అయోధ్య కుంభకోణం: సిట్ బయటపెట్టిన షాకింగ్ నిజాలు!
భక్తులు భగవంతుడిపై విశ్వాసంతో హుండీలో వేసిన కానుకలనే కొందరు సిబ్బంది కాజేశారు. సీసీ కెమెరాలు ఉన్నా పట్టుబడకుండా చాకచక్యంగా వ్యవహరించారు. ఒకరు కెమెరాకు అడ్డంగా నిలబడితే.. మరొకరు హుండీలోని నగదును, నగలను మాయం చేశారు. అయోధ్య రామమందిరంలో విరాళాల దుర్వినియోగం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) బయటపెట్టిన వివరాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.ప్రత్యేక దర్యాప్తు బృందం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 వరకు కేవలం 40 రోజుల్లోనే దాదాపు 70 సార్లు చోరీలు జరిగినట్లు సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాల ద్వారా గుర్తించారు. ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు.. రూ.79.85 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.దర్యాప్తులో బయటపడిన విధానం మరింత విస్మయానికి గురిచేస్తోంది. విరాళాల లెక్కింపు సమయంలో ఒక ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా సీసీ కెమెరాలకు అడ్డంగా నిలబడేవాడు. అదే సమయంలో అతని సహచరులు హుండీలోని నగదును దొంగిలించి తమ దుస్తుల్లో దాచుకునేవారు. అనంతరం ఆ డబ్బును స్నానాల గదిలో దాచిపెట్టి, అనువైన సమయంలో బయటకు తీసుకెళ్లి పరస్పరం పంచుకునేవారని ఎస్ఐటీ గుర్తించింది.ఇంతటితో ఆగలేదు. హుండీల్లో వచ్చిన నగదును బ్యాంకులకు తరలించే సమయంలో కూడా కొంత మొత్తాన్ని పక్కకు మళ్లించి కాజేసినట్లు దర్యాప్తులో తేలింది. నగదు లెక్కింపు, భద్రపరచడం, బ్యాంకులో జమ చేసే మొత్తం ప్రక్రియలో పలు దశల్లో అక్రమాలు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.నగదుతో పాటు భక్తులు బాలరాముడికి సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలు కూడా మాయమైనట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. హుండీలో వేసిన చెవిపోగులు, ముక్కుపుడకలు, గాజులు, కాలి గజ్జెలు.. లాంటి విలువైన ఆభరణాల లెక్కల్లో కూడా తేడాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. అయితే వీటి విలువ, పరిమాణంపై అధికారులు ఇంకా అధికారిక వివరాలు వెల్లడించలేదు.ఎస్ఐటీ ప్రాథమిక నివేదిక ఆధారంగా నమోదైన కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా జూన్ 29 వరకు పోలీసు కస్టడీకి పంపించారు. అరెస్టయిన వారిలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్కు మాజీ డ్రైవర్గా పనిచేసిన టిన్నూ యాదవ్ కూడా ఉన్నాడు.ఈ పరిణామాల మధ్య.. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. వీరి పేర్లు ఎఫ్ఐఆర్లో లేకపోయినా, అరెస్టయిన కొందరు నిందితులు తమ సన్నిహితులేనన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ ఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ‘‘ప్రజల విశ్వాసంతో చెలగాటమాడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం. దోషులు కఠిన శిక్షను ఎదుర్కోవాల్సిందే’’ అని స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై రాజకీయ విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. అయోధ్య రామమందిరం వంటి దేశంలోని అత్యంత ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంలో విరాళాల భద్రత, పారదర్శకతపై ఈ ఘటన తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. దర్యాప్తులో మరెన్ని సంచలనాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.