అయోధ్యలో చందా చోరీ వివాదంలో కేసు నమోదుకు ముందే నగదు జప్తు
న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిరం విరాళాల అక్రమాలపై మరిన్ని వివరాలు వెలుగుచూశాయి. ఈ వివాదం వెలుగులోకి రాకమునుపే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు నిధుల్లో అవకతవకలు జరిగిన విషయం ట్రస్ట్వర్గాలకు తెలుసు అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఆదేశాల మేరకు ట్రస్ట్ ప్రతినిధులు పోలీసులను నిందితుడు అవినాశ్ ఇంటికి పంపించి నగదు బ్యాగును తెప్పించినట్లు తాజా వీడియోతో బహిర్గతమైంది.
ఈ నగదు స్వాధీనంనాటికి ఇంకా పోలీస్ ఎఫ్ఐఆర్ కూడా నమోదుకాలేదు. జూన్ 5న అవినాశ్ నివాసంలో సోదాలు అనధికారికంగా చేపట్టినట్లు తెలుస్తోంది. విరాళాలు పక్కదారి పట్టిన అంశం జూన్ 7వ తేదీన మాత్రమే బహిర్గతమైంది. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ రామ మందిరానికి అందిన కోట్లాది విరాళాలు పక్కదారి పట్టాయని సంచలన ప్రకటన చేయడం తెల్సిందే. అంతకుముందే, పోలీసులు శుక్లాను కస్టడీలోకి తీసుకోవడంతోపాటు అతడు నోట్ల కట్టలున్న ఓ పెద్ద బ్యాగును మోసుకెళ్తున్నట్లుగా ఉన్న 24 సెకన్ల వీడియో ఒకటి తాజాగా బహిర్గతమైంది.
సోదాలు జరిపిన పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపైనా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. సీసీటీవీ నిఘా, విరాళాలను స్వీకరించే ఉద్యోగుల ఎంపిక, నగదు నిల్వ విధానాల్లో తీవ్ర లోపాలున్నట్లు సిట్ ఇప్పటికే గుర్తించింది. ఈ మొత్తం వ్యవహారాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించిందని, అందులోని సిబ్బంది అంతా ట్రస్ట్ ఉద్యోగులకు సంబంధించిన వారేనని చెబుతు న్నారు. ఆలయ ట్రస్ట్ జరిపిన భూమి కొనుగోళ్లు, ఆలయ నిర్మాణ టెండర్ల ఖరారు పైనా సిట్ దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు దర్యాప్తు నివేదికలను సీఎం యోగికి అందజేస్తోంది.
నిందితుల ఇళ్లపై దాడులు
విరాళాలను చోరీ చేసిన ఆరోపణలపై అరెస్టయిన 8 మంది నిందితుల నివాసాలపై అయోధ్య పోలీసు బృందాలు ఆదివారం ఏకకాలంలో దాడులు చేపట్టాయి. అయోధ్య కోర్టు నిందితులందరినీ సోమవారం వరకు రిమాండ్కు పంపించడం తెల్సిందే. ఆదివారం తనిఖీల సందర్భంగా నిందితుడు మనీశ్ యాదవ్ ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో, అధికారులు కుటుంబసభ్యులతో తాళం తీయించి, సోదాలు చేపట్టారు. రామశంకర్ అలియాస్ టిన్ను యాదవ్ ఇంట్లోనూ సోదాలు చేపట్టారు. అతడి కుటుంబసభ్యులను ప్రశ్నించారు. చుట్టుపక్కల వారి నుంచి అతడి ఆస్తుల వివరాలపై ఆరా తీశారు. తనిఖీల్లో ఇప్పటి వరకు 79.85 లక్షల నగదు దొరికినట్లు అధికారులు చెప్పారు.
స్కార్పియో, ఫామ్హౌస్..
అయోధ్య విరాళాల చోరీ కేసులో అరెస్టయి న వారిలో అనుకల్ప్ మిశ్రా, అతని బావ లవ్కుశ్ మిశ్రా కీలకంగా ఉన్నారు. మూడేళ్ల క్రితం బ్యాంక్ ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా చేరిన అనుకల్ప్ మిశ్రా దాతల విరాళాలు, విలువైన వస్తువులను లెక్కించే బృందంలో చేరాడు. ఆ తర్వాత అధికారుల సాయంతో తన బావ లవ్కుశ్ను అదే పనిలో చేర్పించాడు. ఇద్దరూ కలిసి సొత్తును దారి మళ్లించే పనిలో బిజీ అయి పోయారు.
అయోధ్యలోని అనుకల్ప్ సొంత గ్రామానికి వెళ్లిన సిట్ట అధికారులకు విస్తుగొలిపే విషయాలు తెలిశా యి. అనుకల్ప్ కొత్తగా పేద్ద ఇల్లు, భూమి, ఖరీదైన వాహనం, ఫామ్హౌస్ కొనుగోలు చేసినట్లు తేలింది. లవ్కుశ్ మిశ్రా ఖరీదైన బైక్ కొన్నాడు. అనుకల్ప్ మిశ్రా గ్రామంలో ఇటీవల వారం పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిపించాడు. అందులో భా గంగా మతపెద్దలను రప్పించి, ఉపన్యా సాలు ఇప్పించాడు. కార్యక్రమానికి అయో ధ్య ఆలయ ట్రస్ట్ అప్పటి ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, తదితర ప్రముఖులు హాజరయ్యారు.


