ధరాత్రి నుంచే స్వామి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో పడిగాపులు కాసినా దర్శనభాగ్యం కలగకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. తిరుపతి, కాశీబుగ్గ, సింహాచలం వంటి ఘటనల తర్వాత కూడా బాబు సర్కారు తీరు మార లేదనడానికి అరసవల్లిలో తాజాగా భక్తులు పడిన ఇబ్బందులే నిదర్శనం. తొలిసారిగా టిక్కెట్ల దర్శనాలు రద్దు.. వారం రోజుల రాష్ట్ర స్థాయి పండగలో ఆఖరి ఘట్టమైన ఆదిత్యుని దర్శనం కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. అరగంటలో దర్శనం కల్పిస్తామని ప్రజాప్రతినిధులు ప్రకటించడంతో భక్తులు పోటెత్తారు. అయితే అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. భక్తులకు దర్శనం కల్పించలేక ఆఖరికి దర్శన పాసులను, టిక్కెట్లను రద్దు చేస్తున్నట్లుగా తొలిసారిగా ప్రకటించాల్సిన దుస్థితి ఎదురైంది. శనివారం అర్ధరాత్రి క్షీరాభిషేక సమయంలోనూ పరిస్థితి దయనీయంగా మారింది. క్షీరాభిషేకానికి పాట్లు ఆలయంలో ఏటా క్షీరాభిషేక సేవ ఓ పద్ధతిలో జరుగుతుంది. ఈ ఏడాది పోలీసుల ఆంక్షలు, నిర్వహణ లోపం వల్ల సిబ్బంది పాల బకెట్లను తీసుకువెళ్లే మా ర్గం ఇబ్బందికరంగా మారింది. ఆఖరికి స్వామికి క్షీరాభిõÙకం చేయడానికీ పాట్లు పడాల్సి వ చ్చింది. శఠగోపం, తీర్థం కూడా ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్వామికి పట్టువ్రస్తాలను శనివారం అర్ధరాత్రి సమర్పించారు. ఆయన వెంట కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ఉన్నారు. వీరితోపాటు జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, హోంమంత్రి వంగలపూడి అనిత ఆదిత్యుని దర్శనం చేసుకున్నారు. కూటమి ప్రజాప్రతినిధుల సేవలో తరించిన అధికారులు సామాన్య, దాతృత్వం కల భక్తులకు నరకం చూపారు. ఆలయ పునర్నిర్మాణ దాత దివంగత వరుదు బాబ్జీరావు కుటుంబం కూడా దర్శనం సమయంలో తోపులాటలో చిక్కుకోవాల్సి వచ్చింది. బాబ్జీరావు కుమార్తె, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఆమె సోదరులూ అవస్థలు పడుతూనే అంతరాలయంలోకి వెళ్లాల్సి వ చ్చింది. జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీనివాస్ తన వాళ్లకు దర్శనాలు కాలేదని మళ్లీ దర్శనానికి వ చ్చి.. వైకుంఠ ద్వారం నుంచి బయటకు వచ్చారు. రథ సప్తమి రోజున ఉత్తర ద్వార దర్శనాలు చేయించడంపైనా విమర్శలు చెలరేగాయి. సామాన్యుల అవస్థలు వర్ణనాతీతం కేంద్ర, రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధులు, వీవీఐపీలు, స్థానిక ఎమ్మెల్యేల వెనుక వందలాది మంది అనుచరులు రావడంతో రథసప్తమి అర్ధరాత్రి దర్శనాల్లో సామాన్యులకు ప్రత్యక్ష నరకం కనిపించింది. ఉచిత, రూ.100, రూ.300 క్యూలలో వచ్చే సామాన్య భక్తుల నుంచి రూ.500లు, డోనర్ పాసులు ఉన్న వారూ పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల అవస్థలైతే వర్ణణాతీతం. పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రధానంగా కూటమి నేతలు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులకు మాత్రమే ప్రత్యేక దర్శనాలు జరిగాయి. క్యూలలో ఉన్న భక్తులు కుయ్యోమొర్రోమన్నా కనీసం వారిని పట్టించుకోలేదు. శనివారం రాత్రి 12 గంటలకు దర్శనాలు మొదలుకుని ఆదివారం సాయంత్రం వరకూ వేలకొద్ది వీవీఐపీ, వీఐపీ పాసులు రావడం గమనార్హం. దీనివల్ల మూడుచోట్ల తోపులాటలు జరిగాయి. ఉదయం 11 గంటల సమయంలో తొక్కిసలాట జరగడంతో పలువురు భక్తులు స్పృహతప్పి పడిపోగా, మరికొందరికి గాయాలయ్యాయి. చిన్నారుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఎటు వెళ్లాలో తెలిపే బోర్డులు ప్రదర్శించకపోవడంతో భక్తులు గందరగోళానికి గురయ్యారు. -
సప్త వాహనాలపై సప్తగిరీశుడు
ఈ విశ్వంలో కేవలం శ్రీ సూర్యనారాయణ స్వామి మాత్రమే ఏడు కిరణాలు కలిగి, ఒకే ఒక చక్రం కలిగిన ఏడు గుర్రాలతో, అనూరువైన సారథి నడుపుతున్న రథాన్ని అధిరోహించి అంతరిక్షంలో మన మాంసనేత్రంతో చూడగలిగే ప్రత్యక్ష దైవం. అటువంటి అద్భుత దివ్య మూర్తి ఎక్కిన రథం ప్రత్యేకతను తెలియజేస్తూ, మాఘ శుద్ధ సప్తమిన ఆవిర్భవించిన శ్రీ సూర్య నారాయణుని పుట్టినరోజును, సూర్య భగవానునికి అత్యంత ప్రియమైన సప్తమిని ‘‘రథసప్తమి’’ పేరుతో జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా తిరుమలలో శ్రీవారు నేడు ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. ఆ విశేషాలు...కొందరు రథ సప్తమినే సూర్యజయంతి అంటారు. కానీ నిజానికి సూర్యుడు పుట్టినరోజు కాదిది. సూర్యుడు తన ఉష్ణచైతన్యాన్ని లోకులకు పంచిపెట్టడం కోసం రథాన్నెక్కి విధుల్లో ప్రవేశించిన రోజు ఇది. అయితే లోకంలో సూర్యజయంతిగానే గుర్తింపు పొందింది. ఇక్కడ రథారోహణమే ప్రధానకృత్యం. లోకబాంధవ ధర్మానికి సిద్ధపడిన రోజు కనుక రథసప్తమి అయ్యింది.సూర్యుడు రథోద్యోగంలో చేరింది మొదలు రాత్రింబవళ్లు తిరుగుతూనే ఉన్నాడు. ఒక్క నిమిషం కూడా ఎక్కడా కూర్చునే ఉద్యోగం కాదది. ఆయన సారథీ అంతే.. వికలాంగుడైన అనూరుడు క్షణం విశ్రాంతి తీసుకోడు. ఎప్పుడూ విధి నిర్వహణలోనే ఉంటాడు.సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజులలో ఈ వృత్తాన్ని పూర్తిచేస్తాడు. అంటే ఒక సంవత్సరం. అందుకే జ్యోతిషులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి, ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా, విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీరే ద్వాదశ మాసాలకూ ఆధిదేవతలు. వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. మాఘమాసంలో ‘అర్క‘ నామంతో సంచరిస్తాడు.సూర్యారాధన ఫలాలుఈ రథసప్తమి రోజునే శ్రీ సూర్య భగవానుడు సత్రాజిత్తుకి శమంతక మణిని ప్రసాదించాడని చె΄్తారు. శ్రీ సూర్యభగవానుని గురువుగా ప్రార్థించి శ్రీ ఆంజనేయస్వామి చతుర్వేదాలను, ఉపనిషత్తులను, వ్యాకరణాన్ని అభ్యసించాడు. యాజ్ఞవల్క్య మహర్షి శ్రీ సూర్య భగవానుని నుంచి ఉపనిషద్ జ్ఞానాన్ని పొందాడు. శ్రీ సూర్యనారాయణ స్వామిని ప్రార్థించి ధర్మరాజు అక్షయపాత్రను పొందాడు. సూర్య నారాయణ స్వామిని నిత్యం ప్రార్థించే ద్రౌపదీ దేవిని కీచకుడు సమీపించ బోతున్నప్పుడు సూర్య భగవానుడు ఒక గంధర్వుడిని ఆమె రక్షణకు పంపాడు. అతను గుప్తంగా వచ్చి, కీచకుడిని తోసేసి, ద్రౌపదిని రక్షించాడు. మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణంతో సమానం. అరుణోదయ వేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణాదులు అనేక కోట్ల రెట్లు పుణ్యఫలాలను, ఆయురారోగ్య సంపదలను ఇస్తాయని శాస్త్రవచనం. రథసప్తమి ... శ్రీవారి వాహన సేవల వివరాలురథసప్తమి సందర్భంగా తిరుమలలో స్వామివారు ఈనెల 25వ తేదీ, ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాలపై ఊరేగుతూ భక్తులకు ద్శనమిస్తారుఉదయం 5.30 నుండి 8 వరకు : సూర్య ప్రభ వాహనం ఉదయం 9 నుండి 10 వరకు : చిన్న శేష వాహనం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 వరకు : గరుడ వాహనం మధ్యాహ్నం 1 నుండి 2 వరకు : హనుమంత వాహనం మధ్యాహ్నం 2 నుండి 3 వరకు : చక్రస్నానం సాయంత్రం 4 నుండి 5 వరకు : కల్పవృక్ష వాహనం సాయంత్రం 6 నుండి 7 వరకు : సర్వభూపాల వాహనంరాత్రి 8 నుండి 9 వరకు : చంద్రప్రభ వాహనం– అలిదేన లక్ష్మీకాంత్, సాక్షి, తిరుమల -
ఔరా! సౌరా!
లోకానికి వెలుతురు, వెచ్చదనం ఇచ్చేది సూర్యభగవానుడు...సూర్యుడే భూమి మీదనున్న ప్రాణులన్నింటికీ జీవనాధారం...చరిత్రపూర్వ యుగంలో మనుషులు సూర్యుడిని ఆరాధించేవారు.ప్రపంచానికి వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడిని ప్రత్యక్ష నారాయణుడిగా కొలుస్తారు. సూర్యుడిని జ్యోతిషశాస్త్రం గ్రహరాజుగా పరిగణిస్తుంది. మన దేశమంతటా ప్రాచీనకాలంలో వ్యాప్తిలో ఉన్న షణ్మతాలలో సౌరమతం కూడా ఒకటి. మన దేశంలోనే కాదు, ప్రాచీనకాలంలో ఇతర దేశాలలో కూడా సౌర ఆరాధన ఉండేది. చరిత్రను పరిశీలిస్తే, ఆదిత్యుడినే ఆదిదేవుడని చెప్పవచ్చు. ప్రాచీన ఈజిప్టు భూభాగంలో చరిత్ర పూర్వయుగం నుంచే సూర్య ఆరాధన వ్యాప్తిలో ఉండేది. ఈజిప్షియన్ ప్రజలు సూర్యుడిని ‘ర’, ‘రె’ అనే పేర్లతో పూజించేవారు. క్రీస్తుపూర్వం మూడో సహస్రాబ్ది నాటికి ఈజిప్షియన్ల ప్రధాన దైవాలలో ‘ర’కు ప్రత్యేక స్థానం ఉండేది. క్రీస్తుపూర్వం రెండో సహస్రాబ్దిలో వర్ధిల్లిన మెసపొటేమియన్ నాగరికతకు చెందిన ప్రజలు సూర్యుడిని ‘షమాష్’ అనే పేరుతోను, సుమేరియన్లు ‘ఊటూ’ అనే పేరుతోను పూజించేవారు. క్రీస్తుపూర్వం రెండో సహస్రాబ్దిలోనే భారత భూభాగంలో మొదలైన వైదిక యుగంలో వైదికార్యులు సూర్యుడిని విశేషంగా ఆరాధించేవారు. సూర్యుడిని ఆరోగ్యప్రదాతగా వేదాలు కీర్తించాయి. సౌర ఆరాధనకు నిదర్శనంగా పురాతనమైన కొన్ని సూర్య దేవాలయాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన ఆలయాల గురించి తెలుసుకుందాం...మార్తాండ దేవాలయంఇది కశ్మీర్లోని మట్టన్ పట్టణంలో ఉంది. దేశంలోని పురాతన సూర్య దేవాలయాలలో ఇదొకటి. పురాతత్త్వ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ సూర్య దేవాలయం సుమారు క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్ది నాటిది. ప్రస్తుతం ఇది శిథిలావస్థకు చేరుకుంది. విదేశీయుల దాడుల్లో కొంత, తర్వాత సంభవించిన భూకంపాలలో కొంత ఈ ఆలయం చాలావరకు ధ్వంసమైంది. పీఠభూమి ప్రాంతంలో ఉన్న మట్టన్ పట్టణంలో ఎత్తయిన ప్రదేశంలో నిర్మించిన మార్తాండ ఆలయం వద్ద నుంచి తిలకిస్తే, దిగువనున్న కశ్మీర్ లోయ ప్రాంతం అంతా కనిపిస్తుంది. మార్తాండ ఆలయ ప్రాంగణంలో 84 ఉపాలయాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ఆలయ పరిరక్షణ బాధ్యతలను పర్యవేక్షిస్తోంది.కోణార్క దేవాలయం ఈ ఆలయం ఒడిశాలోని కోణార్క పట్టణంలో ఉంది. తూర్పు గంగవంశానికి చెందిన గజపతి లాంగూల నరసింగదేవుడు పదమూడో శతాబ్దిలో దీనిని నిర్మించాడు. దీని నిర్మాణం 1238–64 మధ్య కాలంలో జరిగింది. కళింగ శిల్పకళా చాతుర్యానికి అద్దం పట్టే కోణార్క ఆలయంలో ప్రధానంగా రెండు నిర్మాణాలు కనిపిస్తాయి. వీటిలో ఒకటి నాట్యమండపం కాగా, మరొకటి గర్భాలయం. ఈ ఆలయం కొంత శిథిలమైనా, చాలావరకు శిల్పసంపద ఇంకా చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. ఈ ఆలయంలో ముప్పయిమూడు అడుగులకు పైగా ఉండే అరుణ స్తంభం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. సూర్యుడి రథాన్ని పోలిన ఆలయ నిర్మాణం, రథ చక్రాలపై సైతం సూక్ష్మమైన శిల్పాలు ఆనాటి శిల్పుల నైపుణ్యానికి అద్దం పడతాయి. పూరీలో వెలసిన జగన్నాథుడి ఆలయానికి కోణార్క ఆలయాన్ని సింహద్వారంగా భావిస్తారు. ఈ ఆలయంలో పలు కళా సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతుంటాయి. ఈ వేడుకలతో పాటు కోణార్క సముద్ర తీరంలో ఏటా కోణార్క్ బీచ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది.రహీల్యా సాగర్ సూర్య దేవాలయం ఈ ఆలయం ఉత్తరప్రదేశ్లోని మహోబా పట్టణంలో ఉంది. క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దికి చెందిన చందేలా రాజు రహీలా ఈ సూర్య దేవాలయాన్ని నిర్మించాడు. రహీల్యా సాగర్ తటాకం ఒడ్డున నిర్మించిన ఈ ఆలయం ఆనాటి శిల్పకళా వైభవానికి నిదర్శనంగా ఈనాటికీ నిలిచి ఉంది. ఈ ఆలయం ఉన్న మహోబా పట్టణాన్ని త్రేతాయుగంలో కేకపురం అని, ద్వాపరయుగంలో పాటనపురం అని పిలిచేవారని చెబుతారు. మహోబా పట్టణం, ఆ పరిసరాలకు సంబంధించి పలు పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. వనవాస కాలంలో సీతారాములు ఇక్కడ కొన్నాళ్లు గడిపినట్లు చెబుతారు. ఇక్కడకు సమీపంలోని తటాకాన్ని ‘రామకుండ్’ అంటారు. గోరఖ్గిరి కొండ గుహను ‘సీతా రసోయి’ అంటారు. ఈ తటాకంలోనే సీతారాములు స్నానాలు చేసేవారని, గుహలో సీతమ్మవారు వంటచేసేవారని చెబుతారు. చందేలా రాజులు చంద్రవంశీకులైనా, ఈ ప్రదేశానికి సూర్యవంశీయుడైన రాముడితో సంబంధం ఉండటంతో ఇక్కడ సూర్య దేవాలయాన్ని నిర్మించారని చెబుతారు. ఈ ఆలయంలో సభా మంటపం, గర్భాలయం ప్రధాన భాగాలుగా కనిపిస్తాయి. వినాయకుడు, త్రిమూర్తులు సహా అనేక దేవతలు, పురాణగాథల శిల్పాలు ఆలయ కుడ్యాలు, స్తంభాలపై కనువిందు చేస్తాయి. ప్రస్తుతం ఈ ఆలయాన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షిస్తోంది. మోధేరా సూర్య దేవాలయం ఇది గుజరాత్లోని మెహసానా జిల్లా మోధేరా గ్రామంలో ఉంది. చాళుక్య/ సోలంకీ వంశానికి చెందిన ఒకటో భీముడు మోధేరా గ్రామంలో సూర్య దేవాలయాన్ని పుష్పావతీ నదీతీరంలో నిర్మించాడు. ఈ ఆలయం వద్ద నిర్మించిన శిలా శాసనం ప్రకారం దీని నిర్మాణం విక్రమశకం 1083 (క్రీస్తుశకం 1026–27) సంవత్సరంలో జరిగినట్లు తెలుస్తోంది. మారు గుర్జర వాస్తు శైలిలో చేపట్టిన ఈ ఆలయ నిర్మాణం ఆనాటి శిల్పకళా వైభావాన్ని నిదర్శనంగా నిలిచి ఉంది. ఈ ఆలయంలో ప్రవేశమార్గంలో కీర్తితోరణం, దానికి ఎదురుగా సభా మండపం, అది దాటిన తర్వాత గూఢమండపం, లోపల గర్భాలయం ఉంటాయి. రాతిగోడలు, స్తంభాలపై చెక్కిన శిల్పాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. ఈ ఆలయ ప్రాంగణంలోనే సూర్యకుండం అనే మెట్లబావి కూడా ఉంది. వనవాసకాలంలో సీతారాములు ఇక్కడ గడిపినట్లు గాథలు ప్రచారంలో ఉండటంతో సూర్యకుండాన్నే రామకుండం అని కూడా అంటారు. ఈ ఆలయంలో ప్రతిఏటా మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణ మహోత్సవం, మాఘ శుక్ల సప్తమి రోజున రథసప్తమి పర్వదినాలు ఘనంగా జరుగుతాయి. ఉత్తరాయణ మహోత్సవం సందర్భంగా ఈ ఆలయ ప్రాంగణంలో ఏటా నాట్యోత్సవం కూడా జరుగుతుంది. మడ్ఖేడా సూర్య దేవాలయం ఈ ఆలయం మధ్యప్రదేశ్లోని టీకమ్గఢ్ జిల్లా మడ్ఖేడా గ్రామంలో ఉంది. ప్రతీహార వంశానికి చెందిన రాజులు ఈ సూర్యదేవాలయాన్ని క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దిలో నిర్మించారు. నాగర శిల్పకళా శైలిలో నిర్మించిన ఈ ఆలయం ఆనాటి శిల్పకళా చాతుర్యానికి నిదర్శనంగా నిలిచి ఉండటం విశేషం. ఆలయం లోపలికి ప్రవేశించగానే మండపం, ఆ తర్వాత అంతరాలయం, లోపల గర్భగుడి ఉంటాయి. ఆలయం గోడలపైన, స్తంభాలపైన అద్భుత శిల్పాలు కనువిందు చేస్తాయి. గర్భగుడిలోని సూర్యనారాయణమూర్తి విగ్రహంతో పాటు ఆలయ కుడ్యాలపై చెక్కిన శ్రీమహావిష్ణువు దశావతారాలు, శివపార్వతులు, గణపతి, కుమారస్వామి, బ్రహ్మ విష్ణువుల శిల్పాలు, అంతరాలయంలోని గంగా యమునల శిల్పాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ ఆలయంలో సౌర, వైష్ణవ, శైవ, శాక్తేయ సంప్రదాయాలకు చెందిన శిల్పాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ఆలయ పరిరక్షణను పర్యవేక్షిస్తోంది.దేవ్ సూర్యమందిరం ఇది బిహార్లోని ఔరంగాబాద్ జిల్లా దేవ్ పట్టణంలో ఉంది. స్థలపురాణ గాథల ప్రకారం ఈ ఆలయాన్ని సాక్షాత్తు దేవశిల్పి విశ్వకర్మ స్వయంగా నిర్మించాడని చెబుతారు. ఈ ప్రాంతంలో పురాతన కాలం నుంచి సూర్య ఆరాధన ఉండేదనేందుకు నిదర్శనంగా ఇక్కడ క్రీస్తుశకం 642 నాటి గుప్తుల శాసనం బయటపడింది. అయితే, ఆ శాసనంలో ఈ ఆలయం ప్రస్తావన లేదు. ఈ ఆలయ నిర్మాణంలో నాగర, ద్రావిడ, వేసరా వాస్తు శిల్పశైలులు కనిపిస్తాయి. మిశ్రమ శైలిలో కనిపించే ఈ ఆలయ నిర్మాణం క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్ది నాటిదని పురాతత్త్వ శాస్త్రవేత్తల అంచనా. ఈ ఆలయంలో చంద్రవంశ రాజు భైరవేంద్ర క్రీస్తుశకం 1437లో వేయించిన శాసనం కూడా ఉంది. ఈ ఆలయంలో ఏటా కార్తీక శుక్ల చవితి నుంచి నాలుగు రోజుల పాటు ‘ఛuЇ పూజ’ వేడుకలు ఘనంగా జరుగుతాయి. మకర సంక్రాంతి, రథసప్తమి పర్వదినాలలో కూడా ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతాయి.సోనాటాపాల్ సూర్య మందిరం ఇది పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లా సోనాటాపాల్ గ్రామంలో ఉంది. ఈ ఆలయ నిర్మాణం కళింగ వాస్తుశైలిలో ఉంటుంది. ఇది క్రీస్తుశకం పదకొండో శతాబ్దికి చెందినదని పురాతత్త్వ శాస్త్రవేత్తల అంచనా. శాలివాహనులు దీనిని నిర్మించినట్లు స్థలపురాణ గాథలు ఉన్నా, దీనిని పాల్ వంశానికి చెందిన బిష్ణుపూర్ రాజులు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అప్పట్లో కళింగ శైలిలో నిర్మించిన చాలా దేవాలయాలు పూర్తిగా రాతి నిర్మాణాలు. సోనాటాపాల్లోని ఈ సూర్య మందిరం మాత్రం ఇటుకలతో నిర్మించినది కావడం విశేషం. ఈ ఆలయ పరిసరాల్లో జరిపిన తవ్వకాల్లో దొరికిన పురాతన టెర్రకోట వస్తువుల ఆధారాల ప్రకారం ఇది కోణార్క ఆలయం కంటే పురాతనమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడి గర్భగుడిలో ఎలాంటి విగ్రహమూ ఉండదు. దీని గురించి రకరకాలుగా స్థలపురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఆలయానికి సమీపంలోనే జరిపిన తవ్వకాలలో పురాతన జైన శిల్పాల అవశేషాలు కూడా బయటపడ్డాయి. ఈ ఆలయంలో నిత్యపూజలు జరగవు గాని, అప్పుడప్పుడు ఆలయం వద్ద జానపద కళా ప్రదర్శనలు జరుగుతుంటాయి.సూర్యనార్ కోవిల్ ఈ ఆలయం తమిళనాడులోని తంజావూర్ జిల్లా అడుతురై పట్టణంలో ఉంది. కులోత్తుంగ చోళుడి హయాంలో ఇది క్రీస్తుశకం పదకొండో శతాబ్దిలో నిర్మితమైంది. ద్రావిడ వాస్తుశైలిలో నిర్మించిన ఈ ఆలయానికి ఐదంతస్తుల రాజగోపురం ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. తమిళనాడులో వెలసిన నవగ్రహ ఆలయాలలో ఇదొకటి. ఇక్కడి నవగ్రహ ఆలయాల గురించి అనేక పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. తమిళనాడు ప్రజలు ‘సూర్యనార్ కోవిల్’ అని పిలుచుకునే ఈ ఆలయానికి ఇదివరకు కులోత్తుంగ చోళ మార్తాండాలయం అనే పేరు ఉండేది. ఈ ఆలయంలో ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో విశేష పూజలు జరుగుతుంటాయి. ఏటా మకర సంక్రాంతి, రథసప్తమి పర్వదినాలలో ప్రత్యేక పూజలు, వేడుకలు కూడా జరుగుతుంటాయి. ఆదిత్యపురం సూర్య దేవాలయం ఇది కేరళలోని కొట్టాయం జిల్లా ఇరవిమంగళం గ్రామంలో ఉంది. స్థల పురాణ గాథల ప్రకారం ఇక్కడ సూర్యుడి విగ్రహం త్రేతాయుగం నుంచి వెలసి ఉన్నట్లు చెబుతారు. అప్పట్లో ఒక నంబూద్రి బ్రాహ్మణుడు ఇక్కడ సూర్యుడి కోసం తపస్సు చేశాడని, అతడి తపస్సుకు మెచ్చి సూర్యభగవానుడు ఇక్కడ విగ్రహరూపంలో వెలిశాడని చెబుతారు. ఇది కేరళలోని ఏకైక సూర్యదేవాలయం. దీనిని ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలిపే చారిత్రక ఆధారాలేవీ లేవు. ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దేశంలోని సూర్యదేవాలయాలు తూర్పు అభిముఖంగా ఉంటే, ఈ ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఇందులోని సూర్యభగవానుడి విగ్రహం ప్రత్యేకమైన శిలతో తయారైంది. ఇది నూనెను పీల్చుకుంటుంది. అందువల్ల ఈ ఆలయంలో తైలాభిషేకానికి విశేష ప్రాధాన్యం ఉంది. వంశపారంపర్యంగా నంబూద్రి బ్రాహ్మణులే ఈ ఆలయంలో పూజాదికాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో మకర సంక్రాంతి, రథసప్తమి పర్వదినాలలో విశేషమైన పూజలు, వేడుకలు జరుగుతాయి.ముల్తాన్ సూర్య దేవాలయం ఇది పాకిస్తాన్లోని ముల్తాన్ నగరంలో ఉంది. అతి పురాతనమైన ఈ ఆలయానికి సంబంధించిన కచ్చితమైన చారిత్రక ఆధారాలేవీ లేవు. చైనా యాత్రికుడు జువాన్జాంగ్ భారత ఉపఖండంలో పర్యటించే నాటికి ఈ ఆలయం ఉనికిలో ఉంది. సిం«ద్ ప్రాంతంలో ఇదొక్కటే సూర్య దేవాలయం అని జువాన్జాంగ్ క్రీస్తుశకం 641 నాటి తన యాత్రానుభవాల గ్రంథంలో రాశాడు. క్రీస్తుశకం ఏడో శతాబ్ది నాటికి చెందిన సాంబపురాణంలో కూడా ఈ ఆలయ ప్రస్తావన ఉంది. విదేశీయుల దాడిలో పదో శతాబ్ది కాలంలో ఈ ఆలయం కొంత ధ్వంసమైన తర్వాత దీనిని పునర్మించారు. ఆ తర్వాత మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు హయాంలో పదిహేడో శతాబ్దిలో జరిగిన దాడుల్లో ఇది బాగా ధ్వంసమై, శిథిలావస్థకు చేరుకుంది. అలనాటి ఆలయం ఇప్పుడు ఒక శిథిల అవశేషంగా మాత్రమే మిగిలి ఉంది.కటార్మల్ సూర్య దేవాలయం ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లా కటార్మల్ గ్రామంలో ఉంది. కత్యూరీ వంశానికి చెందిన రాజు కటార్మల్ ఈ ఆలయాన్ని క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దిలో నిర్మించారు. ఈ ఆలయంలో సూర్యభగవానుడు ‘వృద్ధాదిత్యుడి’గా కొలువుతీరి ఉండటం విశేషం. ఈ ఆలయ ప్రాంగణంలో వివిధ దేవతలకు చెందిన నలభై నాలుగు ఉపాలయాలు ఉన్నాయి. హిమాలయాలకు చేరువలో సముద్ర మట్టానికి ఆరువేల అడుగులకు పైగా ఎత్తయిన ప్రదేశంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణం నుంచి తిలకిస్తే, ధగధగలాడే మంచుకొండలు కనిపిస్తాయి. అరసవల్లి ఆలయంలో మాదిరిగానే ఈ ఆలయంలో కూడా ఏడాదికి రెండుసార్లు నిర్ణీత దినాలలోని సూర్యోదయ వేళల్లో సూర్యకిరణాలు మూలవిరాట్టు పాదాలను తాకుతాయి.అరసవల్లి సూర్యనారాయ స్వామి ఆలయంఇది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉంది. కళింగ రాజ్యాన్ని పరిపాలించిన తూర్పు గంగ వంశానికి చెందిన దేవేంద్ర వర్మ క్రీస్తుశకం ఏడో శతాబ్దిలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. తర్వాతికాలంలో జరిగిన యుద్ధాలు, దాడుల్లో ఈ ఆలయం ధ్వంసం కావడంతో పద్దెనిమిదో శతాబ్దిలో దీనిని పునరుద్ధరించారు. ప్రస్తుతం కనిపించే కట్టడంలో చాలాభాగం అప్పుడు పునరుద్ధరించిన నిర్మాణమే! కశ్యప మహర్షి స్వయంగా ఇక్కడ సూర్యభగవానుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని ‘పద్మపురాణం’ కథనం. ఈ ఆలయంలోని అద్భుత విశేషం ఏమిటంటే, ఏటా రెండుసార్లు సూర్యకిరణాలు గర్భగుడిలోని సూర్యభగవానుడి విగ్రహం పాదాలను తాకుతాయి. ఉత్తరాయణంలో మార్చి 9–11 తేదీలలోను, దక్షిణాయనంలో అక్టోబర్ 1–3 తేదీలలోను సూర్యోదయ సమయంలో ఈ అద్భుతాన్ని తిలకించడానికి భక్తులు బారులు తీరుతారు. అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో ఏటా మకర సంక్రాంతి, రథసప్తమి పర్వదినాల్లో విశేషంగా పూజలు, వేడుకలు జరుగుతాయి. -
శ్రీకాకుళం : ఉల్లాసంగా రథసప్తమి సప్తాహ్ (ఫోటోలు)
-
శ్రీకాకుళం : శోభా యాత్ర శోభాయమానం (ఫోటోలు)
-
శ్రీకాకుళం : రథ సప్తమి వేడుకలు.. అదరహో (ఫొటోలు)
-
Singer Mangli: పాట పాడలేదని ఇంత పగనా?
అమరావతి: ప్రముఖ గాయని మంగ్లీపై టీడీపీ & కో సోషల్ మీడియా వేదికగా మామూలు విషం చిమ్మడం లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైంలో ఆమె చంద్రబాబుపై పాట పాడమని టీడీపీ కోరింది. అయితే అందుకు ఆమె సున్నితంగా తిరస్కరించారు. అదే సమయంలో వైఎస్ జగన్ మీద అభిమానంతో ఓ పాట పాడారు. ఈ క్రమంలో ఆ కోపాన్ని ఇప్పుడు సందర్భం రావడంతో ప్రదర్శిస్తోంది యెల్లో బ్యాచ్. శ్రీకాకుళం అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాల సందర్భంగా ఈ నెల నాలుగో తేదీన గాయని మంగ్లీ(Singer Mangli) బృందం పాటల కార్యక్రమం ఏర్పాటు నిర్వహించింది. ఆ టైంలో కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు కుటుంబ సభ్యులతో దర్శనానికి వెళుతూ.. సింగర్ మంగ్లీని కూడా వెంట తీసుకెళ్లారు. అందుకు సంబంధించిన దృశ్యాలు, చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ఇప్పుడు పోస్ట్ చేస్తోంది. చంద్రబాబు పేరును పలకడానికి కూడా ఇష్టపడని వ్యక్తిని వెంట పెట్టుకుని మరీ ఎలా లోపలికి తీసుకెళ్తారంటూ రామ్మోహన్నాయుడును టీడీపీ వర్గాలు తప్పుబడుతున్నాయి. ఈ క్రమంలో.. అసలు ఆమెకు గుడిలోకి వెళ్లే అర్హతే లేదన్నట్లు అడ్డగోలు పోస్టులు పెడుతున్నారు. అదే టైంలో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంగ్లీ టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్కు సలహాదారుగా పని చేశారని గుర్తు చేస్తూ ఆ విమర్శలను ఇంకా తీవ్ర తరం చేస్తున్నారు. ఒకవైపు టీడీపీ అనుకూల మీడియా సైతం ఈ విమర్శలను ప్రముఖంగా ప్రచురిస్తుండడం గమనార్హం. మరోవైైపు.. ఒక కళాకారిణిగా ఆమెకు రాజకీయాలను ఆపాదించడం ఎంతమాత్రం సరికాదని కొందరు ఆమెకు మద్ధతుగా నిలుస్తుండడం విశేషం.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తిరుమలలో కన్నుల పండువగా రథసప్తమి వేడుకలు (ఫొటోలు)
-
ప్రత్యక్ష దైవమా.. ప్రణామం
రామవరప్పాడు: సమస్త జీవరాశి మనుగడకూ సూర్యుడే మూలాధారం. ఉదయభానుని అరుణ కిరణ స్పర్శతోనే ప్రకృతి మేల్కొంటుంది. ప్రాణికోటికి ప్రాణప్రదాత, ఆరోగ్యదాత భాస్కరుడే. ఆటవికుల నుంచి ఆధునికుల వరకూ జాతిమతాలకు అతీతంగా ఇనబాంధవుని ఆరాధిస్తూనే ఉంటారు. భారతీయ సంస్కృతిలో కశ్యప పుత్రుని స్థానం సమున్నతం. మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిథినాడు రథసప్తమి (Ratha Saptami) పేరుతో సూర్యజయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున సూర్యుడు సప్తాశ్వాలు పూన్చిన రథాన్ని అధిరోహించి దక్షిణాయనాన్ని ముగించుకుని పూర్వోత్త దిశగా ప్రయాణం ఆరంభిస్తాడని భక్తుల విశ్వాసం. మాఘ సప్తమి (Magha Saptami) నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయని భారతీయుల నమ్మకం. సూర్యకిరణాలు (Sun Rays) తప్పనిసరిగా శరీరంపై ప్రసరించాలి. ఇందులో భాగంగానే వైదిక సంస్కృతిలో సంధ్యావందనం, సూర్యనమస్కారాలు వంటి పలు ప్రక్రియలు ఆచరణలోకి వచ్చాయి.సూర్యనమస్కారాల విశిష్టత సూర్యనమస్కారములు ఒక అద్భుతమైన వ్యాయామ పద్దతి. సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా పన్నెండు భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ఒక సంక్షిష్టమైన ప్రాణాయామం, ధ్యానం, సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి ఉంది. ఇందులో ఒక విశిష్టమైన ఆసన సరళి, ఒక మహోన్నతమైన శ్వాస నియంత్రణ ఒక పరమోత్కృష్ట ధ్యాన విధానం ఉన్నాయి. సూర్యనమస్కారాలు చూడటానికి సాధారణ వ్యాయామంలాగే కనిపించినా ఆచరించి చూస్తే ఒక అవ్యక్తానుభూతి కలుగుతుందని యోగ గురువులు చెబుతున్నారు. సూర్య నమస్కారాలతో మంచి ఆరోగ్యం నిత్యం సూర్య నమస్కారాలు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి ఆరోగ్యవంతులవుతారు. శరీరంలోని ప్రతి అంగాన్నీ ఉత్తేజపరచే ప్రక్రియలు సూర్యనమస్కారాలు. ఈ పన్నెండు ఆసనాలు వేయడం వల్ల శరీరంలోని బిగువులు తొలగడం, విషపదార్థాలు కరిగిపోవడం, దేహ కదలికలు సులువు కావడం, కీళ్లు వదులవడంతో నరాలు, కండరాల వ్యవస్థ సమతుల్యంగా పని చేస్తుంది. దృష్టి, వినికిడి, వాసన, రుచి శక్తులు పెరుగుతాయి. సూర్య నమస్కారాలతో ఎముకలు, కండరాలు బలోపేతమై మనిషి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు స్వష్టం చేస్తున్నారు. వీటివల్ల బరువు తగ్గడంతోపాటు జీర్ణక్రియ మెరుగుపడటం, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సూర్యనమస్కారాలు శరీర భాగాలపైనే కాకుండా గ్రంధులపైనా పని చేస్తాయి. థైరాయిడ్, పారా థైరాయిడ్, పిట్యూటరీ వంటి గ్రంథులు సాధారణ స్థాయిలో పనిచేయడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి. ఏ ఆసనంతో ఎలాంటి లబ్ధి 1,12 ఆసనాలతో శరీర సమతుల్యత సాధించవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. వెన్నెముక, మెడ, భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి. 2,11 ఆసనాలతో... జీర్ణవ్యవస్థను మెరుగు పడుతుంది. వెన్నుముక, పిరుదులు బలోపేతమవుతాయి. 3,10 ఆసనాలు.. రక్తప్రసరణ పెంచుతాయి, కాలి కండరాలను బలోపేతం చేస్తాయి, గ్రంథులపై కూడా ప్రభావం చూపుతాయి. 4,9 ఆసనాలు... వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి. 5,8 ఆసనాలు.. గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి. 6వ ఆసనం. మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది. 7వ ఆసనం... జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నుముక బలంగా మారడానికి ఉపకరిస్తుంది. యువతను చైతన్య పరుస్తున్నాం.. సూర్యనమస్కారాలు, యోగ ఆసనాలపై యువతకు ఉచితంగా అవగాహన కల్పిస్తున్నాం. యోగ, సూర్యనమస్కారాల విశిష్టత అందరికీ తెలియాలనే ఉద్ధేశ్యంతో యోగపై ప్రత్యేకంగా పుస్తకం రాశాను. ప్రత్యక్షంగా ఆసనాలు నేర్చుకోలేని వారి కోసం పరోక్షంగా అవగాహన కల్పించడం కోసం హై క్వాలిటీ రికార్డింగ్తో పర్ఫెక్ట్ టైమింగ్తో ఆడియో కూడా రూపొందించాను. పాఠశాలలు, కళాశాలల్లో యువత, విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈ ఆడియో సాయంతో విజయవాడ, హైదరాబాద్తో పాటు అమెరికా, లండన్లో కూడా సెంటర్లు నడుస్తున్నాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ ఆసనాలపై ఆశక్తి పెంపొందించుకుని ఆరోగ్యంగా ఉండటమే మా లక్ష్యం. 1. నమస్కారాసనం (ఓం మిత్రాయనమః )చాతీని ముందుకు చాచి భుజాలను విశ్రాంతిగా ఉంచాలి. శ్వాస తీసుకుంటూ రెండు చేతులనూ ప్రక్కల నుంచి ఎత్తి శ్వాస వదులుతూ రెండు చేతులనూ కలుపుతూ నమస్కార ముద్రలో ఛాతీని ముందుకు తీసుకురావాలి. సూర్యునికి అభిముఖంగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్చరించాలి.2. హస్త ఉత్తానాసనం ( ఓం రవయేనమః )కొద్దిగా శ్వాస పీల్చి రెండు చేతులను పైకెత్తి వెనుకకు తీసుకురావాలి. భుజాలను చెవులకు దగ్గరగా తీసుకురావాలి. తలను, నడుమును వెనుకకు వంచాలి. ఈ ఆసనంలో మడమల నుంచి చేతివేళ్ల వరకు మొత్తం శరీరాన్ని సాగదీయాలి.3. పాదహస్తాసనం (ఓం సూర్యాయనమః)శ్వాస వదలి, వెన్నుపూసను నిటారుగా ఉంచి నడుము నుంచి ముందుకు వంగాలి. శ్వాసను పూర్తిగా వదిలేసి చేతులను పాదాల పక్కకు భూమిమీదకి తీసుకురావాలి. తలను మెకాలుకు ఆనించాలి. కాళ్లు వంచకూడదు.4. అశ్వసంచలనాసనం (ఓం భానవే నమః )ఎడమ మెకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్లపై ఆనించి, రెండు చేతులను పైకి చాపి, నడుము పై భాగాన్నంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి.5. దండాసనం (ఓం ఖగాయనమః)శ్వాస తీసుకుంటూ ఎడమకాలును కూడా వెనుకకు చాచి మొత్తం శరీరాన్ని భూమికి సమాంతరంగా ఒకే లైన్లో ఉంచాలి6. సాష్టాంగ నమస్కారం (ఓం పుష్ణేనమః)ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి అష్టాంగ నమస్కారం అని కూడా అంటారు. రెండు కాళ్లు రెండు మోకాళ్లు, రెండు చేతులు, రొమ్ము, గడ్డం ఈ ఎనిమిది అంగాలు నేలమీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదలి ఆపాలి.7. భుజంగాసనం (ఓం హిరణ్యగర్భాయనమః)ముందుకు సాగి ఛాతీని పైకిలేపి త్రాచుపాము ఆకారంలోకి తీసుకురావాలి. ఈ ఆకారంలో మోచేతులను వంచవచ్చు. భుజాలు మాత్రం చెవులకు దూరంగా ఉంచాలి. శ్వాసను పీల్చి తల వెనుకకు వంచాలి.8. పర్వతాసనం (ఓం మరీచయేనమః)ఐదవ స్థితివలెనే కాళ్లు చేతులను నేలమీద ఆనించి నడుమును పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.9. అశ్వసంచలనాసనం (ఓం ఆదిత్యాయనమః)శ్వాస తీసుకుంటూ కుడి పాదాన్ని రెండు చేతుల మధ్యలోకి తీసుకురావాలి. ఎడమ మోకాలు నేలమీద ఉంచి తుంటి భాగాన్ని కిందికి నొక్కుతూ పైకి చూడాలి.చదవండి: ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యారాధన!10. పాదహస్తాసనం (ఓం సవిత్రేనమః)శ్వాస వదులుతూ ఎడమపాదాన్ని ముందుకు తేవాలి. అరచేతులు భూమిమీద ఉంచాలి. అవసరమైతే మోకాలు వంచవచ్చు.11.హస్త ఉత్తానాసనం (ఓం అర్కాయనమః) శ్వాస తీసుకుంటూ ఉన్నప్పుడు వెన్నుపూసను నిటారుగా చేసి, చేతులు పైకిలేపి కొంచెం వెనుకకు వంగి తుంటి భాగాన్ని కొద్దిగా బయటకు తోయాలి.12. నమస్కారాసనం (ఓం భాస్కరాయ నమః)నిటారుగా నిలబడి ఊపిరి పీల్చుకునేటప్పుడు అరచేతులను ఒకచోటచేర్చి నమస్కారం చేయాలి. -
Ratha Saptami 2025: ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యారాధన ఇవాళే..!
మాఘ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే సప్తమి రోజున సూర్య దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈరోజున సూర్య నారాయణుడిని పూజించడం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. పురాణాల ప్రకారం, రథ సప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం, దాన ధర్మాలు చేయడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అలాగే మకర సంక్రాంతి తర్వాత రథ సప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం వల్ల ఆదాయం పెరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతారు. ఎందుకంటే మకర సంక్రాంతి వేళ సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు. రథ సప్తమి అంటే సూర్యుడు జన్మించిన రోజుగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా పూజవిధానం, చేయాల్సిన విధివిధానాలు గురించి సవివరంగా చూద్దామా..!.పురాణ కథనం ప్రకారం..కశ్యప మహర్షి, అదితి దేవి దంపతులకు సూర్యదేవుడు జన్మించాడు. ఆయన పుట్టినరోజే రథ సప్తమి. ఈ పవిత్రమైన రోజున పవిత్రమైన నదీ స్నానానికి ఎంతో విశిష్టత ఉంది. ఈరోజున తలపై ఏడు జిల్లేడు ఆకులను ఉంచుకుని నీటితో తలస్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.రథ సప్తమి తిథి ఎప్పుడంటే:మాఘ మాసంలోని శుక్ల పక్షంలో సప్తమి తిథి ఫిబ్రవరి 04 , 2025 ఉదయం 7:56 గంటలకు సప్తమి ప్రారంభమై, మరుసటి రోజు 05 ఫిబ్రవరి 2025 తెల్లవారుజామున 5:29 గంటలకు ముగుస్తుంది. అయితే ఫిబ్రవరి 5న బుధవారం ఉదయం సూర్యదోయ సమయం 6:36 గంటల కంటే ముందే సప్తమి తిథి ముగుస్తుంది. అందువల్ల ఇవాళే (ఫిబ్రవరి 4వ తేదీన) జరుపుకుంటారు.స్నానానికి ఎంతో ప్రాధాన్యత..రథ సప్తమి రోజు చేసే స్నానం, దానం ఏడు జన్మల పాపాలు, దోషాలు, దరిద్రాలను తొలగింపజేస్తుందట! అందువల్ల రథ సప్తమి రోజు ప్రత్యేకంగా స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. ఇందుకోసం ఏడు జిల్లేడు ఆకులు, 7 రేగి పళ్లు తీసుకోవాలి. వాటిని శిరస్సుపై ఉంచి తలంటు స్నానం చేయాలని తెలిపారు. ఇక్కడ జిల్లేడు ఆకులు, రేగి పళ్లు తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, అవి సూర్యుడికి ఇష్టమైనవి. ఈ విధమైన ప్రత్యేక స్నానం ఏడు రకాలైన పాపాలను తొలగిస్తుందట. ఆ తర్వాత సూర్యోదయం సమయంలో సూర్య భగవానుడికి ఈ విధంగా జపిస్తూ ఆర్ఘ్యం ఇవ్వాలి.‘‘ఓం సూర్యాయ నమఃఓం భాస్కరాయ నమఃఓం ఆదిత్యాయ నమఃఓం మార్తాండ నమః’’ అనే మంత్రాలను జపించాలి. వీటితో పాటు మరికొన్ని మంత్రాలను జపించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది.‘‘యదా జన్మకృతం పాపం మయాజన్మసు జన్మసుతన్మీరోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీఏతజ్ఞన్మకృతం పాపం యచ్ఛ జ్ఞాతాజ్ఞాతేచ యే పునఃసప్త విధం పాపం స్నానామ్నే సప్త సప్తికేసప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి’’పూజా విధానం:ఇంటి ఆవరణలో చిక్కుడు ఆకులు, చిక్కుడు పూలు, చిక్కుడు కాయలు వీటిని కలిపి ఒక మండపం లాగా పెట్టాలి. ఆ మండపం దగ్గర సూర్యుడి ఫొటో ఉంచాలి. ఇవన్నీ కుదరకపోతే పూజ గదిలో ఒక తమలపాకు తీసుకుని దానిపై తడి గంధంతో గుండ్రంగా ఒక రూపు గీయండి. దానిని సూర్యుడిగా భావించాలి. ఒకవేళ సూర్య భగవానుడి ఫొటో ఉంటే పెట్టండి. అక్కడ గోధుమలతో తయారు చేసిన పదార్థం నైవేద్యంగా పెట్టాలి. వీలైతే ఆవు పాలతో పాయసం చేస్తే మంచిది. పూజ కార్యక్రమాలు ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులు ప్రసాదం స్వీకరించాలి. సూర్య భగవానుడికి ప్రీతికరమైన రథ సప్తమి రోజున ఎవరికైనా ఒకరికి గొడుగు, చెప్పులు దానం ఇవ్వడం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. అంతేగాదు ఈ రోజు ఆదిత్య హృదయం లేదా సూర్య చాలీసా వంటివి పఠిస్తే మరింత ఫలితాన్ని పొందుతారనేది పురాణ వచనం.(చదవండి: దేవుని దేశం తిరిగొద్దాం..! చూడాల్సిన జాబితా చాలా పెద్దదే..) -
రథసప్తమికి తిరుమల ముస్తాబు
తిరుమల: ఒకరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి పొందిన రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబైంది. ఏడు వాహన సేవల్లో విహరించే శ్రీవారిని దర్శించి తరించేందుకు అశేష భక్తకోటి తరలివచ్చింది. ఉ.5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో వాహనాలపై విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లుచేసింది. ఆలయం వద్ద, నాలుగు మాడ వీధుల్లో ప్రత్యేక బ్యారికేడ్లు, గ్యాలరీలు, చలువ పందిళ్లు నిర్మించారు.గ్యాలరీల్లో ఉంటూ వాహన సేవలను తిలకించే భక్తులకు అన్నప్రసాదాలు, మజ్జిగ, నీళ్లు, వేడిపాలు అందజేయనున్నారు. ఏకధాటిగా ఏడు వాహన సేవలు ఉండడంతో కచ్చితమైన సమయాన్ని పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. మ.2 గంటల నుంచి 3 మధ్యలో పుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుంది. సుదర్శన చక్రత్తాళ్వారు స్నానమాచరించే పుణ్యప్రదేశంలో సాధారణ భక్తులు ప్రవేశించకుండా ఇనుప కమ్మీలు ఏర్పాటుచేశారు. ఇక రథసప్తమి ఏర్పాట్లను, స్వామివారిని ఊరేగించనున్న వాహనాలను టీటీడీ ఈఓ శ్యామలరావు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి సోమవారం సాయంత్రం పరిశీలించి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు మీడియాకు తెలిపారు.పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దుఇక రథసప్తమి వేడుకలకు భారీగా భక్తజనం వస్తుండడంతో అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దయ్యాయి. ⇒ ఎన్ఆర్ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలూ రద్దు. ⇒ తిరుపతిలో ఫిబ్రవరి 3–5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దు. ⇒ ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 3న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించరు. ⇒ ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్ఈడి) టికెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా నిర్మిత సమయంలో మాత్రమే వైకుంఠం క్యూకాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలి.భారీగా భద్రతా ఏర్పాట్లురథసప్తమి పురస్కరించుకుని 1,250 మంది పోలీసులు, 1,000 మంది విజిలె¯న్స్ సిబ్బందితో టీటీడీ భద్రతా ఏర్పాట్లుచేసింది. ఆక్టోపస్, ఏపీఎస్పీ, అగి్నమాపక దళం, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. గ్యాలరీల్లోకి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా అత్యవసర మార్గాలు ఏర్పాటుచేశారు. అలాగే, భక్తుల సౌకర్యార్థం చక్రస్నానానికి పుష్కరిణీలో ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్ల రంగంలోకి దించారు. గ్యాలరీల్లో భక్తులకు తాగునీరు, మజ్జిగ, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర, పొంగలి వంటి అన్న ప్రసాదాలు పంపిణీకి ఏర్పాట్లుచేశారు.వాహన సేవల వివరాలు ఉ.5.30–8 గంటల వరకు : సూర్యప్రభ వాహనం ఉ.9–10 గంటల వరకు : చిన్న శేష వాహనం ఉ.11 నుంచి మ.12 వరకు : గరుడ వాహనం మ.1 నుంచి 2 వరకు : హనుమంత వాహనం మ.2 నుండి 3 వరకు : చక్రస్నానం సా.4 నుండి 5 వరకు : కల్పవృక్ష వాహనం సా.6 నుంచి 7 వరకు : సర్వభూపాల వాహనం రాత్రి 8 నుంచి 9 వరకు : చంద్రప్రభ వాహనం -
సింహాచలం సింహగిరిపై ఘనంగా రథ సప్తమి వేడుకలు
-
సూర్య జయంతిని 'రథ సప్తమి' అని ఎందుకంటారు?
భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అని అంటారు. ఆయన వల్లనే నేలపై జీవరాశులు మనగలుగుతున్నాయి. హిందూ సంప్రదాయంలో సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది. మాఘ మాస శుక్ల పక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. కశ్యప మహాముని కుమారుడైన సూర్యభగవానుడి జన్మించిన రోజే ఈ రథ సప్తమి అని కూడా అంటారు. సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సూర్యభగవానుడు ఉదయం వేళలో బ్రహ్మ స్వరూ పంగాను, మధ్యాహ్నం వేళలో మహేశ్వరునిగాను, సాయం వేళలో విష్ణు స్వరూపంగా ఉండి ప్రతి దినమున త్రిమూర్తి రూపంగా ఉంటూ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఇక సూర్యారాధన అత్యంత ప్రాచీన సంప్రదాయం. ఈ విశ్వంలో కేవలము శ్రీ సూర్య నారాయణ స్వామి మాత్రమే ఏడు కిరణములు కలిగి, ఒకే ఒక చక్రం కలిగిన, ఏడు గుఱ్ఱములతో లాగబడుతున్న, అనూరువైన సారథితో నడపబడుతున్న రథమెక్కి అంతరిక్షంలో మన మాంసనేత్రముతో చూడగలిగే ప్రత్యక్ష దైవం. అటువంటి అద్భుత దివ్య మూర్తి ఎక్కిన రథము ప్రత్యేకతను తెలియజేస్తూ, సప్తమి తిథిన ఆవిర్భవించిన శ్రీ సూర్య నారాయణుని పుట్టిన రోజును, సూర్య భగవానునికి అత్యంత ప్రియమైన సప్తమిని “రథసప్తమి” పేరుతో జరుపుకుంటున్నాము. సూర్య రథానికి ఉన్న ప్రత్యేకతలు.. కొందరు రథ సప్తమినే సూర్యజయంతి అంటారు. కానీ నిజానికి సూర్యుడు పుట్టినరోజు కాదిది సూర్యుడు తన ఉష్ణచైతాన్యాన్ని లోకులకు పంచిపెట్టడం కోసం రథాన్నెక్కి విధులలో ప్రవేశించిన రోజు ఇది. అయితే లోకంలో సూర్య జయంతిగా పిలవబడుతూ ఉంది. ఇక్కడ రథారోహణమే ప్రధానకృత్యం. లోకబాంధవ ధర్మానికి సిద్ధపడిన రోజు కనుక రథసప్తమి అయ్యింది. ఇది మామూలు రథంకాదు. దీనికి ఒక్కటే చక్రం. తొడల నుండి క్రిందభాగం లేని 'అనూరుడు' రథసారథి ఛందస్సులనే గుర్రాలే ఈ రథాన్ని లాగుతాయి. ఏ మాత్రమూ నిలిచే ఆధారంలేని ఆకాశంలో పయనిస్తుంది ఈ రథం. ఇన్ని విలక్షణ విశేషాలున్నాయి. సూర్యుడు రథోద్యోగంలో చేరింది మొదలు రాత్రింబవళ్లు తిరుగుతూనే ఉన్నాడు. ఒక్కరోజు కాదు, ఒక్క నిమిషం కూడా ఎక్కడా కూర్చునే ఉద్యోగం కాదది ఆయన సారథీ అంతే... కాళ్ళున్నవాడు ఎక్కడికైనా ఎప్పుడైనా విహారానికి వెళ్లవచ్చు. కానీ వికలాంగుడైన అనూరుడు అలా చెయ్యలేడు. కాళ్ళు లేకపోవడంవల్ల అతడు మనపాలిట వరం అయ్యాడు. సూర్యరథానికి ఉన్న గుర్రాలను ఛందస్సులంటారు. ఇవన్నీ వేదఛందస్సులు. అవి 1. గాయత్రి, 2. త్రిష్టుప్, 3. జగతి అనుష్టుప్, 5. పంక్తి, 6. బృహతి, 7. ఉష్ణిక్ అనేవి. వాటికి ఎప్పటికీ అలసట లేదు. గుర్రం వేగవంతమైన చైతన్యానికి చిహ్నం సూర్యుని ఏడుగుర్రాలూ 7 రకాల కాంతి కిరణాల్ని ప్రసరిస్తూ ఉంటాయి కనుక సూర్యకిరణాల్లో 7 రంగులుంటాయి. సప్త వర్ణాలతో ప్రకాశించే సూర్యుని సప్త కిరణాలను – సుషుమ్న, హరికేశ, విశ్వకర్మ, విశ్వవ్యచ, సంపద్వసు, అర్వాగ్రసు, సావరాడ్వసు అంటారు. రథసప్తమి రోజున ఈ సప్త వర్ణాలు మనకు శ్వేతవర్ణంగా కనిపిస్తాయి. సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు. మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాశుల్లో ప్రయాణిస్తారు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. విశ్వం ఒక వృత్తంలా భావిస్తే.. దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణితశాస్త్రం చెబుతోంది. సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజులలో ఈ వృత్తాన్ని పూర్తిచేస్తాడు. అంటే ఒక సంవత్సరం. అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి, ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా, విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీరే ద్వాదశామాసాలకూ ఆధిదేవతలు. వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. మాఘమాసంలో "అర్క'' నామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు. అందుకే మనల్ని భారతీయులని పిలుస్తారు.. భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణతుల్యంగా భావించి, పితృ, దేవరుషి తర్పణాలను ఇవ్వాలనే నియమాన్ని నిర్ణయించారు. 'భా” అంటే సూర్యకాంతి. “కతి" అంటే సూర్యుడు. కావున సూర్యుని ఆరాధించువారందరూ భారతీయులు. 'భారతీ” అంటే వేదమాత. సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ. కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయి. మన మంత్రపుష్పాలలో ఒకటిగా పేర్కొనే ‘యోపం పుష్పం వేదా, పుష్పవాన్ ప్రజావాన్, పశుమాన్ భవతి’ అనే వాక్యాలు దీనికి సంబంధించినవే. సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశుసంపద సమృద్ధివంతుడు అవుతాడు. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజసిద్ధంగా విటమిన్ 'డి' లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి. సాంబుడు నిర్మించని కోణార్క్ దేవాలయం శ్రీకృష్ణుని కుమారుడు సాంబునికి మహర్షి శాపం వల్ల కుష్ఠు రోగం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు సూర్యభగవానుని ఆరాధించమనీ, రోగం నయమౌతుందనీ చెప్తాడు. సాంబుడు భక్తితో చంద్రభాగా నదీతీరాన వేపవృక్షాల మధ్యలో ఉంటూ సూర్యారాధన చేశాడు. జబ్బు పూర్తిగా తగ్గిపోయాక కృతజ్ఞతతో కోణార్క్లో అద్భుతమైన సూర్యాలయాన్ని నిర్మించి సూర్య నారాయణుని ప్రతిష్టించాడు. ఎందరో ఈ దేవాలయాన్ని పాడుచెయ్యాలని ప్రయత్నించినా, కోణార్క్ దేవాలయం నేటికీ అత్యంత ఆకర్షణీయంగా అలరారుతున్నది. దేవేంద్రుడి నిర్మించిన అరసవెల్లి దేవాలయం ఒకసారి దేవేంద్రుడు పరమేశ్వర దర్శనానికి వెళతాడు. ఆ సమయంలో శివపార్వతులు ఏకాంతంగా ఉన్నారని నందీశ్వరుడు దేవేంద్రుని లోపలికి వెళ్ళద్దంటాడు. అతని మాట వినకుండా శివదర్శనానికి వెళ్ళబోయిన ఇంద్రుడిని నందీశ్వరుడు తంతాడు. ఒక్క తాపుతో ఎగిరిపడి ఒళ్ళంతా దెబ్బలతో బాధ పడుతుంటే, ఇంద్రునికి సూర్యారాధన చేస్తే బాధ పోతుందని కల వస్తుంది. అప్పుడు దేవేంద్రుడు నిర్మించి, ప్రతిష్ఠించినదే అరసవెల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయము. అత్యంత మనోహరంగా కనిపించే శ్రీ సూర్య నారాయణ స్వామి పాదాలను సూర్య కిరణాలు తాకటాన్ని ఇక్కడ మనం చూడవచ్చును. సూర్యారాధన చేసినవారు.. ఈ రథసప్తమి రోజునే శ్రీ సూర్య భగవానుడు సత్రాజిత్తుకి శమంతక మణిని ప్రసాదించాడని చెప్తారు. శ్రీ సూర్యభగవానుని గురువుగా ప్రార్థించి శ్రీ ఆంజనేయస్వామి చతుర్వేదాలను, ఉపనిషత్తులను, వ్యాకరణాన్ని అభ్యసించాడు. యాజ్ఞవల్క్య మహర్షి శ్రీ సూర్య భగవానుని నుంచి ఉపనిషద్ జ్ఞానాన్నిపొందాడు. శ్రీ సూర్యనారాయణ స్వామిని ప్రార్థించి ధర్మరాజు అక్షయపాత్రను పొందాడు. సూర్య నారాయణ స్వామిని నిత్యము ప్రార్థించే ద్రౌపదీ దేవిని కీచకుడు సమీపించ బోతున్నప్పుడు సూర్య భగవానుడు ఒక గంధర్వుడిని ఆమె రక్షణకు పంపాడు. అతను గుప్తంగా వచ్చి, కీచకుడిని తోసేసి, ద్రౌపదిని రక్షించాడు. మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. అరుణోదయవేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పనాదులు అనేక కోట్ల రెట్లు పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. సప్తమి రోజున షష్టి తిథి ఉంటే కనుక షష్టి సప్తమి తిథులను పద్మము అని అంటారు. ఈ పద్మము సూర్యభగవానుడికి ఎంతో ఇష్టం. ఆ సమయంలో జిల్లేడు ఆకులను తల మీద పెట్టుకుని, రెండు భుజాలపైన రేగు పండ్లు పెట్టుకుని స్నానం చేస్తే ఏడు జన్మల పాపం తొలగిపోతుందని చెబుతున్నారు. రేగి పండుని సూర్యభగవానుడికి ప్రతీకగా భావిస్తారు. ‘సూర్యునికి అర్కః అని పేరు’. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఇందులో నిమిడి ఉన్న ఆరోగ్య రహస్యమేమంటే.. జిల్లేడులో కొన్ని ఔషధ గుణాలున్నాయి. ఇవి ఆ సమయంలో నీటిలో కలిసి మన శరీరానికి ఋతువులో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనను సిద్ధపడేలా చేస్తాయి.. ఇలా చేసే స్నానం ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది.. అనేక చర్మ రోగాలను నివారిస్తుంది. ఎన్నో ప్రయోజనాలున్న ఈ సూర్యరాధనను తప్పక చేసి ఆయురారోగ్యాలను పొందండి. (చదవండి: గ్రీకులు, రోమన్లు సరస్వతి దేవిని పూజించేవారా?) -
Ratha Saptami: రథసప్తమి వైభవం
సాక్షి, తిరుపతి: తిరుమలకు మినీ బ్రహోత్సవంగా పిలువబడే రథసప్తమి మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి. సూర్య జయంతి వేడుకలతో టీటీడీ ఆలయ మాడ వీధుల్లో భక్తసందోహం నెలకొంది. సప్త వాహనాల సేవలో భాగంగా.. తొలుత సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. రాత్రి చంద్ర ప్రభ వాహనంతో వాహన సేవలు ముగియనున్నాయి. ఇక రథసప్తమి మహోత్సవాలకు తిరుమల సుందరంగా ముస్తాబైంది. ఉదయం భానుని తొలిరేఖలు సూర్యప్రభ వాహనంపై కొలువైన స్వామివారి నుదుటన, నాభి, పాదకమలాలపై ప్రసరించే అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు ఎదురుచూస్తుంటారన్నది తెలిసిందే. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. మహద్వారం నుంచి స్వామి సన్నిధి వరకు రంగురంగుల పుష్పాలంకరణలు చేపట్టారు. ఇందుకోసం ఏడు టన్నుల సంప్రదాయ పుష్పాలు, 50వేల కట్ ఫ్లవర్స్ వినియోగించారు. భక్తుల భద్రతకు పటిష్ఠ చర్యలను టీటీడీ నిఘా, భద్రతా విభాగం, పోలీసుశాఖ చేపట్టింది. వాహన సేవలు ఇలా.. తెల్లవారుజామున 5.30-8.00 సూర్యప్రభ (సూర్యోదయం 6.40) ఉదయం 9-10 : చిన్నశేష ఉదయం 11-12 : గరుడ వాహనం మధ్యాహ్నం 1-2 : హనుమంత మధ్యాహ్నం 2-3 : చక్రస్నానం సాయంత్రం 4-5 : కల్పవృక్ష సాయంత్రం 6-7 : సర్వభూపాల రాత్రి 8-9 : చంద్రప్రభ తిరుమలలో నేడు ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది. శనివారం వరకు సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేసిన నేపథ్యంలో భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 నుంచి శ్రీవారిని దర్శించుకోవచ్చు. అలాగే.. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు సూర్యజయంతిని పురస్కరించుకొని టీటీడీ స్థానిక ఆలయాల్లో రథసప్తమి ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. దీంతో.. స్థానిక ఆలయాలైన తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామాలయం, శ్రీనివాసమంగాపురంల శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం తదితర ఆలయాల్లో రథసప్తమి పర్వదినం నిర్వహిస్తున్నారు. మరోవైపు.. తిరుచానూరు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో వైభవంగా రథ సప్తమి వేడుకలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈరోజు సూర్యప్రభ వాహనం సేవతో మొదలై.. రాత్రి గజ వాహనంపై అమ్మవారు దర్శనమిస్తారు. భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆలయ మాడ వీధుల్లో భక్తుల సౌకర్యార్థం భారీ షెడ్లను ఏర్పాటు చేసింది. రథ సప్తమి ప్రశస్తి.. మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతి రథసప్తమిగా ప్రశస్తి పొందింది. అదితి కశ్యపులకు సూర్య భగవానుడు జన్మించిన సుదినమిది. రథసప్తమి ఉత్తరగతిని సూచించే పండుగ. రథసప్తమిని సూర్యజయంతి, జయంతి సప్తమి, మహాసప్తమి, సౌరసప్తమి, భాస్కర సప్తమి మొదలైన పేర్లతో విభిన్న ప్రాంతాల్లో పిలుస్తారు. నిజానికి రథసప్తమి నుంచే ఆదిత్యుడి ప్రయాణం దక్షిణం నుంచి ఉత్తర దిశకు ప్రారంభమైందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ రోజున స్వర్గస్థులైన పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు. ఒకప్పుడు రథసప్తమినే ఉగాదిగా వ్యవహరించేవారట. రాష్ట్రంలో పలు ఆలయాల్లో.. రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు, రథయాత్రల నేపథ్యంలో.. రాష్ట్రంలోని పలు ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి సన్నిధి లో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో స్వామివారికి అర్ధరాత్రి క్షీరాభిషేకం తో ప్రత్యేక పూజలు చేశారు. సూర్యనారాయణ స్వామి నిజరూప దర్శనం కోసం వేల సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సహా పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు జిల్లాలోని వజ్రపుకొత్తూరు (మం ) అక్కుపల్లి శివసాగర్ బీచ్ కు భక్తులు పోటెత్తారు. కృష్ణాజిల్లా మోపిదేవిలో వైభవంగా శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి రథోత్సవం నిర్వహించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు సుబ్రహ్మణ్య క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మోపిదేవి పురవీధుల్లో వల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి రథోత్సవం నిర్వహించారు. రథోత్సవాన్ని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు దంపతులు, ఆలయ ఏసీ నల్లం సూర్య చక్రధరరావు ప్రారంభించారు. -
తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు
-
తిరుమలలో వైభవంగా రథ సప్తమి
తిరుమల: సూర్య జయంతిని పురస్కరించుకుని తిరుమలలో శనివారం రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై మలయప్ప స్వామి విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. అందుకే దీన్ని ఒకరోజు బ్రహ్మోత్సవంగా భక్తులు భావిస్తారు. మద్యాహ్నం చక్రస్నానం నిర్వహించారు. కోవిడ్ తర్వాత మొదటిసారి ఆలయ మాడవీధుల్లో జరుగుతున్న రథసప్తమి, వాహన సేవలకు విశేషంగా భక్తులు తరలివచ్చారు. ఈ వాహన సేవల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి దంపతులు, టీటీడీ బోర్డు సభ్యుడు పోకల అశోక్ కుమార్, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, ఎఫ్ఏసీఏవో బాలాజి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. నాలుగు మాడ వీధులతోపాటు, క్యూల్లో వేచి ఉన్న భక్తులకు నిరంతరం అన్న పానీయాలను టీటీడీ అందజేసింది. సూర్యప్రభ వాహన సేవకు ప్రత్యేకత రథసప్తమి వాహన సేవల్లో అత్యంత ప్రధానమైనది సూర్యప్రభ వాహన సేవ. శ్రీమలయప్పస్వామి వారు సూర్యప్రభ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీసూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం 6.50 నిమిషాలకు శ్రీవారి పాదాలపై ప్రసరించి నమస్కరించారు. ఈ వాహన సేవ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఎంతో ఆసక్తితో నిరీక్షిస్తున్న లక్షలాదిమంది భక్తిపారవశ్యంతో పులకించారు. గోవింద నామస్మరణ మధ్య స్వామివారి వాహనసేవ వైభవంగా జరిగింది.కాగా, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
తిరుమలలో వైభవంగా రథ సప్తమి వేడుకలు (ఫొటోలు)
-
భక్తులకు గమనిక.. రథసప్తమికి టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28న రథసప్తమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు 80 ప్రత్యేక బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఏర్పాటు చేసింది. హైదరాబాద్తో సహా జిల్లా కేంద్రాల నుంచి ప్రముఖ ఆలయాలు వేములవాడ, ధర్మపురి, యాదగిరిగుట్ట, మన్నెంకొండ, గూడెం ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది. కరీంనగర్ నుంచి వేములవాడకు 10, ధర్మపురికి 10, నల్లగొండ నుంచి యాదగిరిగుట్టకు 10, మహబుబ్నగర్ నుంచి మన్నెంకొండకు 10, ఆదిలాబాద్ నుంచి గూడెంకు 5, హైదరాబాద్ కేపీహెచ్బీ నుంచి అనంతగిరికి 5 ప్రత్యేక బస్సులను టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. అలాగే, హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి, చిలుకూరు బాలాజీ, సికింద్రాబాద్ మహంకాళి, హిమాయత్నగర్ బాలాజీ, తదితర ఆలయాలకు ప్రధాన ప్రాంతాల నుంచి 20 ప్రత్యేక బస్సులను నడుపుతుంది. రథసప్తమి సందర్భంగా ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, వారు సురక్షితంగా ఆలయాలకు చేరుకునేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. భక్తుల రద్దీ మేరకు అవసరమైతే మరిన్నీ బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్టు వారు స్పష్టం చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రథసప్తమి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను భక్తులు ఉపయోగించుకోవాలని కోరారు. గురువారం వసంత పంచమి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర, వర్గల్కు 108 బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. -
ఫిబ్రవరి 8 నుంచి అంతర్వేది ఉత్సవాలు
సాక్షి, సఖినేటిపల్లి: అంతర్వేది శ్రీలక్ష్మీనృసింహస్వామి దివ్య తిరుకల్యాణ మహోత్సవాల షెడ్యూల్ విడుదలైంది. దేవస్థానం కార్యాలయంలో గురువారం జరిగిన ప్రత్యేక సమావేశంలో విడుదల చేశారు. ఆలయ అర్చకులు, వేదపండితులు నిర్ణయించిన ముహూర్తానికి ఆలయంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ ఎం.విజయరాజు ఉత్సవాల షెడ్యూల్ను ప్రకటించారు. ఫిబ్రవరి 8న రథసప్తమి, 11న స్వామి కల్యాణం, 12న రథోత్సవం, 16న పౌర్ణమి సముద్రస్నానం, 17న తెప్పోత్సవం నిర్వహిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. ఆలయ చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ శ్రీరాజా కలిదిండి కుమార రామగోపాలరాజా బహద్దూర్, అసిస్టెంట్ కమిషనర్ యర్రంశెట్టి భద్రాజీ, దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ జి.ప్రసాద్, ఎంపీపీ వీరా మల్లిబాబు, ఈఓ బి.వెంకటేశ్వరరావు, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, అర్చకులు పాల్గొన్నారు. (చదవండి: తిరుమల శ్రీవారి టికెట్లకు ఫుల్ డిమాండ్) -
రథ సప్తమి: ప్రత్యక్షదైవం పుట్టిన రోజు...
చిమ్మ చీకట్లను తరిమి.. చలిని తొలగించి నులి వెచ్చని ఉత్సాహాన్ని, చైతన్యాన్ని కలిగించే కర్మసాక్షిగా నిలిచే సూర్యభగవానునికి కృతఙ్ఞతా సూచకంగా చేసే పండుగ ఇది. సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకంగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈ రోజు పవిత్రమైన రోజుగా భావించి సూర్యుణ్ణి ఆరాధిస్తారు. చలికాలం చివర్లో.. వేసని కాలపు ఆరంభం మాఘ మాసమవుతుంది. ‘రథసప్తమి’ పండుగను మాఘ మాస శుద్ధ సప్తమి నాడు జరుపుకుంటారు. శ్రీసూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడు ఏకచక్ర రథారూఢుడు. ఈ చక్రమే కాలచక్రం. ఆ చక్రానికి 6 ఆకులు. రథానికి 7 అశ్వాలు. చక్రం సంవత్సరానికి ప్రతీక. సహస్ర కిరణాలతో ప్రకాశించే ఈ సప్తకిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడుతాయి. సూర్య భగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా దైవిక వికారాలను రూపు మాపి, సాయంకాలం విష్ణురూపంగా భాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపుడు. ధాత, అర్యమ, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పూష, పర్జన్య, అంశుమాన్, ఖగ, త్వష్ట, విష్ణువు అనే ఈ 12 మంది సూర్యులు సమస్త జీవజాలానికి సృష్టి విధానానికి ఆధారభూతులవుతున్నారని, ఈ 12 నామాలు స్మరిస్తే, దీర్ఘ రోగాలు నయం అవుతాయని, దారిద్య్రం తొలగుతుందనీ భవిష్య పురాణం చెబుతోంది. ఈ ‘రథ సప్తమి’ రోజు తిరుమల తిరుపతిలో కూడా శ్రీవారిని ముందుగా సూర్యప్రభ వాహనం మీద ఊరేగింపు చేస్తారు. చివరన చంద్రప్రభ వాహనంపై ఊరేగిస్తారు. మిగతా వాహనాలు హనుమద్వాహన, గరుడవాహన, పెద శేష వాహన, కల్పవృక్ష వాహన, స్వయం భూపాల వాహనాలపై స్వామివారిని ఊరేగిస్తారు. చక్రస్నానం కూడా ఇదే రోజు చేస్తారు. ఒక్కరోజు బ్రహ్మోత్సవాన్ని కన్నులపండుగ గా జరుపుతారు. భక్తులు స్వామి వారిని కనులారా దర్శించుకుని తరిస్తారు. అరసవెల్లిలో కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. రథ సప్తమికి ముందు రోజున రాత్రి ఉపవాసం చేసి, మరునాడు అంటే రథ సప్తమి అరుణోదయంతోనే స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు నశిస్తాయని శాస్త్రం చెబుతోంది. స్నానానికి ముందు ప్రమిదలో దీపం వెలిగించి దానిని శిరసుపై నుంచి, సూర్యుని ధ్యానించి, దీపాన్ని నీటిలో వదిలి, స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు, జిల్లేడు ఆకులు, చిక్కుడు ఆకులు, రేగుపళ్ళు నెత్తిమీద పెట్టుకుని స్నానం చేయాలి. స్నానానంతరం.. సూర్యునికి అర్ఘ్యమిచ్చి, ధ్యానం చేయాలి. అటు తర్వాత తల్లిదండ్రులు లేని వారైతే, పితృతర్పణం చేసి, చిమ్మిలి దానం చేయాలి. ఇంకొందరు రథసప్తమి వ్రతం కూడా చేస్తారు. మాఘశుద్ధ షష్టి నాడు, అంటే రథసప్తమికి ముందు రోజు తెల్ల నువ్వులపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. బంధువులతో కలసి నూనె లేని వంటకాలతో భోజనం చేయాలి. రాత్రి ఉపవాసం ఉండాలి. వేద పండితులను పిలిచి, వారినే సూర్య భగవానులుగా తలచి సత్కరించాలి. రాత్రికి నేలపై నిద్రించాలి. గురువుకు ఎరుపు వస్త్రాలు దానం చేయాలి. ఇలా రథసప్తమీ వ్రతంతో సూర్య భగవానుని అనుగ్రహంతో ఆయురారోగ్యాది సకల సంపదలు లభిస్తాయని శాస్త్రప్రబోధం. – పూర్ణిమా స్వాతి చదవండి: ఈ వృధా ప్రయత్నాలు ఇకనెందుకు? ప్రపంచంలో మొదటి రాతి దేవాలయం -
రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతున్న తిరుమల
-
రథసప్తమి నాడు సప్తవాహనాలపై శ్రీవారు
సాక్షి, తిరుమల: తిరుమలలో సూర్యజయంతిని రథసప్తమిగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓ ధర్మారెడ్డి అన్నారు. రథసప్తమిపై టీటీడీ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ఫిబ్రవరి 1న రథసప్తమిని నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా ఈ వేడుక కోసం నాలుగు మాడ వీధుల్లో ప్రత్యేక జర్మన్ షెడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులకు ఆహారం, తాగునీరు అందుబాటులో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. చదవండి: శ్రీవారి భక్తులకు తీపి కబురు రథసప్తమి నాడు సప్త వాహనాలపై శ్రీవారి ఊరేగింపు ఉంటుందని ఆయన చెప్పారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై రాత్రి చంద్రప్రభ వాహనంతో ఈ వేడుక పూర్తి అవుతుందని ఆయన పేర్కొన్నారు. సోమవారం రోజు సుమారు 55, 689 ఉచిత లడ్డులను భక్తులకు అందించామని తెలిపారు. భక్తులు అదనంగా 1,59,814 లడ్డూలు విక్రయించారని టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి వెల్లడించారు. చదవండి: గదుల బుకింగ్లో కాషన్ డిపాజిట్ విధానం -
తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు
-
తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు
-
రారండోయ్ వేడుక చూద్దాం
-
24న తిరుమల వెళ్తున్నారా.. ఇది గమనించండి
సాక్షి, తిరుమల: రథసప్తమి పర్వదినం సందర్భంగా జనవరి 24న తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనాలు.. చంటిపిల్లల తల్లిదండ్రులకు, వయోవృద్ధులకు, దివ్యాంగులకు, దాతలకు, మిలటరీ, ఎన్నారైలకు సుపథం మార్గంలో కల్పించబడే ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేసినట్టు టీటీడీ తెలిపింది. సూర్యజయంతిని పురస్కరించుకుని స్వామివారు ఒకే రోజున ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగుతారు. అందుకే తిరుమలలో రథసప్తమిని ఒకరోజు బ్రహ్మోత్సవాలు, ఉపబ్రహ్మోత్సవాలని వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆరోజు నిర్వహించే ఆర్జిత సేవలైన సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అయితే సుప్రభాతం, తోమాల, అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారు. సమయం వాహనం ఉ. 5.30 - ఉ. 08.00 సూర్యప్రభ వాహనం ఉ. 9.00 - ఉ. 10.00 చిన్నశేష వాహనం ఉ. 11.00 - మ. 12.00 గరుడ వాహనం మ. 1.00 - మ. 2.00 హనుమంత వాహనం మ. 2.00 - మ. 3.00 చక్రస్నానం సా. 4.00 - సా. 5.00 కల్పవృక్ష వాహనం సా. 6.00 - సా. 7.00 సర్వభూపాల వాహనం రా. 8.00 - రా. 9.00 చంద్రప్రభ వాహనం -
అరసవల్లిలో అర్ధరాత్రి నుంచే సూర్యజయంతి ఉత్సవం
అరసవల్లి: రథసప్తమి (సూర్యజయంతి) ఉత్సవం గురువారం అర్ధరాత్రి నుంచే ప్రారంభం కానుంది. వెలుగుల రేడు అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి జయంతి సందర్భంగా గురువారం అర్ధరాత్రి 12.30 గంటల నుంచి స్వామి వారికి క్షీరాభిషేక సేవ ప్రారంభమవుతుంది. ఇందుకోసం దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గతంలో కంటే ఈసారి సాంకేతికతను అధికంగా వినియోగిస్తూ పూర్తిస్థాయి ఆధునీకరణతో బందోబస్తు ఏర్పాట్లను పోలీసులు చేశారు. శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సూర్యదేవాలయ గర్భాలయంలోకి వెళ్లి తొలి దర్శనం, తొలి పూజలతో పాటు క్షీరాభిషేకం చేయనున్నారు. అంతకుముందు ఆదిత్యునికి 12.15 గంటలకే మేల్కొలుపు సేవ, సుప్రభాత సేవను నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రధాన అర్చకుడు శంకరశర్మ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పంచామృతాలతో అభిషేకాలకు రంగం సిద్ధం చేశారు. గురువారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానున్న ఈ అభిషేకసేవ శుక్రవారం తెల్లవారుజామున 6 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత స్వామి నిజరూప దర్శనం కల్పిస్తారు. డీసీఎంఎస్ కార్యాలయం నుంచి దర్శనానికి క్యూలైన్లు సిద్ధం చేశారు. 216, 100, 500 రూపాయల దర్శన టిక్కెట్లు క్యూలైన్లో ఇవ్వనున్నారు. స్వామి వారి దర్శనానికి సుమారు రెండు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనాల్లో ఉన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫ్రీ దర్శనం (సాధారణ దర్శనం) క్యూలైన్లు కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. మధ్యలో విశ్రాంతి కోసం కంపార్ట్మెంట్లు కూడా ఏర్పాటు చేశారు. భక్తులకు సౌకర్యంగా పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదానాలు, ఉచిత ప్రసాదాల పంపిణీ, బస్సు సౌకర్యం, మంచినీరు, మజ్జిగ పంపిణీలను చేపట్టనున్నారు. భక్తులు చక్కగా దర్శనాలు చేసుకుని క్షేమంగా స్వప్రాంతాలకు తిరిగి వెళ్లాలని ఆలయ ఇవో శ్యామలాదేవి ఆకాంక్షించారు. -
శ్రీవారికి ఒకే రోజు 7 వాహన సేవలు
-
3న తిరుమలలో రథసప్తమి వేడుకలు
సాక్షి, తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేకంటేశ్వర స్వామివారు కొలువైన తిరుమలలో ఫిబ్రవరి 3వ తేదీన రథసప్తమి మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తిరుమలలో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు స్వామివారి సూర్యప్రభ వాహనాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో వాహన మండపం నుంచి సూర్యప్రభ వాహనాన్ని శ్రీవారి ఆలయం వరకు ఊరేగించి లోటుపాట్లను తెలుసుకున్నారు. ఏడు వాహన సేవల్లో మలయప్ప దర్శనం: తిరుమలలో మాఘమాసం శుద్ధ సప్తమి సూర్యజయంతి పర్వదినం సందర్భంగా ‘రథ సప్తమి’ వేడుక నిర్వహించనున్నారు. ఆ రోజు మలయప్పస్వామి ఏడు వాహనాలపై తిరుమల మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. కాగా ఫిబ్రవరి 3వ తేదీన సూర్యోదయం 6.44 గంటలుగా టీటీడీ నిర్దేశించింది. పలు ఆర్జిత సేవలు రద్దు..: రథసప్తమి సందర్భంగా ఆ రోజు సుప్రభాతం, తోమాల, అర్చన సేవలకు భక్తులను అనుమతించకుండా స్వామివారికి ఏకాం తంగా నిర్వహించనున్నారు. అలాగే నిజపాదర్శనం, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సం, సహస్ర దీపాలంకార సేవలు కూడా రద్దు చేశారు. -
రథ సప్తమికి భారీ బందోబస్తు
అరసవల్లి: ఈనెల 26న రథసప్తమి సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్టు డీఐజీ ఎ.రవి చంద్రన్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకొనేందుకు భక్తులు వేలాదిగా తరలిరానుండటంతో తగిన ఏర్పట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నామని డీఐజీ తెలిపారు. -
ఏడు వాహనాల్లో శ్రీవారు
పోటెత్తిన భక్తజనం, రెండు లక్షల మంది హాజరు ఉరుకులు పరుగులపై వాహన సేవలు 16 గంటల్లో 7 వాహనాల ఊరేగింపు {పత్యేక ఆకర్షణగా వేద విద్యార్థుల వైదిక హారం కూడలి ప్రాంతాల్లో భక్తుల మధ్య స్వల్ప తోపులాట ఒక రోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి పొందిన శ్రీవారి రథసప్తమి గురువారం అత్యంత వైభవంగా జరిగింది. పదహారు గంటల్లో ఏడు వాహనాలపై మలయప్ప విహరిస్తూ భక్తులను కటాక్షించారు. సూర్యప్రభ, చంద్రప్రభ, గరుడ, హనుమంత, చిన్న శేష వాహనంపై మలయప్ప మాత్రమే ఊరేగగా, కల్పవృక్ష, సర్వభూపాల వాహన సేవల్లో శ్రీదేవి, భూదేవితో కలసి విహరించారు. అశేష భక్తజనుల గోవిందనామ స్మరణలతో తిరుమల మార్మోగింది. సాక్షి, తిరుమల : రథ సప్తమి పర్వ దినాన వాహన సే వలను దర్శించుకునేందుకు భక్తులు మునుపెన్నడూ లేనివిధంగా తరలివచ్చారు. తెల్లవారు జామున 5.30 గంటలకు ప్రారంభమైన సూర్యప్రభ వాహన సేవ గం ట తర్వాత ఉత్తర మాడవీధి ప్రారంభానికి చేరుకుంది. 45 నిమిషాలు పాటు స్వామివారు సూర్యప్రభ వాహనంపై నిరీక్షించిన తర్వాత ఐదు నిమిషాల పాటు సూ ర్య కిరణాలు స్వామివారి పాదాలను స్పృసించాయి. భానుడినే వాహనంగా మలుచుకున్న దివ్యతేజోమూర్తి మలయప్పను భక్తులు దర్శించుకుని తన్మయత్వం చెందారు. వాహనం నిలబడిన చోట ఉత్సవ మూర్తికి భక్తులు హారతులు పట్టారు. ఉదయం 7.45 గంటలకు సూర్యప్రభ వాహనం ముగిసింది. అనంతరం 9 గంటలకు చిన్న శేషవాహన సేవ ప్రారంభమైంది. మార్గమధ్యంలో సర్కారు హారతులు మా త్రమే అనుమతించి కేవలం 50 నిమిషాల్లోనే ఊరేగింపు ముగించారు. తర్వాత 11గంటలకు గరుడ వా హన సేవ కోలాహాలంగా సాగింది. స్వామివారిని దర్శించుకునేందుకు నాలుగు మాడ వీధులు భక్తులతో కిటకిటలాడాయి. మిగిలిన వాహన సేవలకు సమయాభావంలో ఇబ్బందులు రాకూడదని వాహన సేవ ను 50 నిమిషాల్లోనే ముగించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన హనుమంత వాహనం సరిగ్గా రెండు గంటలకే ముగించారు. అనంతరం మధ్యాహ్నం 2.20 గంటలకు సుదర్శన చక్రతాళ్వార్ శ్రీవారి సన్నిధి నుంచి ఊరేగింపుగా వరాహస్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ వైదిక కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. తిరుమల జేఈవో శ్రీనివాసరాజు దంపతులు, ఇతర అధికారులు పుష్కరిణిలో పుణ్యస్నానం చేశారు. భక్తులు కూడా సంప్రదాయబద్ధంగా తలపై జిల్లేడు ఆకులు పెట్టుకుని పుణ్యస్నానాలు చేశారు. సాయంత్రం 4 గంటలకు కల్ప వృక్ష వాహనంపై శ్రీవారు శ్రీదేవి,భూదేవి సమేతంగా పురవీధు ల్లో విహరించారు. సాయంత్రం 6 గంటలకు సర్వభూపాల వాహనంపై ఊరేగారు. చివరగా రాత్రి 8గంటల కు చంద్ర ప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. పోటెత్తిన భక్తజనం ఈ సారి రథసప్తమి వాహన సేవలను దర్శించుకునేం దుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 5.30 గంటలకు ప్రారంభమైన సూర్యప్రభ వాహన సేవకు ముందుగానే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయ ప్రాంతానికి చేరుకున్నారు. ఉత్తరమాడవీధి నుంచి తూర్పు మాడ వీధి వరకు భక్తుల మధ్య స్పల్ప తోపులాట చో టు చేసుకుంది. వీరిని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది ఇబ్బంది పడ్డారు. వాహనసేవల్లో 2 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నట్టు టీటీడీ ఈవో గిరి ధర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు ప్రకటించారు. వేద విద్యార్థులతో వైదిక హారం బ్రహ్మోత్సవాల తరహాలోనే వాహన సేవల ముందు వీఐపీలు, ఇతర భక్తులు వేచి ఉండకుండా వారిని భక్తితత్పరతతో నియంత్రించేందుకు వేద విద్యార్థులతో ప్రత్యేకంగా వైదిక హారాన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్ర త్యేక ఆకర్షణగా నిలిచింది. ద్వాదశ పుండ్రాళ్లు (శ్రీ వారి నామాలు) ధరించిన వేద విద్యార్థులు ఎవ్వరినీ నొప్పించకుండా వైదిక హారాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కళా ప్రదర్శనలు రథసప్తమి సందర్భంగా నిర్వహించిన సంగీత, సాం స్కృతిక కళా బృందాల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో కర్ణాటక రాష్ట్రం ఉడిపి డప్పు వా యిద్య కళాకారుల విన్యాసం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. కోలాటాలు, చెక్క భజనలు, వివిధ దే వతామూర్తుల వేషధారణల్లోని కళాకారుల అభినయ ప్రదర్శనలు భక్తులను ఆనంద పరవశులను చేశాయి. లక్ష మందికి ఆహార పొట్లాల పంపిణీ రథసప్తమి సందర్భంగా ఆలయ నాలుగు మాడ వీ ధులు, దర్శనం కోసం వేచి ఉన్న క్యూలలోని భక్తులకు మొత్తం 50 వేల మందికి పైగా ఆహార పొట్లాలను పం పిణీ చేశారు. పులిహోర, సాంబారు అన్నం, పెరుగు అన్నం, ఉప్మా, పాలు, టీ, కాఫీ, మజ్జిగ సరఫరా చేశారు. టీడీడీ అన్నదానం డెప్యూటీ ఈవో వేణుగోపాల్, క్యాటరింగ్ ఆఫీసర్ శాస్త్రి ఆలయ వీధులు, క్యూలు తిరుగుతూ వితరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. రథసప్తని సందర్భంగా శ్రీవారి ఆలయం లోపల, ఆలయ పరిసరాలు పుష్ప తోరణాలు, విద్యుదీపాలంకరణలతో భక్తులను విశేషంగా ఆ కట్టుకున్నాయి.


