breaking news
granite quarry
-
గుండెలు చెది‘రాయి’ గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం
బల్లికురవ/నరసరావుపేట టౌన్/సాక్షి, అమరావతి: గ్రానైట్ క్వారీలో రాయి తీస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. రాయి మీద పడి ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన బాపట్ల జిల్లా బల్లికురవ మండలం ఈర్లకొండ వద్ద ఉన్న సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో ఆదివారం జరిగింది. ఈ ఘటనలో ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చి పనిచేస్తున్న నలుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయాలపాలయ్యారు. వీరిలో ఇద్దరు నరసరావుపేట వైద్యశాలకు తరలిస్తుండగా మృతిచెందారు.పోలీసుల కథనం ప్రకారం.. బల్లికురవ సమీపంలోని ఈర్లకొండ వద్ద సత్యకృష్ణ గ్రానైట్ క్వారీ ఉంది. ఈ క్వారీలో ముడి రాయిని తీసి ఎగుమతి చేస్తుంటారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం సుమారు 10.30 గంటల సమయంలో క్వారీలో రాయి తీసేందుకు తొమ్మిది మంది కూలీలు జాకీలతో పనిచేస్తున్నారు. ఉన్నట్టుండి తీసే రాయికి పై భాగంలో ఉన్న రాయి దొర్లి కార్మికుల మీద పడింది. దీంతో ఒడిశా రాష్ట్రానికి చెందిన టుకున దలాయ్ (37), బనమల చెహ్రు (30), భాస్కర్ బిషోయ్ (40), సంతోస్ గౌడ్ (36) అక్కడికక్కడే మృతిచెందారు. ఎం.సుదర్శన్, కె.నాయక్, శివాగౌడ, దండా బడత్యా (48), ముస్సా జనా (43) తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని నరసరావుపేట వైద్యశాలకు తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో దండా బడత్యా, ముస్సా జనా మృతిచెందారు. మిగిలిన ముగ్గురు నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, మైనింగ్ డీడీ రాజశేఖర్, ఏడీ రామచంద్ర పరిశీలించారు. ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం నాలుగు మృతదేహాలను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు, రెండు మృతదేహాలు నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. వీఆర్వో అశోక్ ఫిర్యాదు మేరకు బల్లికురవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల సంఖ్యపై అనుమానాలు? క్వారీలో ప్రమాదం జరిగిన సమయంలో ఆరు జాకీలతో జాకీకి ముగ్గురు వంతున డ్రిల్లింగ్ పనులు చేస్తున్నట్లు సమాచారం. కానీ అధికారులు మాత్రం అక్కడ పనిచేస్తున్నది తొమ్మిది మంది మాత్రమేనని, అందులో ఆరుగురు మృతిచెందారని ప్రకటిస్తున్న నేపథ్యంలో మిగిలిన కార్మికులు ఏమయ్యారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మృతుల సంఖ్య విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై విచారణకు సీఎం ఆదేశం క్వారీ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ప్రమాదంపై బాపట్ల జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. న్యాయ విచారణ చేయాలి: సీపీఎం ప్రమాదంపై సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్ర ది్రగ్భాంతి వ్యక్తం చేసింది. మృతులకు సంతాపం వ్యక్తం చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. ప్రమాదానికి గల కారణాలపై న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని, గాయపడిన వారికి సరైన వైద్యంతోపాటు రూ.10 లక్షల సహాయం అందించాలని కోరారు. క్వారీలో సరైన భద్రతా చర్యలు చేపట్టని యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ క్వారీ నిర్వహణకు ప్రభుత్వం అనుమతి లేదన్న వార్తలు మరింత ఆందోళన కల్గిస్తున్నాయన్నారు.మృతుల కుటుంబాలకు రూ.14 లక్షల చొప్పున పరిహారం గ్రానైట్ క్వారీ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నట్టు బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి చెప్పారు. క్వారీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగినప్పుడు క్వారీలో మొత్తం 16 మంది ఒడిశా రాష్ట్ర కూలీలు పనిచేస్తున్నారని తెలిపారు.వర్షం పడడం వల్ల ప్రమాదం జరిగిందని వివరించారు. నలుగురు అక్కడికక్కడే మరణించగా, ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృత్యువాత పడ్డారని, ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారని కలెక్టర్ వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.14లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.పదిలక్షల చొప్పున పరిహారం క్వారీ యాజమాన్యం నుంచి ఇప్పిస్తామని వెల్లడించారు. స్వల్పంగా గాయపడిన వారికీ ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున క్వారీ నిర్వాహకుల నుంచి ఆర్థిక సాయం అందేలా చూస్తామన్నారు. ఘటనపై విచారణకు మైనింగ్ శాఖను ఆదేశించినట్టు వెల్లడించారు. మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు అన్ని ఖర్చులూ ప్రభుత్వమే భరించనున్నట్టు వివరించారు. -
గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం.. ఆరుగురు కార్మికులు మృతి
-
గ్రానైట్ క్వారీ ప్రమాదంపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని గ్రానైట్ క్వారీ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.గ్రానైట్ క్వారీ అంచు విరిగిపడి ఒడిశాకు చెందిన కార్మికులు,పొట్టకూటి కోసం వచ్చి మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బల్లికురవ మండలంలోని ఓ గ్రానైట్ క్వారీలో ఆదివారం దయం బండరాయి జారి పడటంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 16 మంది గాయపడ్డారు. మృతులను ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
ఉపాధి పనులు కుది‘రాయి’!
నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లాలో భారీగా నిర్వహిస్తున్న గ్రానైట్ క్వారీలతో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. పలు మండలాల్లో గ్రానైట్ క్వారీ పరిశ్రమలు కొనసాగుతున్నాయి. 40 ఏళ్లుగా అంతర్జాతీయంగా పేరుగాంచిన మెడివెస్ట్ గ్రానైట్, గాయత్రి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్.. జిల్లాలోని ఇనుగుర్తి మండలం చిన్ననాగారం, మీఠ్యతండా, కేసముద్రం మండలం తీగలవేణి, అర్పపల్లి గ్రామాల్లో క్వారీలను నిర్వహిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల్లో విస్తరించిన 50 గ్రానైట్ క్వారీ పరిశ్రమల్లో.. ఎంతో మందికి ఉపాధి దొరుకుతోంది. మేనేజర్ నుంచి వాచ్మన్ వరకు స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాలు ఒడిశా, అస్సాం, బిహార్ రాష్ట్రాల నుంచి వేలాది మంది ఉద్యోగులు, కార్మికులకు ఉపాధి దొరుకుతోంది. జిల్లాలో ఖరీదైన గ్రానైట్ మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగారం, కేసముద్రం మండలం అర్పనపల్లి, తీగలవేణి, కేసముద్రం, నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెం గ్రామ పరిధిలో నిర్వహిస్తున్న క్వారీల నుంచి తీస్తున్న బ్లాక్ గ్రానైట్ సిరులు కురిపిస్తోంది. ఇది ఖరీదైన గ్రానైట్గా పేరొందింది. ఈ గ్రానైట్ను హైదరాబాద్ నుంచి విదేశాలకు తరలిస్తున్నారు. కాగా రాజ్యసభ సభ్యుడు, గాయత్రి గ్రానైట్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ వద్దిరాజు రవిచంద్ర కూడా దేశ, విదేశాలకు నల్ల గ్రానైట్ను ఎగుమతి చేస్తున్నారు. యంత్రాల విడిభాగాలతో ఉపాధి భూగర్భం నుంచి గ్రానైట్ ఖనిజ సంపద తీయడానికి ఉపయోగించే యంత్రాల విడిభాగాలను సరఫరా చేస్తూ కూడా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. గ్రానైట్ బండలను లారీల ద్వారా హైదరాబాద్కు తరలిస్తారు. అక్కడ పెద్ద పెద్ద యంత్రాలతో టైల్స్గా కట్ చేయడం, పాలిష్ చేసి విదేశాలకు సరఫరా చేయడం వరకు అంతా ఉపాధి లభిస్తుంది. గ్రానైట్ క్వారీల పరిధిలోని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. పదేళ్లుగా గ్రానైట్ క్వారీలోనే.. పదేళ్లుగా ఇనుగుర్తి మండలం మీఠ్యతండా గ్రానైట్ క్వారీలోనే ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నా. క్వారీ ద్వారా ఉపాధితోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. క్వారీ ద్వారా ఎంతోమంది ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. గ్రానైట్ క్వారీలు నిర్వహించడానికి నిర్వాహకులు ఎంతో శ్రమించాలి. – గుండాల శోభన్, చిన్ననాగారం సూపర్వైజర్గా పనిచేస్తున్నా ఒక క్వారీలో సూపర్వైజర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. క్వారీల్లో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి క్వారీలో ఉపాధి కల్పిస్తున్నారు. మా పరిధిలో 30 ఏళ్లుగా గ్రానైట్ క్వారీలను నడుపుతున్నారు. – గుగులోత్ రాజేందర్, ఇనుగుర్తి మండలం మీఠ్యతండాఉమ్మడి వరంగల్ జిల్లా గ్రానైట్ నాణ్యమైనదిపాతికేళ్లుగా గ్రానైట్ ఫీల్డ్లోనే సూపర్వైజర్గా పనిచేస్తున్నా. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లభించే గ్రానైట్ నాణ్యతలో దేశంలోనే ప్రథమస్థానంలో ఉంది. జిల్లాలో తీసే గ్రానైట్ సంపదకు భలే డిమాండ్ ఉంది. – రావులపల్లి రవికుమార్, సూపర్వైజర్, మెడివెస్ట్ గ్రానైట్, కేసముద్రం -
రాళ్ల మధ్య ఇరుక్కుని ఇద్దరు మృతి
-
అక్రమ గని!
– అనుమతి ఒకచోట, తవ్వేది మరొక చోట – చిల్లబండలో టీడీపీ నేత గ్రానైట్ దందా – బోగస్ ఎన్ఓసీ పత్రమిచ్చిన రెవెన్యూ అధికారులు కోడుమూరు: కోడుమూరు మండలంలోని చిల్లబండ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నేత గ్రానైట్ దందాను నడుపుతున్నాడు. కోడుమూరు రెవెన్యూ అధికారులతో తప్పుడు ఎన్ఓసీ పత్రాలు(నో–అబ్జెక్షన్ ) తీసుకుని భారీ ఎత్తున గ్రానైట్ తవ్వకాలు సాగిస్తున్నాడు. పేలుళ్ల దాటికి సమీపంలోని ఇళ్లపైకి, జనం మీదుకు రాళ్లు పడుతున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. చిల్లబండ గ్రామం పక్కనే ఉన్న గ్రామనత్తం స్థలంలో అక్రమ గ్రానైట్ క్వారీ నడుస్తోంది. పెద్దపెద్ద జేసీబీలతో దాదాపు 100 అడుగుల లోతు వరకు గోతులు తవ్వారు. 15 నుంచి 20 అడుగుల వరకు పొడవు, వెడల్పు ఉన్న గ్రానైట్ రాళ్లను కట్ చేసి తాడిపత్రికి తరలిస్తున్నట్లు తెలిసింది. గ్రానైట్ రాళ్లను తీసేందుకు రాత్రిపూట బ్లాస్టింగ్ చేస్తున్నట్లు సర్పంచ్ మోహన్కాంత్రెడ్డి ఏప్రిల్ 30వ తేదీన తహసీల్దార్ నిత్యానందరాజుకు ఫిర్యాదు చేశారు.అయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. దందాకు ‘నో అబె్జక్షన్’ సోమశేఖర్ యాదవ్ అనే వ్యక్తి చిల్లబండ గ్రామంలోని 176 సర్వేనంబర్లో మైనింగ్ చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు ఎన్ఓసీ పత్రం ఇచ్చారు. అయితే ఈ సర్వేనంబర్ రెవెన్యూ రికార్డుల్లో సబ్డివిజన్ అయ్యింది. సర్వేనంబర్ 176–ఏలో 3.88 ఎకరాలు, 176–బీలో 3.30 ఎకరాల భూమి ఉన్నట్లు రెవెన్యూ రికార్డులో ఉంది. మొత్తం 6.69 ఎకరాల భూమిని కొందరు రైతులు సాగుచేసుకుంటున్నారు. ఇదే సర్వేనంబర్లో సోమశేఖర్యాదవ్కు మైనింగ్ చేసుకుని గ్రానైట్ రాళ్లను తవ్వుకునేందుకు రెవెన్యూ అధికారులు ఎన్ఓసీ మంజూరు చేశారు. వాస్తవంగా 239 సర్వేనంబర్లో గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నాయి. గ్రామానికి అతిసమీపంలో గ్రానైట్ తవ్వుకునేందుకు అనుమతులివ్వడం ఇబ్బందవుతుందన్న కారణాలతోనే రెవెన్యూ అధికారులు బోగస్ సర్వేనంబర్ల ఆధారంగా అతడికి నో–అబ్జెక్షన్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు తెలిసింది. రాత్రిపూట పేలుళ్లు : చిల్లబండ గ్రామం అతిసమీపంలోనే పేలుడు పదార్థాలతో తయారుచేసిన జిలెటిన్ స్టిక్స్ అమర్చి భారీఎత్తున రాత్రిపూట రాళ్లను పగులగొడుతున్నారు. పేలుళ్ల దాటికి ఇళ్లపైకి, జనంమీదుకు రాళ్లు పడుతున్నాయి. పేలుళ్ల శబ్ధానికి ఇళ్లు పగుల్లిస్తున్నాయి. ఎదురు తిరిగిన జనంపై గ్రానైట్ యజమాని తన అనుచరులచేత దాడులు చేయిస్తున్నాడని సర్పంచ్ మోహన్కాంతారెడ్డి ఆరోపించారు. రాత్రిపూట రవాణా : చిల్లబండ గ్రామంలోని క్వారీ ద్వారా తీసిన గ్రానైట్ రాళ్లను పెద్ద లారీల్లో తాడిపత్రికి రాత్రిపూట తరలిస్తున్నాడు. రాయల్టీ పత్రాలు సక్రమంగా ఉంటే రాత్రిపూట ఎందుకు తరలిస్తున్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో తవ్వకాలు జరగని గ్రానైట్ క్వారీలకు సంబంధించి రాయల్టీ పత్రాలు తీసుకుని చిల్లబండ క్వారీ రాళ్లను తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడేళ్లుగా సాగిస్తున్న ఈ దందాతో కోట్లాది రూపాయలు వెనకేసుకున్నట్లు సమాచారం. ఆ సర్వేనంబర్ రెవెన్యూ రికార్డుల్లో లేదు : నిత్యానందరాజు, తహశీల్దార్ చిల్లబండ గ్రామంలో మైనింగ్ చేసుకునేందుకు 176 సర్వేనంబర్ ఆధారంగా గతంలో పనిచేసిన అధికారులు ఎన్ఓసీ ఇచ్చారు. రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే ఆ సర్వేనంబర్ సబ్డివిజన్ అయ్యింది. 6.69 ఎకరాల విస్తీర్ణంలో 176/ఎ, 176/బి సర్వేనంబర్లలో రైతులు ఆ పొలాన్ని సాగుచేసుకుంటున్నారు. -
బోడికొండపై గిరిజనాగ్రహం
- లేదు లేదంటూనే.. తవ్వకాలకు అనుమతివ్వడంపై మండిపాటు - ఇక్కడి తవ్వకాల వల్ల 20 గ్రామాల గిరిజనులు కోల్పోనున్న ఉపాధి - తక్షణమే దానిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలని ప్రజా సంఘాల డిమాండ్ - టేకులోవలో సమావేశమై పలు తీర్మానాలు - 20న ఐటీడీఏ వద్ద ధర్నాకు పిలుపు పార్వతీపురం/పార్వతీపురం రూరల్ (విజయనగరం) : బోడికొండపై గ్రానైట్ తవ్వకాలకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో గిరిజనుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. దశలవారీగా తాము పోరాడి ఇప్పటికే దానిని అడ్డుకుంటుంటే.. తమకు అనుకూలంగా హామీనిచ్చి, రహస్యంగా తవ్వకాలకు అనుమతివ్వడంపై వారంతా ఆగ్రహోదగ్రులవుతున్నారు. ఈ నెల ఎనిమిదో తేదీన తవ్వకాలకు భూమి పూజ చేసిన విషయం తెలుసుకుని ప్రజా సంఘాల నాయకులు ఉద్యమానికి సమాయత్తమవుతున్నారు. ఈ మేరకు వారంతా టేకులోవలో శనివారం సమావేశమై ఈ నెల 20వ తేదీన ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. అసలేమైందంటే.. పార్వతీపురం మండలం బుదురువాడ పంచాయతీ పరిధిలోని బోడికొండ గ్రానైట్ క్వారీని పోకార్నో కంపెనీకి ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. దీనిని చుట్టుపక్కల సమీప గ్రామాలకు చెందిన ఆదివాసీలు వ్యతిరేకించారు. గత సంవత్సరం జూలై 29, 30 తేదీల్లో జిల్లాలోని డీకే పట్నంలో జిల్లా అధికారులు నిర్వహించ తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణను కూడా అడ్డుకున్నారు. అంతేగాకుండా పలుమార్లు ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఆ సందర్భంలో అధికారులు గిరిజనుల సమ్మతి లేకుండా లీజుకు ఇచ్చేది లేదని తేల్చిచెప్పడంతో వారు తాత్కాలికంగా ఆందోళన విరమించారు. ఇంతలోనే ఈ నెల ఎనిమిదో తేదీన పోకార్నో కంపెనీ ఆ కొండవద్ద భూమి పూజ చేసి లాంఛనంగా తన కార్యకలాపాలను ప్రారంభించడంతో బుదురువాడ, అనసభద్ర, గోచెక్క పంచాయతీలకు చెందిన 20 గ్రామాల ఆదివాసీలు మళ్లీ ఉద్యమానికి సమాయత్తమయ్యారు. వారికి మద్దతుగా ప్రజాసంఘాల నాయకులు టేకులోవలో సమావేశమై తాము అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఐక్యంగా పోరాడుదాం... సమావేశంలో పాల్గొన్న అఖిల భారత రైతుకూలీ సంఘం నాయకురాలు పి.రమణి, రైతుకూలీ సంఘం నాయకులు ఊయక ముత్యాలు తదితరులు మాట్లాడుతూ... గతంలో ఆదివాసీలు ఆందోళన చేపట్టినపుడు అధికారులు బోడికొండను లీజుకి ఇవ్వమని హామీ ఇచ్చి, ఇప్పుడు మాట తప్పారని ఆరోపించారు. దీనిపై ఆదివాసీలంతా ఐకమత్యంగా పోరాడాలని, ఆదివాసీల పోరాటానికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బోడికొండపై ఇచ్చిన లీజును రద్దు చేసేంతవరకు ఉద్యమిస్తామని ప్రకటించారు. ఈ నెల 20వ తేదీన ఐటీడీఏ కార్యాలయం ఎదుట చేపట్టబోయే ధర్నాకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జన్ని ముత్యాలు, కె.రామస్వామి(ఏపీ గిరిజన సంఘం), టి.సాయి (గిరిజన సంక్షేమసంఘం), వెలగాడ కృష్ణ (ఏఎల్కెఎంఎస్ జిల్లా అధ్యక్షుడు), ఎం. భాస్కరరావు (ఏపీ రైతుకూలీసంఘం), రెడ్డి శ్రీరామమూర్తి(వ్యవసాయ కార్మిక సంఘం), పి.రంజిత్కుమార్ (గిరిజన సంక్షేమసంఘం), మేస్త్రి పూర్ణచంద్రరావు, పి.మల్లిక్(అఖిల భారత రైతుకూలీ సంఘం) తదితరులతో పాటు ఆదివాసీ గ్రామాల ప్రతినిధులు సీదరపు ఎర్రప్ప(బుదురువాడ ఎంపీటీసీ), ఎం.గణేష్ (గోచెక్క పంచాయతీ సర్పంచ్), మెల్లిక ఆదియ్య, ప్రభాకర్ (బొడ్డవలస), కర్రి రామన్న(టొంకి), తవుడు(జిల్లేడువలస), అప్పారావు(దుగ్గేరు సంఘం ప్రతినిధి) తదితరులు పాల్గొన్నారు. -
గ్రానైట్ క్వారీలో పేలుడు
వరంగల్: వరంగల్ జిల్లా గూడూరు మండలం తీగలవేణి గ్రానైట్ క్వారీలో పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన స్థానికి ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మంత్రిగారి క్వారీలో పడి కార్మికుడు మృతి
-
‘తల్లి’డిల్లిన తనయుని గుండె..
అమ్మ కర్మకాండలకు సిద్ధమవుతూ హఠాన్మరణం తిరుమలాయపాలెం: చిన్ననాటి నుంచి అమ్మ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేని ఆ తనయుడు... చివరకు ఆ అమ్మనే వెతుక్కుంటూ తల్లి కర్మకాండ రోజే తనువు చాలించాడు. మాతృమూర్తి దూరమైన నాటి నుంచి నిత్యం ఆమెను తలచుకొని మదనపడుతూ ఆమె కర్మకాండ రోజే గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యూడు. ఖమ్మం జిల్లా పిండిప్రోలులో శనివారం జరిగిన ఈ ఘటన పూర్వాపరాలు.. పిండిప్రోలు గ్రామానికి చెందిన లలితమ్మ(50), ఆమె భర్త బాబు స్థానిక గ్రానైట్ క్వారీలో వంట మనుషులుగా పనిచేసేవారు. ఈనెల 9న క్వారీ పక్కనున్న గుంతలో నుంచి నీళ్లు తెచ్చేందుకు వెళ్లిన లలితమ్మ... ప్రమాదవశాత్తు కాలుజారి అందులో పడి మరణించింది. అమ్మంటే ఎనలేని ప్రేమ ఉన్న ఆమె కుమారుడు ఉపేందర్ (27) ఆ రోజు నుంచి తీవ్ర వేదనతో కుంగిపోయాడు. శనివారం లలితమ్మ దశ దినకర్మ నిర్వహించాల్సి ఉంది. దీనికోసం కార్డులు పంపిణీ చేసి బంధుమిత్రులను ఆహ్వానించాడు. బంధువులంతా ఇంటికి చేరుకుని కర్మకాండల కోసం కావాల్సిన సామగ్రిని సిద్ధం చేసే పనిలో ఉండగా, ఉపేందర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు వదిలాడు. అయితే ఛాతీలో నొప్పి వస్తోందని అంతకు కొద్దిసేపటి ముందే ఉపేందర్ బంధుమిత్రుల్లో ఒకరిద్దరికి చెప్పాడు. డాక్టర్ వద్దకు వెళదామని వారు చెప్పినా... ఈ కార్యక్రమం పూర్తయ్యాక చూద్దామని చెబుతూ వచ్చాడు. చివరికి గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. ‘అమ్మంటే ఉపేందర్కు ఎంతో ఇష్టం.. ఆమెను విడిచి ఒక్కరోజు కూడా ఉండలేదు. తల్లీ కొడుకులు ఇద్దరూ వెళ్లిపోయారు..’’ అంటూ ఉపేందర్ తండ్రి బాబు శోక సంద్రంలో మునిగిపోయాడు. తల్లి కర్మకాండ రోజే తమ్ముడు మరణించడాన్ని చూసి ఉపేందర్ అక్క స్పృహతప్పి పడిపోయింది. ఆమెను వెంటనే ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించగా.. కోలుకుంటోంది. ఉపేందర్కు ఒక కుమారుడు ఉండగా.. ఆయన భార్య ఉప్పమ్మ ప్రస్తుతం గర్భవతి. -
క్వారీలో పడి తల్లి, కూతురు మృతి
కుత్బుల్లాపూర్ (రంగారెడ్డి) : ఒక గ్రానైట్ క్వారీలో పడి తల్లి, కూతురు మృతిచెందారు. ఈ సంఘటన శనివారం రంగారెడ్డి జిల్లా గాజుల రామారం డివిజన్ కైజర్నగర్లో వెలుగుచూసింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీసి పోస్ట్మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గ్రానైట్ క్వారీలో ప్రమాదం
ముగ్గురు కార్మికులు మృతి శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు చింతలగుట్ట వద్ద గ్రానైట్ క్వారీలో శనివారం సాయంత్రం పేలుడు సంభవించి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. క్వారీలో కార్మికులు డ్రిల్లింగ్ చేసి డిటోనేటర్ అమర్చుతుండగా పేలుడు జరిగినట్టు స్థానికులు అనుమానిస్తుండగా, బండరాయి కూలడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. క్వారీలో బీహార్, తమిళనాడుకు చెందిన కూలీలు కొన్ని నెలలుగా పనులు చేస్తున్నారు. రోజు మాదిరిగానే శనివారం డ్రిల్లింగ్ పనులను బిహార్కు చెందిన అజయ్నాయక్(22), రాహుల్నాయక్(21), బికారీ నాయక్(23), తమిళనాడుకు చెందిన మరియప్పన్(47), పలనీ(45)లు చేస్తున్నారు. మరికొందమంది కార్మికులు మరోచోట డ్రిల్లింగ్ చేసి, డిటోనేటర్లు అమర్చారు. ఇంతలో పేలుడు జరిగిందో, బండరాయి కూలిపోయిందో కానీ భారీ ప్రమాదం జరిగింది. అజయ్నాయక్, రాహుల్నాయక్, మరియప్పన్ అక్కడికక్కడే మృతిచెందగా, బికారీనాయక్కు తీవ్రగాయాలయ్యాయి. -
డీజిల్ డ్రమ్ములకు మంటలు
చీమకుర్తి : ఓ ఇంట్లో నిల్వ ఉంచిన డీజిల్ డ్రమ్ములు ఉన్నట్టుండి పేలాయి. గాలిలో తేలుతూ పల్టీలు కొట్టాయి. ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించాయి. ఫలితంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారు భయంతో బయటకు పరుగులు తీసి క్షేమంగా బయటపడ్డారు. ఈ సంఘటన చీమకుర్తి నడిబొడ్డున బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగింది. వివరాలు.. పాడి ఆంజనేయులు అనే వ్యక్తి గ్రానైట్ క్వారీలకు చెందిన టిప్పర్లు, ట్రాలీల నుంచి అక్రమంగా డీజిల్ సేకరిస్తుంటాడు. అనంతరం డ్రమ్ముల్లో నిల్వ చేసి అడ్డదారిలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటుంటాడు. పాలపర్తి ప్రభుదాస్ అనే వ్యక్తి ఇంటిని అద్దెకు తీసుకొని దానిలో డీజిల్ డ్రమ్ములు నిల్వ ఉంచాడు. ఆంజనేయులు వద్ద మస్తాన్(45)తో పాటు మరో 15 మంది పని చేస్తుంటారు. వీరు డీజిల్ను సేకరించి డ్రమ్ముల్లోకి మారుస్తూ ఉంటారు. డీజిల్ డ్రమ్ములు నిల్వ చేసే ఇంట్లో మస్తాన్తో పాటు ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. డీజిలే కాకుండా తక్కువ మోతాదులో పెట్రోలు కూడా నిల్వ ఉంచినట్లు సమాచారం. డీజిల్ను వేరే డ్రమ్ముల్లోకి మార్చే సమయంలో సిగరెట్ కాలుస్తుండటంతో ప్రమాదవశాత్తూ మంటలు డీజిల్, పెట్రోల్కు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు ఇంటి నిండా వ్యాపించాయి. అదే సమయంలో ఇంట్లో డీజిల్ను మార్చే ఇద్దరితో పాటు మస్తాన్ భార్య, ఇద్దరు పిల్లలు భయంతో బయటకు పరుగులు తీశారు. మస్తాన్ మాత్రం మంటల్లో చిక్కుకొని కాలి బూడిదయ్యాడు. ఒక్కసారిగా మంటలు పెద్దవి కావడంతో డీజిల్ డ్రమ్ములు పెద్దగా పేలి గాలిలో పల్టీలు కొట్టాయి. చుట్టుపక్కల వందలాది మంది జనం సంఘటన స్థలానికి చేరుకుని భయంతో వణికిపోయారు. తహశీల్దార్ పి.మధుసూదన్రావు, ఎస్సై నాగరాజులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇంతలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. అడిషనల్ ఎస్పీ రామానాయక్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. -
గుట్టలను తవ్వేస్తున్నారు
మైనింగ్ దందా జోరుగా సాగుతోంది.నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు ఏర్పాటు చేసి గుట్టలను తవ్వుకుపోతున్నా అధికారులకు పట్టడంలేదు. బ్లాస్టింగ్లతో బోర్లు దెబ్బతింటున్నా.. ఇళ్లు బీటలు వారుతున్నా.. గ్రామాల్లో కాలుష్యం కమ్మేసినా పట్టించుకునేనాథుడే కరువయ్యాడు. మామూళ్లమత్తులో జోగుతున్న అధికారులు క్వారీల నిర్వాహకుల కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేవరకొండ/చింతపల్లి/కొండమల్లేపల్లి : కొందరు అక్రమార్కులకు ప్రజాప్రయోజనాలు పట్టడంలేదు. నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు ఏర్పాటు చేసి గుట్టలను తవ్వుకుపోతున్నా పట్టించుకునేవారేకరువయ్యారు. దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో కొందరు అక్ర మంగా క్వారీలు నిర్వహిస్తున్నారు. చింతపల్లి మండల కేంద్రంలోని సర్వే నంబర్ 166లోని గట్టుపతి వేంకటేశ్వరస్వామి గుట్టపై నిబంధనలకు విరుద్ధంగా క్వారీని ఏర్పాటు చేశారు. లెక్కకు మించి తవ్వకాలు చేపడుతున్నా పట్టించుకునే వారేలేరు. ఎప్పటికప్పుడు అధికారులకు ఎర వేసి లీజ్ గడువును పొడగిస్తూ తవ్వకాలు చేపడుతున్నారు. సుమారు 200 మీటర్ల లోతులో తవ్వకాలు చేపట్టడంతో ఈ గుట్ట తరిగిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా నకిలీ వేబిల్లులతో గ్రానైట్ను అధికమొత్తంలో తరలిస్తున్నా అధికారులకు పట్టడంలేదు. గ్రానైట్ను తవ్వే క్రమంలో బ్లాస్టింగ్ చేస్తుండటంతో చుట్టుపక్కల బోర్లు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బోర్లు వట్టిపోయాయని ఫిర్యాదు చేస్తున్నారు. దీన్ని నియంత్రించాల్సిన రెవెన్యూ శాఖ కూడా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే ఈ గ్రానైట్ క్వారీని ఆనుకుని ఉన్న 200 ఎకరాల పొరంబోకుభూమిలో గత కొన్నెళ్ల నుంచి అటవీ ప్రాంతం నుంచి వచ్చి ఉన్న జింకలు, నెమళ్లు, కుందేళ్లు తదితర జంతువుల మనుగడ బ్లాస్టింగ్ల వల్ల ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉండగా దేవరకొండ - కొండమల్లేపల్లి మెయిన్రోడ్డులో మూడు కంకర మిల్లులు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారు. మెయిన్రోడ్డు నుంచి 200 మీటర్ల మేర ఎటువంటి తవ్వకాలకు, మిల్లులకు అనుమతులు ఇవ్వకూడదని నిబంధనలు ఉన్నా మైనింగ్, కాలుష్య నియంత్రణ మండలి శాఖలు పట్టించుకోలేదు. నిబంధనలు తంగలో తొక్కి అనుమతులు ఇచ్చారు. దీంతో ప్రతి నిత్యం మిల్లు నుంచి విడుదలయ్యే దుమ్ము, పొగ రోడ్డు మీద నుంచి వెళ్లే వాహనదారులకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. దీంతో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కార్మికులకు సౌకర్యాలు కరువు మిల్లుల్లో పని చేసే కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. వీటి నిర్వహణపై పలు ఫిర్యాదులున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. క్వారీల్లో బ్లాస్టింగ్ల వల్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాం దోళనలకు గురవుతున్నారు. పేలుళ్ల వల్ల తమ ఇళ్లు బీటలువారుతున్నాయని సమీప కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొండభీమనపల్లి సమీపంలోని బొల్లిగుట్ట వద్ద సిలికాన్ స్టోన్ క్వారీ కూడా 20 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ క్వారీ కూడా మెయిన్రోడ్డు వెంబడే ఉంది. వీటన్నింటినీ నియంత్రించాల్సిన గనులు, భూగర్భ వనరుల శాఖ, కాలుష్య నియంత్రణమండలి, కార్మికశాఖలు ఏమాత్రం స్పందించడం లేదు. ఫిర్యాదులుంటే గానీ స్పందించమన్న రీతిలో ఆయా శాఖల ధోరణి కనిపిస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, కలెక్టర్ స్పందించి వీటి నిర్వహణపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.