అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగం కేసు కొత్త మలుపు తిరిగింది. కేసు అధికారికంగా నమోదు కావడానికి ముందే.. దొంగిలించబడిన నగదులో భారీ మొత్తాన్ని రికవరీ చేసినట్లు వెలుగులోకి రావడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో ఆలయ ట్రస్ట్ పాత్ర, పోలీసుల చర్యలు, దర్యాప్తు తీరుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ ప్రారంభించకముందే.. దొంగిలించబడిన నగదులో సుమారు రూ.58 లక్షలను ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామం కేసు దర్యాప్తులో కొత్త కోణాన్ని తెరపైకి తీసుకొచ్చింది.
జూన్ 4వ తేదీన విరాళాల నగదు గల్లంతైన విషయం ట్రస్ట్కు తెలిసింది. మరుసటి రోజే అప్పటి ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ ఆదేశాల మేరకు ట్రస్ట్ ప్రతినిధులు, పోలీసులతో కలిసి నిందితుడు అవినాశ్ శుక్లా ఇంటికి వెళ్లి సుమారు రూ.58 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం జూన్ 5 నుంచి 8 మధ్య మిగిలిన మొత్తం నిందితులు బ్యాంకు బదిలీల ద్వారా తిరిగి చెల్లించినట్లు సమాచారం.
అయితే ఈ మొత్తం రికవరీ అంతా ఎఫ్ఐఆర్ నమోదుకు ముందే జరగడం ఇప్పుడు దర్యాప్తులో కీలక అంశంగా మారింది. కేసు బయటకు రావడానికి ముందే నగదు రికవరీ ఎందుకు జరిగింది? అధికారిక ఫిర్యాదు నమోదు చేయడంలో ఎందుకు ఆలస్యం జరిగింది? అనే అంశాలపై విచారణ సంస్థలు దృష్టి సారించాయి.
ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాతే.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. విచారణలో భాగంగా ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారి ఇళ్లలో సోదాలు నిర్వహించి మరికొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
ఈ వివాదం నేపథ్యంలో శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అప్పటి ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు విరాళాల నగదు నిర్వహణ, ఉద్యోగుల నియామకాలు, సీసీటీవీ పర్యవేక్షణలో పలు లోపాలు ఉన్నట్లు సిట్ గుర్తించినట్లు సమాచారం.
కేసుపై ఇటు రాజకీయంగానూ దుమారం కొనసాగుతోంది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించగా.. విశ్వహిందూ పరిషత్ (VHP) మాత్రం పారదర్శక దర్యాప్తు జరిపి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మరోవైపు సుప్రీం కోర్టు ఈ వ్యవహారంలో దాఖలైన పిల్ను.. నిదానంగా విచారణ జరుపుతానని అంటోంది.
ఎఫ్ఐఆర్కు ముందే నగదు రికవరీ జరిగిన వ్యవహారం, దాని వెనుక అనుసరించిన ప్రక్రియపై ఇప్పుడు దర్యాప్తు సంస్థలు లోతుగా ఆరా తీస్తుండటంతో.. రామమందిరం విరాళాల కేసు మరిన్ని సంచలన విషయాలను వెలుగులోకి తీసుకురానుందా అనే ఆసక్తి నెలకొంది.


