అమెరికాలో భారత మహిళకు బెదిరింపులు! | Indian woman racially abused in new york train and video goes viral | Sakshi
Sakshi News home page

అమెరికాలో భారత మహిళకు బెదిరింపులు!

Mar 2 2017 11:32 PM | Updated on Oct 17 2018 4:36 PM

అమెరికాలో భారత మహిళకు బెదిరింపులు! - Sakshi

అమెరికాలో భారత మహిళకు బెదిరింపులు!

డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం దేశవ్యాప్తంగా విదేశీయులపై దాడులు పెరిగిపోతున్నాయి.

న్యూయార్క్: డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం దేశవ్యాప్తంగా విదేశీయులపై దాడులు పెరిగిపోతున్నాయి. స్టాఫ్ట్ వేర్ ఇంజినీర్ కూఛిబొట్ల శ్రీనివాస్ హత్య అనంతరం అమెరికాలో భారతీయులపై జాతి విద్వేష వ్యతిరేకత తీవ్రమవుతోంది. ఇందుకు భారత సంతతికి చెందిన ఓ మహిళా ఉద్యోగి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియోనే ఉదాహరణ. ఎక్తా దేశాయ్ అనే భారతీయ మహిళ న్యూయార్క్ లో ఉద్యోగం చేస్తోంది.

ఈ క్రమంలో తాను ఆఫీసులో పని ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణమైంది. న్యూయార్క్‌లో లోకల్ ట్రైన్‌లో వెళ్తుండగా ఓ అమెరికన్ ఆమె వద్దకు వచ్చి అసభ్య పదజాలంతో దూషించాడని తన పోస్ట్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్ గా మారింది. అమెరికన్ తనపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడగా, ఆ సమయంలో రైల్లో దాదాపు 100 మంది ప్రయాణికులున్నారని తెలిపింది. హెడ్ ఫోన్స్‌తో తిరుగు ప్రయాణంలో కాలక్షేపం చేస్తున్న తన వద్దకు ఓ వ్యక్తి వచ్చాడని, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావని.. మీ దేశానికి వెళ్లిపో (గో బ్యాక్ టూ యువర్ కంట్రీ) అంటూ బెదిరించాడని ఎక్తా దేశాయ్ పేర్కొంది. తాను మాత్రం అతడితో వాదించే ప్రయత్నం చేయలేదట.

తన తర్వాత అదే కంపార్ట్‌మెంట్లో ఉన్న మరో ఆసియా యువతిపై ఇదే తీరున రెచ్చిపోవడంతో రైల్వే పోలీసులకు ఎక్తా దేశాయ్ ఫిర్యాదు చేసింది. మొబైల్‌లో రికార్డు చేసిన వీడియోను పోలీసులను చూపించింది. తాను తన అభిప్రాయాన్ని మాత్రమే చెప్పానని, తాను ఏ మహిళను తాకలేదంటూ అమెరికన్ వ్యక్తి చెప్పినట్లు వీడియోలో రికార్డ్ అయింది. పోలీసులు మాత్రం అతడిపై ఎలాంటి చర్య తీసుకోలేదని సమాచారం. కూఛిబొట్ల శ్రీనివాస్ హత్య ఉదంతం అనంతరం ఎక్తా పోస్ట్ చేసిన వీడియో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. జాతి విద్వేష దాడులు, కాల్పులపై అమెరికా వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement