క్యూలైన్లలో కిక్కిరిసిన భక్తులు తొక్కిసలాటలో పలువురికి గాయాలు
ప్రజాప్రతినిధులు, వీవీఐపీల సేవలోనే తరించిన అధికారులు
రూ.లక్షలు ఇ చ్చిన దాతలకూ అవమానం
స్పృహ తప్పిన పలువురు భక్తులు
అరసవల్లి రథ సప్తమి దర్శనం ఏర్పాట్లలో బాబు సర్కారు విఫలం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణస్వామి దర్శన ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. వీవీఐపీల సేవలకు పెద్దపీట వేసి, సామాన్య భక్తులను పూర్తిగా విస్మరించింది. అరగంటలో దర్శనం కల్పిస్తామని ప్రకటించి ఏడెనిమిది గంటలకుపైగా ప్రత్యక్ష నరకం చూపించింది. అధికారులు, పాలకుల సమన్వయ లోపంతో కిక్కిరిసిన క్యూలైన్లలో కొందరు స్పృహ తప్పి పడిపోయారు.
ప్రధాన జంక్షన్ల వద్ద తోపులాటలు జరిగాయి. శనివారం అర్ధరాత్రి నుంచే స్వామి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో పడిగాపులు కాసినా దర్శనభాగ్యం కలగకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. తిరుపతి, కాశీబుగ్గ, సింహాచలం వంటి ఘటనల తర్వాత కూడా బాబు సర్కారు తీరు మార లేదనడానికి అరసవల్లిలో తాజాగా భక్తులు పడిన ఇబ్బందులే నిదర్శనం.
తొలిసారిగా టిక్కెట్ల దర్శనాలు రద్దు..
వారం రోజుల రాష్ట్ర స్థాయి పండగలో ఆఖరి ఘట్టమైన ఆదిత్యుని దర్శనం కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. అరగంటలో దర్శనం కల్పిస్తామని ప్రజాప్రతినిధులు ప్రకటించడంతో భక్తులు పోటెత్తారు. అయితే అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. భక్తులకు దర్శనం కల్పించలేక ఆఖరికి దర్శన పాసులను, టిక్కెట్లను రద్దు చేస్తున్నట్లుగా తొలిసారిగా ప్రకటించాల్సిన దుస్థితి ఎదురైంది. శనివారం అర్ధరాత్రి క్షీరాభిషేక సమయంలోనూ పరిస్థితి దయనీయంగా మారింది.
క్షీరాభిషేకానికి పాట్లు
ఆలయంలో ఏటా క్షీరాభిషేక సేవ ఓ పద్ధతిలో జరుగుతుంది. ఈ ఏడాది పోలీసుల ఆంక్షలు, నిర్వహణ లోపం వల్ల సిబ్బంది పాల బకెట్లను తీసుకువెళ్లే మా ర్గం ఇబ్బందికరంగా మారింది. ఆఖరికి స్వామికి క్షీరాభిõÙకం చేయడానికీ పాట్లు పడాల్సి వ చ్చింది. శఠగోపం, తీర్థం కూడా ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్వామికి పట్టువ్రస్తాలను శనివారం అర్ధరాత్రి సమర్పించారు.
ఆయన వెంట కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ఉన్నారు. వీరితోపాటు జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, హోంమంత్రి వంగలపూడి అనిత ఆదిత్యుని దర్శనం చేసుకున్నారు. కూటమి ప్రజాప్రతినిధుల సేవలో తరించిన అధికారులు సామాన్య, దాతృత్వం కల భక్తులకు నరకం చూపారు. ఆలయ పునర్నిర్మాణ దాత దివంగత వరుదు బాబ్జీరావు కుటుంబం కూడా దర్శనం సమయంలో తోపులాటలో చిక్కుకోవాల్సి వచ్చింది.
బాబ్జీరావు కుమార్తె, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఆమె సోదరులూ అవస్థలు పడుతూనే అంతరాలయంలోకి వెళ్లాల్సి వ చ్చింది. జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీనివాస్ తన వాళ్లకు దర్శనాలు కాలేదని మళ్లీ దర్శనానికి వ చ్చి.. వైకుంఠ ద్వారం నుంచి బయటకు వచ్చారు. రథ సప్తమి రోజున ఉత్తర ద్వార దర్శనాలు చేయించడంపైనా విమర్శలు చెలరేగాయి.
సామాన్యుల అవస్థలు వర్ణనాతీతం
కేంద్ర, రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధులు, వీవీఐపీలు, స్థానిక ఎమ్మెల్యేల వెనుక వందలాది మంది అనుచరులు రావడంతో రథసప్తమి అర్ధరాత్రి దర్శనాల్లో సామాన్యులకు ప్రత్యక్ష నరకం కనిపించింది. ఉచిత, రూ.100, రూ.300 క్యూలలో వచ్చే సామాన్య భక్తుల నుంచి రూ.500లు, డోనర్ పాసులు ఉన్న వారూ పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల అవస్థలైతే వర్ణణాతీతం.
పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రధానంగా కూటమి నేతలు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులకు మాత్రమే ప్రత్యేక దర్శనాలు జరిగాయి. క్యూలలో ఉన్న భక్తులు కుయ్యోమొర్రోమన్నా కనీసం వారిని పట్టించుకోలేదు. శనివారం రాత్రి 12 గంటలకు దర్శనాలు మొదలుకుని ఆదివారం సాయంత్రం వరకూ వేలకొద్ది వీవీఐపీ, వీఐపీ పాసులు రావడం గమనార్హం. దీనివల్ల మూడుచోట్ల తోపులాటలు జరిగాయి.
ఉదయం 11 గంటల సమయంలో తొక్కిసలాట జరగడంతో పలువురు భక్తులు స్పృహతప్పి పడిపోగా, మరికొందరికి గాయాలయ్యాయి. చిన్నారుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఎటు వెళ్లాలో తెలిపే బోర్డులు ప్రదర్శించకపోవడంతో భక్తులు గందరగోళానికి గురయ్యారు.



