తమిళనాడులో తెరపైకి మరోసారి ఆ వివాదం | Cauvery Flashpoint Returns, Tamil Parties Mass Protest In Chennai Over Controversial Mekedatu Dam Proposal | Sakshi
Sakshi News home page

తమిళనాడులో తెరపైకి మరోసారి ఆ వివాదం

Jun 2 2026 8:09 AM | Updated on Jun 2 2026 8:53 AM

Mekedatu Dam Row: Tamil Parties Protests

చెన్నై: తమిళనాడులో కావేరి నదీ జలాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కావేరీ నదీకి మధ్య భాగంలో మేఘదాతు వద్ద రిజర్వాయర్‌ నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ.. ఇవాళ(జూన్‌ 2, మంగళవారం) తమిళ పార్టీల నేతృత్వంలో చెన్నైలో ఆందోళనలు చేపట్టనున్నారు. మేఘదాతు ప్రాజెక్టుకు కర్ణాటకు సర్కార్‌ ఏర్పాట్లు చేస్తుండగా.. కర్ణాటక వైఖరిని ఖండిస్తూ ఆందోళనలకు ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో పిలుపునిచ్చారు.

డ్యామ్‌ను కచ్చితంగా నిర్మించి తీరుతామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కర్ణాటక ప్రభుత్వం మొండి వైఖరిని వ్యతిరేకిస్తూ.. అలాగే ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడానికి ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. చెన్నై జిల్లా కలెక్టరేట్ సమీపంలో తన నాయకత్వంలో జరిగే ఈ నిరసనలో పలు రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, సామాజిక సంస్థలు పాల్గొంటాయని వైగో తెలిపారు.

ఈ ప్రాజెక్టు కోసం కర్ణాటక రూ. 5,900 కోట్లు కేటాయించిందని, నిర్మాణ సామగ్రిని కూడా సిద్ధం చేస్తోందని పేర్కొన్న వైగో.. 68 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉన్న ఈ ప్రతిపాదిత డ్యామ్.. సుప్రీంకోర్టు, కావేరీ నీటి నిర్వహణ అథారిటీ ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని ఇటీవల వైగో ఆరోపించారు. ఈ ప్రాజెక్టు వల్ల తమిళనాడు సాగునీటి అవసరాలు తీవ్రంగా దెబ్బతింటాయని.. మెట్టూరు డ్యామ్‌కు నీటి ప్రవాహం తగ్గుతుందని, దీనివల్ల కావేరీ నీటిపై ఆధారపడిన డెల్టా జిల్లాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఆయన హెచ్చరించారు. ఈ నిరసన ఉద్యమానికి రైతులు, వ్యాపారులు, ప్రజా సంక్షేమ సంఘాలు పెద్దఎత్తున మద్దతు తెలపాలని వైగో విజ్ఞప్తి చేశారు.

 


 

Advertisement
 
Advertisement
Advertisement