మట్టిమనిషి | how politicians cheating formers, Sriramana writes | Sakshi
Sakshi News home page

మట్టిమనిషి

Apr 15 2017 4:34 AM | Updated on Sep 5 2017 8:46 AM

మట్టిమనిషి

మట్టిమనిషి

దేశానికి రైతే వెన్నెముక అంటూ మమ్మల్ని ఈ రాజకీయం బ్లాక్‌మెయిల్‌ చేసి పబ్బం గడుపుకుంటోందని మట్టి మనుషులు గ్రహించారు.

అక్షర తూణీరం
దేశానికి రైతే వెన్నెముక అంటూ మమ్మల్ని ఈ రాజకీయం బ్లాక్‌మెయిల్‌ చేసి పబ్బం గడుపుకుంటోందని మట్టి మనుషులు గ్రహించారు.

ఒకనాడు రైతు ఈ సృష్టిని పోషించాడు. శాసించాడు. నాడు రాజుల ఖజానాలు రైతులు చెల్లించే భూమి శిస్తు లతోనే నిండేవి. గ్రామాలలో కులవృత్తుల వారందరికీ మిరాశీలుగా చెల్లింపులుండేవి. భూవసతి లేని వారు పొలం పనులు చేసిపెడుతూ రైతుకి ఆదరువుగా ఉండే వారు. కూలి నాలి ధాన్యాల రూపంలో ముట్టేవి. కొను గోళ్లు తక్కువగా ఉండి, నిత్యావసరాలు పరటా పద్ధతిలో  (బార్టర్‌ సిస్టమ్‌లో) లభించేవి. నాడు నిత్యావసరాలు ‘ఉప్పుతో పదహారు మాత్రమే’ ఉండేవి. వస్తుమార్పిడే తప్ప రొక్కంతో కొనుగోళ్లు లేవు. అందుకని గిట్టుబాటు ధరల ప్రసక్తే లేదు. నాగరికత ముదరడంతో దాని ప్రభావం గ్రామాలపై పడింది.

ఈస్టిండియా కంపెనీ వ్యాపార నెపంతోనే మన దేశం వచ్చింది. వచ్చాకా వ్యాపారమే చేసింది. ఇదిగో ఈ ఆనకట్ట కడితే, ఇన్ని లక్షల ఎకరాలు సాగవుతుంది. దాని వల్ల కంపెనీ వారికి ఇంత అధిక రాబడి వస్తుందని మాత్రమే లెక్కించేవారు. ఒక రైల్వే లైను వేసినా, ఒక వంతెన కట్టినా ఒక పరిశ్రమ స్థాపించినా మనకెంత ప్రయోజనం అని మాత్రమే చూసుకునేవారు. స్వాతంత్య్రం వచ్చింది. కంపెనీ దొరలు వెళ్లిపోయారు. మనవాళ్లొచ్చి దేశ పగ్గాలు ధరించారు. అర్ధ శతాబ్ది కాలంలో, అంటే 1950 నుంచి నూతన సహస్రాబ్ది దాకా జరి గిందేమిటి? ఎవరు లబ్ధి పొందారు? అధికారాన్ని అనుభ వించిందెవరు? న్యాయమైపోయిం దెవరు? అంతరించిపోయిందె వరు?

భూస్వాములంతా దుర్మార్గు లనే అభిప్రాయం వచ్చేసింది. బ్రిటిష్‌ హయాంలో చిన్న చిన్న రాజ్యాలన్నీ ఏకమై దేశం ఏకాం డిగా తయారైంది. తర్వాత రాజ్యా లన్నీ పోయి చిన్న చిన్న ఆస్థా నాలు, జమిందారీలు మిగిలాయి. ఈ క్రమంలోనే జనం ‘టౌను బాట’ పట్టడం మొదలైంది. ఏ విధమైన ఇతర ఆస్తుల మీదా పరిమితి విధించని ప్రభుత్వం భూములపై సీలింగ్‌ పెట్టింది. దీంతో పై తరగతి, మధ్య తరగతి రైతులకి బెదురు పట్టుకుంది. వ్యవసాయంపై ఆసక్తి తగ్గింది. అదే సమయంలో దూరపు కొండలు పచ్చగా కనిపించాయి. ఎండని, వానని సమంగా ఆస్వాదించిన రైతు పూర్తిగా నిరాశకి గురయ్యాడు. నేటి ప్రభుత్వ నీళ్ల కంటే నాటి ప్రకృతి ఇచ్చిన నీళ్లే బంగారం పండించాయ్‌. రైతు, రాజ్యం, దేశానికి రైతే వెన్నెముక అంటూ మమ్మల్ని ఈ రాజకీయం బ్లాక్‌మెయిల్‌ చేసి పబ్బం గడుపుకుంటోందని మట్టి మనుషులు గ్రహించారు.

అయినా నేతలు వారిని వదలడం లేదు. బ్యాంకులు జాతీయం చేశాక రైతులకు అప్పులు మప్పారు. దాన్నొక వ్యసనంగా మార్చారు. ఎన్నికల ముందు రుణమాఫీ ఎరగా చూపి నెగ్గేస్తున్నారు. గెలిచాక మిగతా ఎన్నికల వాగ్దానాల్ని ఎంతవరకు నిలబెట్టుకుంటారో ఇదీ అంతే అవుతుంది. రాష్ట్ర ప్రభు త్వాలు, కేంద్ర ప్రభుత్వం రైతు, రైతు కూలీ ఓట్ల కోసం రకరకాల వాగ్దానాల గడ్డి కరుస్తూనే ఉన్నాయి. ‘‘ఓ తండ్రీ! వారలేమి చేయుచున్నారో వారికి తెలియదు. వారిని రక్షింపుము!’’ శుభ శుక్రవారం.


- శ్రీరమణ

(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Advertisement
 
Advertisement
Advertisement