breaking news
MDMK chief Vaiko
-
సీఎం విజయ్కు వైకో మద్దతు.. నిలదీసిన రిపోర్టర్పై తీవ్ర ఆగ్రహం!
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలియన్స్ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన రెండు రోజులకే, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో విలేకరుల సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. చెంగల్పట్టులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన వైకో, ఆ సమయంలో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సహనం కోల్పోయారు. సదర జర్నలిస్టుపై నోరు పారేసుకున్నారు. గత ఐదేళ్ల డీఎంకే పాలనలో అవినీతి రాజ్యమేలిందని, భూ రిజిస్ట్రేషన్ల నుండి ప్రతిదానిలోనూ ‘కటింగ్, కమిషన్’ వసూలు చేశారని వైకో ఆరోపించారు. ఈ క్రమంలో ఒక జర్నలిస్ట్ జోక్యం చేసుకుంటూ..గత ఐదేళ్లుగా అదే కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఈ అవినీతిపై ఎందుకు నోరు మెదపలేదు?అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా.. కూటమి రాజకీయాల్లో కొన్ని పరిమితులు ఉంటాయని, కూటమి ధర్మాన్ని పాటించడం వల్లే అప్పుడు మాట్లాడలేకపోయానని వైకో వివరణ ఇచ్చారు.అయితే సదరు జర్నలిస్ట్ అదే ప్రశ్నపై పట్టుబట్టడంతో వైకో ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. నువ్వు ఒక దురుద్దేశంతోనే ఇక్కడికి వచ్చావు. నిన్ను ఇక్కడికి ఎవరు పంపించారు? మీ యజమాని పత్రికను అమ్ముకున్నాడు. నువ్వు కూడా ఒక అమ్ముడుపోయిన వ్యక్తివి’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అంతటితో ఆగకుండా సదరు విలేకరిని ప్రెస్ మీట్ వదిలి వెళ్ళిపోవాలని ఆదేశించారు. వైకో ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడున్న ఎండీఎంకే కార్యకర్తలు, మద్దతుదారులు సదరు జర్నలిస్ట్పైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ కాసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే స్పందించి ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు, డీఎంకే కూటమి నుండి బయటకు వస్తున్నట్లు జూన్ 27న జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో వైకో అధికారికంగా ప్రకటించారు. గత తొమ్మిదేళ్లుగా కూటమిలో తమకు సరైన గౌరవం దక్కలేదని, డీఎంకే గుర్తుపై పోటీ చేయాల్సి రావడం తమ ఆత్మగౌరవానికి దెబ్బ తగిలిందని ఎండీఎంకే నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే కూటమి వీడిన వైకో, ఇప్పుడు డీఎంకే ప్రభుత్వ అవినీతిని టార్గెట్ చేస్తుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
డీఎంకే స్టాలిన్కు బిగ్ షాక్
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకేకు చిరకాల మిత్రుడిగా భావించే ఎండీఎంకే (MDMK) అధినేత వైకో, టీవీకే (TVK) అధినేత విజయ్ను కలవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అంతేకాదు, విజయ్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించడం, రాబోయే ఎన్నికల్లో టీవీకే ఆశ్చర్యకర ఫలితాలు సాధించే అవకాశం ఉందని వ్యాఖ్యానించడం స్టాలిన్ శిబిరంలో కలకలం రేపుతోంది. దీంతో, వైకో వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.విజయ్ను కలిసిన వైకో.. తాజాగా వైకో, విజయ్ మధ్య భేటీ జరిగింది. ఈ సందర్భంగా విజయ్ రాజకీయ భవిష్యత్తుపై వైకో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాజకీయాల్లో టీవీకే ఇప్పటికే ఒక శక్తిగా అవతరించిందని, యువత, మహిళలు, తొలి ఓటర్లలో విజయ్కు విశేష ఆదరణ ఉందని పేర్కొన్నారు. అలాగే, టీవీకే భవిష్యత్తులో తమిళ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదగగలదు. రాబోయే ఎన్నికల్లో మ్యాజిక్ చేసే అవకాశం కూడా లేకపోలేదు అని వ్యాఖ్యానించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.డీఎంకే కూటమికి గుడ్బై?1994లో డీఎంకే నుంచి విడిపోయి ఎండీఎంకే స్థాపించారు వైకో. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమి సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్తో చేతులు కలిపి పోటీ చేశారు. ఎండీఎంకేకు నాలుగు సీట్లు కేటాయించగా.. అందులో మూడు సీట్లను డీఎంకే గుర్తు(ఉదయించే సూర్యుడు), మరో అభ్యర్థిని స్వంత గుర్తుతో వైకో బరిలోకి దించారు. ఎన్నికల్లో ఒక చోట విజయం సాధించారు. అయితే, గత కొంతకాలంగా ఎండీఎంకే నేతల వైఖరిలో మార్పు కనిపిస్తోందన్న చర్చ సాగుతోంది. వైకో కుమారుడు, పార్టీ కీలక నేత దురై వైకో కూడా ఇటీవల టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది.ఇక, వైకో వంటి సీనియర్ ద్రవిడ నాయకుడు విజయ్ను బహిరంగంగా ప్రశంసించడం సాధారణ విషయం కాదు. ప్రస్తుతం ఆయన.. డీఎంకే కూటమిలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్తు రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఎండీఎంకే నిజంగానే డీఎంకే కూటమిని వీడి టీవీకేకు చేరితే, అది స్టాలిన్కు రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బగా మారవచ్చు. అదే సమయంలో విజయ్ పార్టీకి ద్రవిడ రాజకీయాల్లో విశ్వసనీయత పెరిగే అవకాశం ఉంది.நல்லது நடந்தால் ஆதரிப்பேன் வைகோ அதிரடி 🔥🔥🔥@DMKITwing எதுக்கும் துரோகி பட்டம் கட்டி ஒப்பாரி வைக்க ரெடியா இருங்க 🤣🤣🤣 pic.twitter.com/WAVDSuUXFp— TVK Sqυα∂💥 (@TVKVijay24x7) June 18, 2026అయితే, సినీ నటుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తమిళనాడులో సంప్రదాయ డీఎంకే-ఏఐఏడీఎంకే రాజకీయాలకు ప్రత్యామ్నాయం ఏర్పడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా యువ ఓటర్లలో విజయ్కు పెరుగుతున్న ఆదరణ కారణంగా పలు చిన్న, మధ్య తరహా పార్టీలు కూడా టీవీకే వైపు మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైకో భేటీ సాధారణ మర్యాదపూర్వక సమావేశమా? లేక భవిష్యత్తు రాజకీయ పొత్తులకు సంకేతమా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.ఎమ్మెల్యే రాజీనామా?ఇటీవల చెన్నైలో పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి ఆదవ్ అర్జునా వైకోను కలవగా, మరుసటి రోజు సీఎం విజయ్తో వైకో సమావేశం కావడం ఈ ఊహాగానాలకు మరింత బలం ఇచ్చింది. అయితే ఈ భేటీ పూర్తిగా రాజకీయ అంశాలపై కేంద్రీకృతమైందని పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ, అధికారికంగా కూటమి మార్పుపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు.. ఎమ్మెల్యే డీఎంకే గుర్తుపై పోటీ చేసి గెలిచినందున తక్షణమే ప్రభుత్వానికి ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వలేని పరిస్థితి ఉందని, అందుకే రాజీనామాలపై ఆలోచన జరుగుతోందన్న సమాచారం కూడా పార్టీ వర్గాల నుంచి వెలువడుతోంది. -
తమిళనాడులో తెరపైకి మరోసారి ఆ వివాదం
చెన్నై: తమిళనాడులో కావేరి నదీ జలాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కావేరీ నదీకి మధ్య భాగంలో మేఘదాతు వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ.. ఇవాళ(జూన్ 2, మంగళవారం) తమిళ పార్టీల నేతృత్వంలో చెన్నైలో ఆందోళనలు చేపట్టారు. మేఘదాతు ప్రాజెక్టుకు కర్ణాటకు సర్కార్ ఏర్పాట్లు చేస్తుండగా.. కర్ణాటక వైఖరిని ఖండిస్తూ ఆందోళనలకు ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో పిలుపునిచ్చారు.డ్యామ్ను కచ్చితంగా నిర్మించి తీరుతామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కర్ణాటక ప్రభుత్వం మొండి వైఖరిని వ్యతిరేకిస్తూ.. అలాగే ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడానికి ఈ నిరసన కార్యక్రమం చేపటినట్లు ఆయన తెలిపారు. చెన్నై జిల్లా కలెక్టరేట్ సమీపంలో తన నాయకత్వంలో జరిగే ఈ నిరసనలో పలు రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, సామాజిక సంస్థలు పాల్గొన్నాయి.ఈ ప్రాజెక్టు కోసం కర్ణాటక రూ. 5,900 కోట్లు కేటాయించిందని, నిర్మాణ సామగ్రిని కూడా సిద్ధం చేస్తోందని పేర్కొన్న వైగో.. 68 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉన్న ఈ ప్రతిపాదిత డ్యామ్.. సుప్రీంకోర్టు, కావేరీ నీటి నిర్వహణ అథారిటీ ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని ఇటీవల వైగో ఆరోపించారు. ఈ ప్రాజెక్టు వల్ల తమిళనాడు సాగునీటి అవసరాలు తీవ్రంగా దెబ్బతింటాయని.. మెట్టూరు డ్యామ్కు నీటి ప్రవాహం తగ్గుతుందని, దీనివల్ల కావేరీ నీటిపై ఆధారపడిన డెల్టా జిల్లాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఆయన హెచ్చరించారు. -
డీఎంకే కూటమి: వైగో ప్రత్యేక మేనిఫెస్టో!
సాక్షి, చెన్నై: ఎండీఎంకే నేత వైగో 55 హామీలతో ప్రత్యేక మేనిఫెస్టోను బుధవారం ప్రకటించారు. డీఎంకే కూటమిలో ఎండీఎంకే ఆరు స్థానాల్లో పోటీచేస్తున్న విషయం తెలిసిందే. డీఎంకే చిహ్నం ఉదయ సూర్యుడిపై ఈ పార్టీ అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో డీఎంకే అధికారంలోకి రాగానే, తమ పార్టీ తరఫున అమలు చేయిస్తామని 55 హామీలతో ఎన్నికల మేనిఫెస్టోను ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో ప్రకటించారు. హామీల్లో కొన్ని.. హిందీ, సంస్కృతాన్ని రాష్ట్రంలోకి అనుమతించం అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం లక్ష్యంగా ముందుకు వ్యవసాయాన్ని రక్షించుకుంటాం.ఈ రంగాన్ని నాశనం చేసే రీతిలో తీసుకొచ్చే పథకాలను అడ్డుకుంటాం నదుల అనుసంధానానికి చర్యలు, నది జలాల పంపిణీలో చిక్కులు, వివాదాల పరిష్కారానికి సహకారం. పరిశ్రమల అభివృద్ధి, పబ్లిక్ రంగ సంస్థల పరిరక్షణ, విద్యుత్ వినియోగం క్రమబద్ధీకరణ, కారి్మక సంక్షేమం, అధికారంలోకి డీఎంకే రాగానే, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, రవాణా ఉద్యోగ కార్మికుల డిమాండ్లపై దృష్టి అవినీతినిరూపు మాపడం లక్ష్యం, స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారాలు, సంపూర్ణ మద్యనిషేధానికి చర్యలు ప్రజా జీవితాల్లో వెలుగు లక్ష్యంగా పథకాల అమలుకు పట్టు, వెనుకబడిన సామాజిక వర్గాలు, మైనారిటీ సంక్షేమం లక్ష్యంగా ముందుకు సాగుతామన్న హామీలు గుప్పించారు. చదవండి: చిన్నమ్మ మద్దతు మాకే! సర్వేలన్నీ ఆ పార్టీ వైపే : 161 నుంచి 169 స్థానాలు! -
రూ.100 ఇస్తేనే సెల్ఫీ.. 53 వేలు వసూలు!
సాక్షి, చెన్నై: రూ. వంద చేతిలో పెడితే గానీ, సెల్ఫీ దిగేందుకు ఎండీఎంకే నేత, ఎంపీ వైగో అనుమతించడం లేదు. పార్టీ కార్యకర్త, నాయకుడు ఎవరైనా సరే రూ.వంద చెల్లించి ఫోటో దిగాల్సిన పరిస్థితి. ఇవ్వకుంటే, కరాఖండిగా ఫొటో దిగే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పేస్తున్నారు. ఆ దిశగా గురువారం ఒక్క రోజు వైగోకు ఈ సెల్ఫీ, ఫోటోల రూపంలో రూ.53 వేలు దక్కడం గమనార్హం. రాజ్యసభ సభ్యుడు ఎండీఎంకే నేత వైగో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తనను రాజ్య సభకు పంపించారని, అందుకు తగ్గట్టుగా తన పయనం ఉంటుందని ఇప్పటికే వైగో ప్రకటించారు. ఆ దిశగా రాజ్యసభలో వైగో ప్రసంగాలు హోరెత్తాయి. అదే సమయంలో ప్రస్తుతం ఎంపీగా మారిన వైగో తన పార్టీకి ఆదాయం సమకూర్చుకునేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. గతంలో ఎండీఎంకేకు భారీగానే నిధులు దక్కినా, కాల క్రమేనా కష్టాలు తప్పలేదు. ముఖ్య నాయకులు పార్టీ వీడడంతో ఖర్చు పెట్టే వాళ్లు కరువయ్యారు. దీంతో నిధులను సమకూర్చుకునేందుకు కొత్త బాట వేశారు. ఇందులో భాగంగా పార్టీ కార్యాలయం ద్వారా గత వారం ఓ ప్రకటన విడుదల చేయించారు. ఇక, మీదట వైగోకు కప్పే శాలువలు, వేసే పూల మాలలు, పుష్పగుచ్ఛాల ఖర్చుకు అయ్యే మొత్తాన్ని పార్టీకి సమర్పించాలని సూచించారు. అలాగే, ఇక మీదట వైగోతో సెల్పీ గానీ, ఫోటోగానీ దిగాలన్నా రూ. వంద చెల్లించాల్సిందేనని ప్రకటించారు. ఈ రకంగా వంద కోట్టు.. ఫొటో పట్టు అంటూ వైగో ముందుకు సాగే పనిలో పడ్డారు. ఒక్క రోజులో రూ. 53 వేలు... గురువారం చెన్నై నుంచి కృష్ణగిరికి వైగో పయనం అయ్యారు. తన పయన మార్గంలో పలు చోట్ల కారు దిగి, కేడర్ను, స్థానికంగా ఉన్న నాయకుల్ని కలిసి వెళ్లారు. వైగో రాకతో ఎండీఎంకే వర్గాలు ఉరకలు తీశాయి. ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. అయితే, ముందు రూ.100 చేతిలో పెట్టాలని, ఆ తర్వాతే సెల్ఫీ, ఫొటో అని వైగో తేల్చారు. దీంతో నాయకులు, కార్యకర్తలు తమ అధినేతకు రూ.వంద ఇచ్చి మరీ సెల్ఫీలు తీసుకున్నారు. అయితే, ఆ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు సెల్ఫీలు దిగేందుకు పెద్ద ఎత్తున రాగా వంద ఇస్తేనే అంటూ వైగో తేల్చడంతో వారు వెనుదిరగక తప్పలేదు. వంద ఇవ్వకుంటే, సెల్ఫీ లేదంటూ వైగో అనుమతి నిరాకరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడం గమనార్హం. ఇక, ఈ ఒక్క రోజు చెన్నై నుంచి కృష్ణగిరి వరకు సాగిన పయనంలో వైగోకు రూ. 53 వేలు లభించినట్టు, దీనిని పార్టీ నిధికి ఆయన అప్పగించినట్టుగా ఎండీఎంకే వర్గాలు పేర్కొన్నాయి. -
కశ్మీర్పై వైగో సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: జమ్మూ కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దుపై ఎండీఎంకే చీఫ్, ఎంపీ వైగో (వి.గోపాలసామి) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం వందవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకునే నాటికి కశ్మీర్ భారత్లో భాగంగా ఉండదని ఆయన జోస్యం చెప్పారు. మంగళవారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘భారత్ వందవ స్వాతంత్ర్య దినోత్సవం జరుగుపుకునే సమయానికి భారత్లో కశ్మీర్ భాగంగా ఉండదు. బీజేపీ ప్రభుత్వం కశ్మీర్పై బురద చల్లింది. గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ కశ్మీర్కు 30 శాతం అన్యాయం చేస్తే.. బీజేపీ 70 శాతం చేసింది. కశ్మీర్పై గతంలో కూడా నా అభిప్రాయం ఇదే విధంగా చెప్పాను’అని అన్నారు. కాగా కశ్మీర్ విభజన సందర్భంగా పార్లమెంట్లో వైగో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిందం చేసిందని తీవ్ర స్థాయిలో విమర్శించిన విషయం తెలిసిందే. కాగా డీఎంకే వ్యవస్థాపకుడు, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై 110 జయంత్యుత్సవాలను తమ పార్టీ నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. వచ్చే నెలలో ఈ వేడుకలను ప్రారంభిస్తామని చెప్పారు. -
మరింత ఉధృతం
సాక్షి, చెన్నై : కావేరి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి డీఎంకే నిర్ణయించింది. ఈ విషయంగా చర్చించేందుకు ప్రతిపక్షాలను ఆహ్వానిస్తూ మళ్లీ అఖిల పక్షం సమావేశానికి స్టాలిన్ నిర్ణయించారు. ఈనెల 16న జరిగే సమావేశం మేరకు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక, కావేరి కోసం ఆత్మాహుతియత్నం చేసిన ఎండీఎంకే నేత వైగో బంధువు శర్వణ సురేష్ మరణించాడు.కావేరి అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీ సాధన లక్ష్యంగా రాష్ట్రంలో పలు రూపాల్లో ఆందోళనలు సాగినా కేంద్రం నుంచి స్పందన కరువే. రాష్ట్ర ప్రభుత్వం సైతం మమా అనిపించే చర్యలతో ముందుకు సాగుతోంది. దీంతో తమ పోరును మరింత ఉధృతం చేయడానికి ప్రతిపక్షాలు సిద్ధం అవుతున్నాయి. ఇందుకోసం మరోమారు అఖిల పక్షం సమావేశానికి డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ శనివారం పిలుపునిచ్చారు. 16వ తేదీ సాయంత్రం అన్నా అరివాలయం వేదికగా ఈ సమావేశం సాగనుంది. ఈ విషయంగా స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, అఖిల పక్షం సమావేశంలో పోరు మరింత ఉధృతం లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నామన్నారు. అలాగే, 16వ తేదీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం వ్యవహారంలో కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ వళ్లువర్కోట్టంలో ప్రతిపక్షాల నేతృత్వంలో భారీ నిరసన కార్యక్రమానికి నిర్ణయించామన్నారు. కావేరి వ్యవహారంలో కేంద్రం చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, పోరు ఎంత ఉధృతం చేయడానికైనా తాను సిద్ధమేనని హెచ్చరించారు. అన్నింటా కాషాయం రంగును పులిమే రీతిలో కేంద్రం అడుగులు సాగుతున్నాయని ధ్వజమెత్తారు. కాగా, తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ చిత్తిరై ఒకటో తేదీన తమిళ కొత్త సంవత్సరం అని ప్రకటించడం శోచనీయమని విమర్శించారు. తై ఒకటో తేదీ తమిళ కొత్త సంవత్సరంగా అసెంబ్లీలో సైతం కరుణానిధి తీర్మానం తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఇక, 16వ తేదీ తమిళ మానిల కాంగ్రెస్ సైతం కావేరి సాధన నినాదంతో భారీ ఆందోళన కార్యక్రమాల్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు నిర్ణయించింది. ఇక, కావేరి వ్యవహారంలో తమిళనాడుకు తీవ్ర అన్యాయం జరిగేందుకు డీఎంకే, కాంగ్రెస్లే కారణం అని డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్పట్లో ఈ రెండు పార్టీలు కలిసి ఆడిన నాటకాల కారణంగా, ఇప్పుడు రైతన్నలు కావేరి కోసం అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తమ ప్రభుత్వం అన్ని రకాలుగా కేంద్రం మీద ఒత్తిడి తెస్తూనే ఉందని, తీర్పు అనుకూలంగానే ఉంటుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. శర్వణ సురేష్ మృతి కావేరి సాధన నినాదంతో ఎండీఎంకే నేత వైగో బంధువు శర్వణసురేష్(55) శుక్రవారం విరుదునగర్లో ఆత్మాహుతి యత్నం చేసిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడ్డ సురేష్ను తొలుత విరుదునగర్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం మదురైకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం సురేష్ మరణించాడు. ఈ సమాచారంతో వైగో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. సురేష్ మృతదేహం వద్ద బోరున విలపించారు. ఇక, మీదట ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని వేడుకున్నారు. కాగా, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం పేర్కొంటూ, కావేరి కోసం ఆత్మహత్యలు, ఆత్మాహుతుల జోలికి దయ చేసి వెళ్ల వద్దని వేడుకున్నారు. ఇప్పటివరకు మరణించిన వారి కుటుంబాల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం పరిశీలన చేస్తోందని, త్వరలో మంచి ప్రకటన చేస్తామన్నారు. -
'జయలలిత నాకు చెల్లెలులాంటిది'
-
'జయలలిత నాకు చెల్లెలులాంటిది'
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి గడిచేకొద్ది విషమంగా మారుతుండటంతో పార్టీలు, రాజకీయాలకతీతంగా ఆమె కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. రాజకీయాలను పక్కనబెడితే జయలలిత తనకు చెల్లెలు లాంటిదని ఎండీఎంకే అధినేత వైగో చెప్పారు. అపోలో వైద్యులు జయలలితకు అధునాతన చికిత్సను అందిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ ఆందోళనకర పరిస్థితి నుంచి ఆమె త్వరగా బయటపడాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. మరో వైపు అపోలో ఆసుపత్రి వర్గాలు, లండన్కు చెందిన ప్రఖ్యాత వైద్య నిపుణుడు ప్రొఫెసర్ రిచర్డ్ బేలే ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తంచేశారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడేందుకు తాము శాయశక్తులా కృషిచేస్తున్నామని, కానీ ఆమె పరిస్థితి విషమంగా మారుతున్నట్టు పేర్కొన్నారు. దీంతో తమిళనాడుతోపాటు దేశవ్యాప్తంగా జయలలిత ఆరోగ్యంపై ఆందోళనలు నెలకొన్నాయి. తమిళనాడు రాజకీయాల్లో చిరకాల ప్రత్యర్థిగా ఉన్న కరుణానిధి, ప్రతిపక్ష నేత స్టాలిన్లు కూడా జయ పూర్తిగా కోలుకోవాలని కోరుతున్నట్టు ఉదయం ట్వీట్లు చేశారు. మరోవైపు ఆమె కోలుకోవాలని తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రజలు పూజలు నిర్వహిస్తున్నారు. -
ఇది నాటకం కాదు !
‘ఇది నాటకం కాదు...ఆలోచించి...పరిశీలించి... సమీక్షించి తీసుకున్న నిర్ణయం’ అని ఎండీఎంకే నేత వైగో వ్యాఖ్యానించారు. ఎన్నికల రేసు నుంచి తాను తప్పుకున్న వ్యవహారం గురించి పై విధంగా స్పందించారు. అదే సమయంలో తప్పుకుంటూ తమ మీద నిందల్ని వేయడాన్ని డీఎంకే తీవ్రంగా పరిగణించింది. వైగో వ్యాఖ్యలను డీఎంకే దళపతి తీవ్రంగా దుయ్యబట్టారు. ఓటమి భయంతో తప్పుకున్నారని ఎద్దేవా చేశారు. సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నిల కేసు నుంచి తాను తప్పుకుంటున్నట్టుగా ఎండీఎంకే నేత వైగో ప్రకటించిన విషయం తెలిసిందే. రెండుదశాబ్దాల అనంతరం బరిలో దిగడం ఏమిటో, తప్పుకోవడం ఏమిటీ..? అని పెదవి విప్పే వాళ్లు పెరిగారు. అలాగే, 2011లో ఎన్నికల్ని బహిష్కరించి, అన్నాడీఎంకేకు అనుకూలంగా వ్యవహరించినట్టే, ఇప్పుడు కూడా అదే బాటలో ఉన్నట్టుందన్న ఆరోపణలు బయలు దేరాయి. ఇదంతా ఓ నాటకం అన్న విమర్శలు వస్తుండడం, ఇక, వైగో శకం ముగిసినట్టే అన్న సెటైర్లు బయలు దేరడంతో మంగళవారం మీడియా ముందుకు వైగో వచ్చారు. తాను రేసు నుంచి తప్పుకున్న కోవిల్పట్టి నుంచే మీడియాతో మాట్లాడారు. తానేదో నాటకం రచించినట్టు, దానిని ఆచరణలో పెడుతున్నట్టు ఆరోపణలు గుప్పిస్తున్నారని మండి పడ్డారు. ఇది నాటకం కాదు...ఆలోచించి.. పరిశీలించి...సమీక్షించి తీసుకున్న నిర్ణయంగా వివరించారు. తనను అడ్డం పెట్టుకుని కులచిచ్చు రగిల్చేందుకు కుట్ర చేస్తుండడంతోనే ఎన్నికలకు దూరంగా ఉన్నానన్న తన వాదనను సమర్థించుకున్నారు. తాను తీసుకున్న ఈ నిర్ణయాన్ని పునస్సమీక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కోవిల్పట్టి బరిలో వినాయక రమేష్ కొనసాగుతారని, ఇందులో ఎలాంటి మార్పులేదని తేల్చారు. ఇక, వైగో ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న వ్యవహారంపై కూటమిలోని నాయకుల్లో ఒక్క తిరుమావళవన్, వాసన్ మాత్రం స్పందించారు. పునస్సమీక్షించాలని తిరుమా సూచిస్తే, వాసన్ మాత్రం ఆహ్వానించడం గమనార్హం. ఇక, ఆ కూటమిలో వైగో తీరుతో గందరగోళం బయలుదేరినట్టు స్పష్టం అవుతోంది. వైగో నిర్ణయంతో ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారాలకు దూరంగా ఉండే పనిలో పడడంతో, సీఎం అభ్యర్థి కెప్టెన్ విజయకాంత్ జట్టును గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తారా? అన్న ప్రశ్నతో కూడి సెటైర్లు బయలు దేరాయి. ఇక, వామపక్ష నాయకులు నోరు మెదపకపోవడం గమనార్హం. భయంతో విమర్శ : ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటూ నిందల్ని తమ మీద వేయడాన్ని డీఎంకే తీవ్రంగా పరిగణించింది. ఎన్నికల ప్రచారంలో ఉన్న స్టాలిన్ వైగో పేరు కూడా పలకకుండా తీవ్రంగా దుయ్యబట్టారు. ఓటమి భయం వారికి స్పష్టంగా కన్పిస్తున్నదని, అందుకే రేసు నుంచి తప్పుకున్నారంటూ ఎద్దేవా చేశారు. రేసు నుంచి తప్పుకుని ఉంటే, ఆయన గురించి స్పందించాల్సిన అవసరం తనకు లేదని, అయితే, డీఎంకే మీద నింద వేయడం వల్లే స్పందిస్తున్నానని మండి పడ్డారు. డీఎంకే ఈ ఎన్నికల్లో పతనం కావాలన్న కాంక్షతో ఆయన ఆధారరహిత ఆరోపణలు గుప్పిస్తున్నారని , దీనిని బట్టి చూస్తే, ఆయన ఎ వరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారో ఆ కూటమి వర్గాలే అర్థం చేసుకోవాలని ఎద్దేవా చేశారు. దిగజారుడు వ్యాఖ్యలు మానుకుంటే మంచిదని, లేదంటే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక, వైగో తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ వ్యాఖ్యనిస్తూ, నామినేషన్ వేయడానికి అన్ని సిద్ధం చేసుకుని వచ్చి, చివరకు వెనక్కు తగ్గడంలో ఆంతర్యమేమిటో అని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమ కూటమితో రాష్ట్రానికి ఒరిగేదిమీ లేదని, అయితే, ఎవరికో మంచి చేయడానికి ఈ కూటమి తెర మీదకు వచ్చిందన్న విషయం వైగో తీరుతో స్పష్టం అవుతోందని అనుమానం వ్యక్తం చేశారు. -
తోపులాటలో సొమ్మసిల్లిన వైగో
చిత్తూరు: చిత్తూరు కలెక్టరేట్ ముట్టడికి బయల్దేరిన వైగోను తమిళనాడు పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీగా బయల్దేరిన ఆయనను గాంధీపురం వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వైగో అనుచరులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో వైగో సొమ్మసిల్లి పడిపోయారు. దాంతో ఆయననకు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు సుమారు 400మంది వైగో అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరిని ఓ కల్యాణమండపానికి తరలించారు. మరోవైపు చిత్తూరు కలెక్టరేట్ ముట్టడికి వైగో వస్తున్నట్లు సమాచారంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ...జిల్లా సరిహద్దుల్లో భారీగా మోహరించారు. -
సహనాన్ని పరీక్షించొద్దు
సాక్షి, చెన్నై:తమిళుల సహనాన్ని పరీక్షించవద్దు అని కేంద్రాన్ని ఎండీఎంకే అధినేత వైగో హెచ్చరించారు. కావేరి తీరంలో మిథైన్ తవ్వకాలు, కావేరి జలాల్ని అడ్డుకునే రీతిలో కర్ణాటక కుట్రల్ని ఖండిస్తూ, చెన్నైలోని క స్టమ్స్ కార్యాలయం ముట్టడికి వైగో నేతృత్వంలో నిరసనకారు లు బుధవారం యత్నించారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. కావేరి జలాల్ని అడ్డుకునే విధంగా మేఘదాతులో డ్యాముల నిర్మాణానికి కర్ణాటక సర్కారు చేస్తున్న కుట్రల్ని, కావేరి తీరంలో మీథైన్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ కావేరి హక్కుల భద్రతా సమాఖ్య నేతృత్వంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం చెన్నైలో భారీ నిరసనకు పిలుపునిచ్చారు. ఎండీఎంకే నేత వైగో, తమిళర్ వాల్వురిమై కట్చి నేత వేల్ మురుగన్, ఇండియ దేశీయ లీగ్ నేత బషీర్ అహ్మద్ నేతృత్వంలో అన్నదాతలు, కావేరి తీరంలోని అన్ని సంఘాలకు చెందిన వాళ్లు కేంద్ర ప్రభుత్వ కస్టమ్స్ కార్యాలయం ముట్టడికి ర్యాలీగా బయలు దేరారు. ఆ కార్యాలయాన్ని సమీపిస్తున్న నిరసనకారుల్ని మార్గ మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను ఏర్పాటు చేసి నిరసన కారులు అటు వైపుగా రాకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు. పోలీసులు తమను అడ్డుకోవడంతో కాసేపు రోడ్డుపై నిరసన కారులు బైఠాయించారు. ఈసందర్భంగా నిరసనను ఉద్దేశించి వైగో ప్రసంగిస్తూ, కేంద్రంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కావేరి తీరంలో మీథైన్ తవ్వకాలకు అనుమతి ఇవ్వొద్దని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్రం పెడ చెవిన పెట్టడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. కావేరి నదీ జలాల్ని అడ్డుకునేందుకు కర్ణాటక కుట్రలు చేస్తున్నా, కేంద్రం జోక్యం చేసుకోకుండా మెతక వైఖరిని అనుసరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ వ్యవహారాల్లో అన్ని పక్షాలు ఏకమై పోరాడాల్సిన అవశ్యం ఉందన్నారు. ఇందు కోసం తాను అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి, సీఎం పన్నీరు సెల్వంతో పాటుగా అన్ని రాజకీయ పక్షాల నాయకులకు లేఖలు రాశానని, అయితే, వారి నుంచి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి చూస్తే కావేరి డె ల్టా జిల్లాల ప్రజల సంక్షేమం మీద వారికి చిత్త శుద్ధి ఏ పాటిదో అర్థమవుతోందని విమర్శించారు. శాంతి యుతంగా, గాంధీ, అన్నా మార్గంలో నడుస్తున్న తమిళుల సహనాన్ని పరీక్షించ వద్దు అని, తమలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటే తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి ఉంటుందని కేంద్రాన్ని హెచ్చరించారు. తమిళుల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వాళ్లకు పుట్టగతులు ఉండవని, దీన్ని గుర్తెరిగి తమ సహనాన్ని పరీక్షించకుండా మీథైన్ తవ్వకాల అనుమతుల్ని వెనక్కు తీసుకోవాలని, కర్ణాటక చర్యలకు కళ్లెం వే స్తూ, కావేరి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనతో ఆ పరిసరాల్లో వాహనాల రాక పోకలకు ఆటంకం నెలకొంది. చివరకు వైగో, వేల్ మురుగన్, బషీర్ అహ్మద్తో పాటుగా అణు వ్యతిరేక ఉద్యమ నేత ఉదయకుమార్, ఎండీఎంకే నేతలు మల్లై సత్య, మాసిలామణి, జీవన్, రైతు సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. -
వైగో ‘సోదరి’ జపం
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేతో కలసి అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు ఎండీఎంకే నేత వైగో ప్రయత్నిస్తున్నారు. ఇందుకు అద్దం పట్టే రీతిలో శనివారం ఆయ న తన సోదరి జయలలిత జపాన్ని అందుకున్నారు. ఆమెను పొగడ్తల వర్షంలో ముంచెత్తారు. తన సానుభూతిని తెలియజేశారు. డీఎంకేపై దుమ్మెత్తి పోయ డం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. డీఎంకేలో చీలిక తెచ్చే రీతిలో ఎండీఎంకేను వైగో ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయాల్లో కొన్నేళ్లు డీఎంకే కూటమితో దోస్తీ కట్టకుండా ఉన్న వైగో ఎట్టకేలకు 2006లో జత కట్టినట్టు కట్టి వెనక్కి వచ్చేశారు. ఆ ఎన్నికల అనంతరం అన్నాడీఎంకే పక్షాన నిలబడ్డారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా జయలలితను నమ్ముకునే ముందుకు కదిలా రు. అయితే, 2011 ఎన్నికల్లో ఊహించని దెబ్బ జయలలిత రూపంలో వైగోకు ఎదురైంది. ఆ ఎన్నికల్నే ఆయన బహిష్కరించాల్సి వచ్చింది. ఎట్టకేలకు 2014 లోక్ సభ ఎన్నికలను బీజేపీతో కలిసి ఎదుర్కొని డిపాజిట్లను గల్లంతు చేసుకున్నారు. ఆ ఎన్నికల అనంతరం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగట్టే పనిలో పడ్డ వైగోకు ఆ పార్టీ వర్గాల నుంచి బెదిరింపులు తప్పలేదు. తానేమి తక్కువ తిన్నా నా..? అన్నట్టుగా ఎదురు దాడిలో ఉన్న వైగో శని వారం అనుహ్యంగా మళ్లీ సోదరి జపం అందుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు తెర లేపింది. సోదరి జపం : మూడోసారిగా జయలలిత సీఎం అయ్యాక ఓ కార్యక్రమం నిమిత్తం ఓ ఎంఆర్ వైపుగా వెళ్తున్న సమయంలో అటు వైపుగా మద్య నిషేదం నినాదంతో ర్యాలీగా వస్తున్న వైగోను చూడగానే తన కాన్వాయ్ను ఆపించారు. ఇది జయలలిత, వైగోల మధ్య ఉన్న సోదరీ, సోదర బంధానికి నిదర్శనంగా పరిగణిం చారు. పాదయాత్రగా వె ళుతున్న తనను సోదరి పరామర్శించడం ఆనందంగా ఉందని వైగో సైతం స్పష్టం చేశారు. ఆ తర్వాత ఏ క్షణంలోనూ జయలలితకు అనుకూలంగా ఆయన వ్యాఖ్యలు చేయలేదు. తాజా గా, రాష్ట్రంలో సాగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జయలలిత జపాన్ని వైగో అందుకోవడం చర్చనీయాంశంగా మారి ఉన్నది. పొగడ్తలు, సానుభూతి : ముల్లై పెరియార్ డ్యాం నీటి మట్టం పెంపును పురస్కరించుకుని విజయోత్సవ వేడుక శనివారం ఉసలం పట్టిలో జరిగింది. ఇందులో వైగో ప్రసంగించే సమయంలో జయలలితను పొగడ్తలతో ముంచెత్తారు. తను సానుభూతిని తెలియజేశారు. ఈ డ్యాం నీటి మట్టం పెంపు కోసం జయలలిత అష్టకష్టాలు పడ్డారని, కోర్టుల్లో ఎంతో పోరాడారని, ఆమె సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ విజయోత్సవ సత్కారం ఆమెకు నిర్వహించాల్సి ఉందని, అయితే, తన సోదరికి ఎదురైన కష్టాలు తీవ్ర మనో వేదనకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎంకే అధినేత ఎం కరుణానిధి తమిళ ద్రోహి అని, ముల్లై పెరియార్ డ్యాంకు వ్యతిరేకంగా కేరళతో కలిసి ఆయన ఎన్నో కుట్రలు చేశారని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జయలలిత తనను అన్నా అని పిలుస్తారని, అందుకే ఆమెను తన సోదరిగా భావిస్తున్నానన్నారు. ఈ వ్యాఖ్యలతో ఆ విజయోత్సవ వేడుక పరిసరాల్లో చప్పట్లు మార్మోగినా, డీఎంకే వర్గాలకు మాత్రం షాక్ తగిలినట్టు అయింది. ఎండీఎంకేను తమ వైపు తిప్పుకోవాలన్న వ్యూహంతో ఉన్న కరుణానిధి అడుగులకు బ్రేక్ పడ్డట్టు అయింది. సోదరి జపంతో మళ్లీ అన్నాడీఎంకేకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో వైగో ఉన్నట్టున్నారేమోనన్న చర్చ మొదలైంది. -
కసాయికి ఆహ్వానమా?
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సెను ఆహ్వానించడంపై తమిళ రాజకీయ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే డీఎంకే, అన్నాడీఎంకే దీనిపై తమ నిరసన తెలిపాయి. తాజాగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన ఎండీఎంకే కూడా ఈ నిర్ణయంపై పునరాలోచించాలని సూచించింది. ఎండీఎంకే నాయకుడు వైగో ఈ మేరకు శుక్రవారం నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ లను కలిసి విజ్ఞప్తి చేశారు. అమిత్ షా, అరుణ్ జైట్లీ సమక్షంలో మోడీని వైగో కలిశారు. తమిళులను ఊచకోత కోసిన కసాయి రాజపక్సను ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించవద్దని మోడీని కోరినట్టు వైగో తెలిపారు. మోడీ నుంచి ఎటువంటి స్పందన వచ్చిందన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు.


