-
చైన్ దందా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గొలుసుకట్టు దందాలకు అడ్డుకట్ట పడటంలేదు. ఇటీవలి కాలంలో క్యూనెట్, హీరా గ్రూపు ఉదంతాలు వెలుగుచూసినా కొత్త పేర్లు, ఐడియాలతో జనాల జేబుకు చిల్లు పెట్టేందుకు నయా మార్గాల్లో పుట్టుకొస్తూనే ఉన్నాయి. వేగంగా డబ్బు రెట్టింపు చేస్తామని ఆశచూపుతూ మధ్యతరగతి ప్రజల జీవితా లతో ఆటలాడుకుంటున్నాయి. తాజాగా సెర్ఫా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట హైదరాబాద్లో ఓ కొత్త కంపెనీ వెలిసింది. మధ్యతరగతి కుటుంబాలే లక్ష్యంగా వ్యాపారం సాగిస్తోంది. ఏడాదిలో లక్షాధి కారులు కావచ్చని అరచేతిలో స్వర్గం చూపిస్తూ అమాయకుల నుంచి భారీగా దండుకుంటోంది. ఎలా చేస్తున్నారు..? సెర్ఫా కంపెనీలో చేరాలంటే ముందుగా రూ. 18 వేలు కట్టాలి. దానికి సమాన విలువ అని చెబుతూ రెండు 100 గ్రాముల బరువున్న ట్యాబ్లెట్ల డబ్బాలు అంట గడతారు. కట్టిన డబ్బు వృథా కాలేదు అనే భావన కస్టమర్కు కలిగేలా సంతృప్తి పడేలా నూరిపోస్తారు. వాస్తవానికి ఆ ట్యాబ్లెట్ల విలువ మార్కెట్లో రూ. 1,000–2,000కు మించదు. తరువాత వారికి ఒక ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేస్తారు. అంతకుముందే బ్యాంకు, ఆధార్ ఖాతాల వివరాలు తీసుకొని తొలుత ఖాతాలో రూ. 2 వేలు జమచేస్తారు. ఇక అక్కడ నుంచి ఖాతాదారు తరఫున ఎంత మంది చేరితే అన్ని రూ. 1,200 చొప్పున ఖాతాలో జమ చేస్తామని ఆశచూపుతారు. బంధువులు, స్నేహితులను చేర్పించమంటూ మానవ సంబంధాలపై వ్యాపారం నడిపిస్తున్నారు. వారు తమ కంపెనీలో చేరే ప్రతి ఒక్కరినీ పార్ట్నర్ని అని చెబుతుండటం గమనార్హం. ఏడాదిన్నర కంపెనీలో మూడేళ్లుగా పనిచేస్తున్నారట.. వాస్తవానికి ఈ కంపెనీని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) వద్ద 2018 ఏప్రిల్ 26న విశాఖపట్నం కేంద్రంగా రిజిష్ట్రేషన్ చేశారు. అంటే దీని వయసు ఏడాదిన్నరలోపే. కానీ ఇందులో పనిచేసే ఉద్యోగులు మాత్రం తాము 2016 నుంచి ఈ కంపెనీలో చేస్తున్నామని, ఎంటెక్, ఎంబీఏలు చదివి వేల రూపాయల వేతనాలు వదులకొని ఇందులో భాగస్వాములుగా చేరామని గొప్పలు చెబుతున్నారు. ప్రతి వారినీ కంపెనీలో భాగస్వాములంటూ సంబోధించడంతో వెనకా ముందు చూడకుండా పేదలు దిగువ మధ్యతరగతి మహిళలు, నిరుద్యోగులు అప్పు చేసి మరీ పెట్టుబడి పెడుతున్నారు. క్యూనెట్ ప్రెస్మీట్తో ఖాతాదారుల్లో అనుమానాలు.. ఇటీవల క్యూనెట్ మోసాలపై సైబరాబాద్ పోలీసులు పెట్టిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలుసుకుని ఇందులో చేరిన ఖాతాదారులు కొందరు ఆలోచనలో పడ్డారు. ఈ కంపెనీ ప్రతినిధులు ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమ్ కాదని చెబుతున్నా.. అదేబాటలో నడుస్తుండటంతో అనుమానం వచ్చి తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడం మొదలుపెట్టారు. కానీ, వారిని కంపెనీ ప్రతినిధులు దబాయిస్తున్నారు. తమపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని, కోర్టుకు లాగుతామని బెదిరిస్తున్నారు. దీంతో బాధితులు ‘సాక్షి’ని ఆశ్రయించారు. అందరిలాగానే వెళ్లిన సాక్షి ప్రతినిధికి కూడా కంపెనీ ఉద్యోగులు అరచేతిలో స్వర్గం చూపే ప్రయత్నం చేశారు. ఈ తతంగాన్నంతా ‘సాక్షి’ రికార్డు చేసింది. తరువాత దీనిపై వివరణ కోరగా.. తమకు అన్ని అనుమతులు ఉన్నాయని తామెవరినీ మోసం చేయడం లేదని చెప్పుకొచ్చారు. చిక్కుకున్నాక మోసం.. ఈ దందాలే మానవ సంబంధాలు, మాటలే పెట్టుబడులు. మోసంలో చిక్కుకున్నాక.. తమ డబ్బును ఎలాగైనా తిరిగి వసూలు చేసుకోవాలని, బంధువులను, స్నేహితులను ఇందులో చేరుస్తున్నారు. ఫలితంగా మోసం వెలుగుచూసాక.. బంధాలు తెగిపోతున్నాయి. ఇలాంటి బాధితుల్లో అధికంగా సాఫ్ట్వేర్, ఇతర ప్రైవేటు, ఎంటెక్, ఎంబీఏలు చదివిన గ్రాడ్యుయేట్లు కావడం గమనార్హం. డబ్బులిమ్మంటే బెదిరిస్తున్నారు.. మొదట్లో ఇదేదో మామూలు స్కీం అనుకున్నా. అందుకే పొరుగింటావిడ చెప్పిందని చేరాను. మొన్న క్యూనెట్ గురించి వార్తల్లో చదివా. రెండూ ఒకేరకంగా ఉండటంతో కంపెనీ ప్రతినిధులను నిలదీశా. వారు కంపెనీకి అనుమతులు ఉన్నాయన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మాత్రం లీగల్ యాక్షన్ తీసుకుంటామని తిరిగి మమ్మల్నే బెదిరిస్తున్నారు. – తులసి, గృహిణి, కేపీహెచ్బీ కాలనీ పేరేదైనా.. చివరి లక్ష్యం మోసమే..! హైదరాబాద్లో రకరకాల పేర్లతో అక్రమార్కులు జనాల జేబులకు చిల్లు పెడుతున్నారు. అందుకు పోంజి, మల్టీలెవల్ మార్కెటింగ్, హెర్బల్ ఇలా తదితర మార్గాల్లో దందాలు చేస్తున్నారు. అందరి లక్ష్యం ఒకటే.. జనాల నుంచి తక్కువ సమయంలో అందినకాడికి దండుకోవడం. క్యూనెట్: రాష్ట్ర రాజధాని ఇటీవల వెలుగుచూసిన మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం విలువ దాదాపు రూ. 1,000 కోట్లపైనే. ఉద్యోగానికి రాజీనామా చేసిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి రూ. 25 లక్షలు పెట్టుబడి పెట్టి దారుణంగా మోసపోయాడు. తనతోపాటు స్నేహితులు, బంధువులనూ చేర్పించాడు. వారి వద్ద మొహం చెల్లక చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. హీరా: ఇదో రకమైన పోంజి స్కీం. అధిక వడ్డీ ఆశజూపి హైదరాబాద్ కేంద్రంగా సాగిన దందా ఇది. దీని విలువ ఏకంగా రూ. 5,000 కోట్లు. ఈ పథకంలో చేరిన వారిలోనూ అధిక శాతం విద్యావంతులు, గ్రాడ్యుయేట్లే ఉండటం గమనార్హం. ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా ఏ సంస్థా అధిక వడ్డీ చెల్లించదన్న చిన్న పాయింట్ను బాధితులెవరూ గుర్తించకపోవడం కుంభకోణానికి అసలు కారణం. కరక్కాయలు: రోజుకు కిలో కరక్కాయలు దంచిపెడితే రూ. 1,000 ఇస్తామని ఆశచూపి కోట్ల రూపాయలు దండుకున్న విషయం తెలిసిందే. నెల్లూరుకు చెందిన ఓ కేటుగాడు ప్రారంభించిన ఈ దందాలో చిక్కి 650 మంది మహిళలు దాదాపు రూ.8.3 కోట్ల వరకు పోగొట్టుకున్నారు. -
‘కాయ’..రాజా..కాయ్!
సాక్షి, సిటీబ్యూరో: తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బులు ఇస్తామని ఎరవేస్తూ మోసగాళ్లు రూ.కోట్లు దండుకుంటున్నారు. ఇటీవల సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో భారీ మోసాలు వెలుగులోకి వచ్చాయి. మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాల్లో ‘కాయ’ బాగా పాపులర్ అయ్యింది. గత ఏడాది సైబరాబాద్ పరిధిలో చోటు చేసుకున్న కరక్కాయ, మునక్కాయల కేసులు విచారణలో ఉండగానే...తాజాగా రాచకొండ పోలీసులు ‘పల్లీ కాయల’ మోసం గుట్టురట్టుకావడం జనం బలహీనత, అత్యాశకు అద్దం పడుతోంది. ఈ మూడు మోసాల విధానం ‘ఆరోగ్య’దాయకంగా ఉండటంతో పాటు అనతికాలంలోనే లక్షాధికారులు కావొచ్చనే ఆయా కంపెనీల మాటలు నమ్మి వేల మంది వందల కోట్లు సమర్పించుకున్నారు. కరక్కాయ మోసమిలా... నెల్లూరు జిల్లా అంబలపురానికి చెందిన ముప్పల శివ మరో ఇద్దరితో కలిసి కేపీహెచ్బీలో సాఫ్ట్ ఇంటిగ్రేటెడ్ మల్టీటూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో గతేడాది జూన్లో కార్యాలయాన్ని ప్రారంభించాడు. అయుర్వేదిక మందుల్లో ఉపయోగపడే కరక్కాయలపై పెట్టుబడులు పెట్టి భారీ లాభాలు పొందొచ్చంటూ దినపత్రికలు, సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు ఇచ్చారు. కిలో కరక్కాయలను రూ.వెయ్యికి కొనుగోలు చేసి 15 రోజుల్లో పొడి చేసి తిరిగి ఇస్తే ఆ వెయ్యితో పాటు అదనంగా రూ.300, మొత్తం రూ.1300లు ఇస్తామంటూ నమ్మించారు. దీన్ని నమ్మిన 650 మంది తమ తోటి బంధువులు, మిత్రులు, సుపరిచితులను ఈ స్కీమ్లో చేర్పించడంతో రూ.తొమ్మిది కోట్లు పెట్టుబడులు వచ్చాయి. తొలినాళ్లలో కస్టమర్లకు చెల్లించినా వీరు ఆ తర్వాత బిచాణా ఎత్తేయడంతో మోసం వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతున్న ఈ కేసులో బాధితులకు డబ్బులు అందలేదు. మునక్కాయతో ముంచారిలా... ఏడో తరగతి వరకు చదివిన హర్యాణా వాసి రాధేశ్యామ్ మరో ఇద్దరితో కలిసి 2015లో ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్ గ్లోబల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్ఎంఎల్సీ)ను హిస్సార్లో ప్రారంభించారు. ముఖ్యంగా ఆరోగ్యకర ఉత్పత్తులైన మునక్కాయ పొడి ప్యాక్ చేసిన డబ్బాలతో ఈ గొలుసు దందా సాగించారు. రూ.7,500లు చెల్లించి మీరు సభ్యుడిగా చేరితే రూ.2,500 ఫీజు మినహయించి మిగిలిన రూ.ఐదు వేలకు మునక్కాయ పొడి ఉత్పత్తులు ఇస్తారు. మీరు మరో ఇద్దరిని చేర్పిస్తే నెలకు రూ.500ల బోనస్తో పాటు నెలకు రూ.2,500 సంపాదించుకోవచ్చంటారు. ఎక్కువ సభ్యులను చేర్పించిన వారికి టైటిల్తో పాటు భారీగా ప్రైజ్మనీ కూడా ఇచ్చేవారు...ఇలా అమాయకుల నుంచి దాదాపు రూ.మూడువేల కోట్ల వరకు మోసం చేసిన వీరిని గతేడాది సెప్టెంబర్ 8న గుర్గావ్లో అరెస్టు చేశారు. తక్కువ ధరకే మునక్కాయలు కొనుగోలు చేసి పొడిచేసి కస్టమర్లను మోసగించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాలో బాధితులను గుర్తించినా ఇప్పటివరకు న్యాయస్థానం ద్వారా పోలీసు అధికారులు ఫ్రీజ్ చేసిన బ్యాంక్ ఖాతాల్లోని రూ.200 కోట్లను చెల్లించలేకపోయారు. ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ‘పల్లీ కాయ’తో పల్టీ కొట్టించాడు... ఇంటర్మీడియెట్ వరకే చదువు ఆపేసిన నిజామాద్ జిల్లా మోర్తాండ్ మండలం సంకేట్ గ్రామానికి చెందిన జిన్న కాంతయ్య అలియాస్ జిన్న శ్రీకాంత్రెడ్డి అగర్బత్తుల వ్యాపారంతో మోసాలు మొదలెట్టి 2017 డిసెంబర్ నుంచి గ్రీన్గోల్డ్ బయోటెక్ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించాడు. సూరత్ నుంచి రూ.20 వేలకు కొనుగోలు చేసి తీసుకువచ్చిన పల్లీనూనె యంత్రాలతో రూ.లక్షల్లో ఆదాయం వస్తుందంటూ ప్రచారానికి తెరలేపాడు. ఇంట్లోనే ఉండి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు సంపాదించవచ్చంటూ ఆశచూపాడు. ఈ గొలుసు కట్టు పథకంలో భాగంగా రూ.లక్ష ఇచ్చి పల్లీనూనె యంత్రాన్ని కొనుగోలు చేస్తే 40 కిలోల పల్లీనూనె, 200 కిలోల పల్లీలు ఇస్తామంటూ చెబుతాడు. ఈ రకంగా పల్లీలను నూనెగా మార్చి ఇస్తే నెలకు రూ.పది వేలతో పాటు రూ.ఐదు వేల అలవెన్స్ 24 నెలల పాటు ఇస్తానంటూ మభ్యపెడతాడు. ఒకవేళ రూ.రెండు లక్షల మెషీన్ కొనుగోలు చేస్తే 80 కిలోల నూనె, 400 కిలోల పల్లీలు ఇచ్చి, ఆ పల్లీలను నూనెగా మార్చి ఇస్తే నెలకు రూ.20 వేలతో పాటు అలవెన్స్ కింద రూ.పది వేలు రెండేళ్ల పాటు చెల్లిస్తామంటాడు. అగ్రిమెంట్ సమయంలో ప్రజలను నమ్మించేందుకు పిన్ నంబర్లు కూడా కేటాయిస్తాడు. అలాగే కస్టమర్ల దగ్గరి నుంచి రెండు నెలల పాటు తీసుకున్న ఆయిల్ను మళ్లీ ఇతర కస్టమర్లకు ప్యాకేజీ కింద ఇస్తుంటాడు. తొలుత చేరిన వ్యక్తి మరో ఇద్దరిని చేర్పిస్తే కమిషన్ రూపంలో డబ్బులు ఇస్తామని ఆశచూపాడు. మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో ఏజెంట్లను నియమించుకుని తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో వంద కోట్ల వరకు మోసం చేశాడు. ఈ విషయం సీపీ మహేష్ భగవత్ దృష్టికి రావడంతో రంగంలోకి దిగిన ఉప్పల్ పోలీసులు నిందితుడు కాంతయ్యతో పాటు మరో ఇద్దరిని గత నెల 29న అరెస్టు చేశారు. చేరినా...చేర్పించినా నేరమే సులభ పద్ధతిలో ఆదాయం వస్తుందని గొలుసు కట్టు పథకంలో పెట్టుబడులు పెట్టినా, ఇతరులతో పెట్టుబడులు పెట్టించినా అది నేరమవుతుంది. 1978, ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ బ్యానింగ్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకోవచ్చూ అంటే వచ్చే ప్రకటనలు నమ్మకండి. చాలా మంది పోయింది కొంతమొత్తం కాబట్టి ఠాణాకు వెళ్లాలంటే ఆలోచిస్తున్నారు. ఇవే మోసగాళ్లకు కోట్లు తెచ్చిపెడుతున్నాయి. సులభంగా డబ్బులు సంపాదించవచ్చనే ప్రకటన మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలి. –వీసీ సజ్జనార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ అప్రమత్తతతోనే మోసాలకు అడ్డుకట్ట చిన్న మొత్తాలతో భారీగా డబ్బులు సంపాదించవచ్చనే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరెన్నీ చెప్పినా నెలల్లోనే లక్షాధికారులు కావొచ్చనే కల్లబొల్లి మాటలు నమ్మకండి. సులభ పద్ధతిన డబ్బులు వస్తున్నాయంటే అది మోసమే అవుతుంది. కరక్కాయ, మునక్కాయ, పల్లీ కాయలతో ఎంఎల్ఎం మోసాలతో కోట్లు దండుకున్నారు. ఈ గొలుసు కట్టు పథకాలతో జరజాగ్రత్తగా ఉండాలి. మీ దృష్టికి వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. –మహేష్ భగవత్, రాచకొండ సీపీ -
గ్రీన్ గోల్డ్ బయోటెక్ సంస్థ ఎండీ శ్రీకాంత్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: వేరుశనగ గింజల నుంచి నూనె తీసే యంత్రాలు ఇస్తామని నమ్మించి వేలాది మంది నుంచి కోట్ల రూపాయాలు వసూలు చేసిన గ్రీన్గోల్డ్ బయోటెక్ సంస్థ ఎండీ శ్రీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో కూడా కాంత్పై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రూ.లక్ష రూపాయలు చెల్లిస్తే పల్లీల నుంచి నూనే తీసే యంత్రం ఇస్తామని దాంతో నెలకు పదివేలు సంపాదించవచ్చని ఆశ చూశారు. ఏజెంట్ల ద్వారా వీటికి ప్రచారం కల్పించి వేలాది మందిని మోసం చేశారు. ఈ మోసంపై ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఈ గుట్టు వెలుగులోకి వచ్చింది. తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో కూడా మోసాలకు పాల్పడినట్లు సమాచారం. ఈ స్కాంలో దాదాపు ఆరు వేలకు పైగా బాధితులు ఉన్నట్లు సమాచారం. -
‘కరక్కాయ’ను పట్టించుకోరా..?
సాక్షి, సిటీబ్యూరో: కరక్కాయల పొడి పేరుతో జరిగిన చీటింగ్ కేసును ఛేదించిన సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు బాధితులకు న్యాయం చేయడంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. నిందితులను అరెస్టు చేసిన సమయంలో 81 టన్నుల కరక్కాయలు నిల్వచేసిన కేపీహెచ్బీలోని గోదాంను సీజ్ చేసిన పోలీసులు ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడటం లేదు. నెల్లూరు జిల్లా, అంబపురంకు చెందిన ముప్పల మల్లికార్జునతో పాటు దేవ్రాజ్ అనిల్కుమార్, జగన్మోహనరావు, గుండపనేని సురేంద్ర, చిరంజీవి రెడ్డిలను గత నెల 4న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారి నుంచి స్వాధీనం చేసుకున్న రూ.40,95,000 నగదును కోర్టులో డిపాజిట్ చేశారు. ఈ సమయంలో కరక్కాయల విషయమై కోర్టు దృష్టికి తీసుకెళ్లగా వేలం వేసి వచ్చిన డబ్బులను కోర్టులో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అయినా ఇప్పటివరకు ఆ దిశగా సైబరాబాద్ పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కరక్కాయలు కొద్దిరోజుల పాటే నిల్వ ఉంటాయని, ఇప్పటికైనా వాటిని వేలం వేసి వచ్చిన మొత్తాన్ని బాధితులకు పంచాలని కోరుతున్నారు. మా డబ్బులు ఇప్పించండి... కరక్కాయల పొడి వ్యాపారం ప్రారంభంలో పెట్టుబడులు పెట్టిన వారికి రూ.1,000లకు రూ.300 కలిసి రూ.1300లు చెల్లించారు. దీంతో కొందరు ఏకంగా రూ.90 లక్షలు పెట్టుబడి పెట్టగా, మరో రూ.30 లక్షలు కలిసి రూ.1.20 కోట్లు చెల్లించారు. దీంతో అతను రెండోసారి రూ.60లక్షలు పెట్టుబడి పెట్టాడు. మిగతావారు కూడా తొలిసారి డబ్బులు తిరిగి ఇవ్వడంతో నమ్మకం పెరిగి లబ్దిదారులు మరికొంత మందిని చేర్చారు. కొందరు తమ బంధువులను సైతం ఈ ఊబిలోకి లాగారు. చివరకు తమ కంపెనీలో పనిచేసే సిబ్బందితో కూడా పెట్టుబడులు పెట్టించారు. ఇలా 650 మంది మోసపోయారు. వీరిలో 500 మంది మహిళలు కావడం గమనార్హం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వేదిక ఈ మోసం జరిగింది. మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీల్లో పనిచేసిన అనుభవంతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్న నిర్వాహకులకు నెల్లూరుకు చెందిన గుండపనేని సురేంద్ర, తిన్నలూరు మహే శ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు నోటి చిరంజీవి రెడ్డి సహకరించారు. అయితే తమ డబ్బులు ఇవ్వడం లేదని నలుగురు వ్యక్తులు కేపీహెచ్బీ ఠాణాలో ఫిర్యాదు చేసినట్లు తెలియడంతో వీరు పరారయ్యారు. మహారాష్ట్ర, కర్ణాటక, పాండిచ్చేరి, ఢిల్లీ రాష్ట్రాల్లో వీరికోసం గాలించిన పోలీసులు చివరకు కేపీహెచ్బీ ఠాణాలోని రాఘువేంద్రకాలనీలో ఆగస్టు 4న ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. వారు దొరికి తే మరికొంత నగదు స్వాధీనమయ్యే అవకాశముందని పోలీసులు చెబుతున్నా ఇంతవరకు పట్టుకోలేకపోయారు. అయితే స్వాధీనం చేసుకున్న డబ్బులతో పాటు కరక్కాయలు అమ్మగా వచ్చిన డబ్బులను వెంటనే కోర్టు ద్వారా ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. -
కాపురాల్లో ‘కరక్కాయ’
సాక్షి, సిటీబ్యూరో: ‘ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చేస్తుందంటూ ప్రకటనను చూసి ఆకర్షితురాలైన కేపీహెచ్బీకి చెందిన అరుణ జీవితం నిజంగానే మారిపోయింది. అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చుననే ఆశపడిన ఆమెకు ‘కరక్కాయల పొడి’ రూపంలో డబ్బు పోవడమే కాకుండా ఆమె కుటుంబంలో కలతలు రేపింది. రూ. వెయ్యితో కిలో కరక్కాయలు కొనుగోలు చేసి పొడి చేసి ఇస్తే రూ.1300 వస్తున్నట్లు తెలియడంతో ఈ విషయాన్ని బంధువులకు చెప్పింది. దీంతో దాదాపు 12 మంది అరుణ మాటలు విని కరక్కాయల పొడిలో పెట్టుబడి పెట్టారు. చివరకు సదరు కంపెనీ బిచాణా ఎత్తివేయడంతో డబ్బులు పోయిన బెంగలో ఉన్న ఆమెను బంధువుల మాటలు మరింత నొప్పించాయి. నీ కారణంగానే పెట్టుబడులు పెట్టామంటూ వారు గొడవకు దిగడంతో అరుణ, ఆమె భర్త మధ్య ఘర్షణకు దారి తీసింది. అరుణ ఒక్కరే కాదు..కరక్కాయల పొడి కేసులో మోసపోయిన దాదాపు 500 మంది మహిళల్లో 150 మంది మహిళల పరిస్థితి ఇదే. అయినవాళ్లే కదా వారూ లాభపడతారన్న ఉద్దేశంతో వీరు చెప్పిన మాటలు ఇప్పుడూ ఏకంగా వారిని బాధిస్తున్నాయి. ఓ వైపు డబ్బులు పోగా..మరోవైపు బంధువుల మాటలతో ఆవేదనకు లోనైన పలువురు మహిళలు సైబరాబాద్ పోలీసులను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. కేపీహెచ్బీలో సాఫ్ట్ ఇంటిగ్రేట్ మల్టీటూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఐఎంటీ) పేరుతో కార్యాలయాన్ని ప్రారంభించి పలు కంపెనీలు ఆయుర్వేద మందుల్లో కరక్కాయల పొడిని వినియోగిస్తారని ప్రచారం చేశారు. బేగంపేటలో కిలోకు కేవలం రూ.38కి కొనుగోలు చేసిన కరక్కాయలను ఏకంగా రూ.వెయ్యికి అమ్మి పౌడర్గా చేసి తిరిగిస్తే రూ.1300 ఇస్తామంటూ 650 మందిని మోసగించిన నెల్లూరు జిల్లా అంబపురంకు చెందిన ముప్పల మల్లికార్జున ముఠాను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంతో తమ డబ్బులు వస్తాయన్న ఆశతో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్కు బాధితులు క్యూ కడుతున్నారు. ఈ ఘటన నుంచైనా ప్రజలు మారాలని పోలీసులు కోరుతున్నారు. విద్యావంతులు సైతం ఈ మోసంలో చిక్కుకోవడం దారుణమని డబ్బుపై ఉన్న ఆశను వెల్లడిస్తోందని, దీనినే నేరగాళ్లు ఆసరాగా చేసుకొని టోపీ పెడుతున్నారని వారు పేర్కొంటున్నారు. సులువుగా డబ్బులు రావు... డబ్బులు సులభంగా సంపాదించేందుకు షార్ట్కట్ మార్గాలు ఉండవు. ఎవరైనా ఇలాంటి ప్రకటనలు ఇస్తే స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలి. మల్టీలెవల్ మార్కెటింగ్ వ్యాపారంలో చాలా మంది మహిళలే బాధితులుగా ఉంటున్నారు. బంధువులను కూడా ఆయా స్కీమ్ల్లో చేర్పిస్తున్నందున కుంటుంబాల మధ్య సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. ఎంఎల్ఎం కంపెనీలు, పొంజి స్కీమ్లు, చిట్స్, డిపాజిట్ కంపెనీలు నమ్మశక్యం కాని ఆఫర్లు ఇస్తే పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా వాటిని ఆదిలోనే అరికట్టవచ్చు. – వీసీ సజ్జనార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement