పెద్దపల్లిలో మహిళ సజీవ దహనం | Woman to burn alive in peddapalli | Sakshi
Sakshi News home page

పెద్దపల్లిలో మహిళ సజీవ దహనం

Sep 9 2015 11:07 PM | Updated on Sep 3 2017 9:04 AM

కరీంనగర్ జిల్లా పెద్దపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద బుధవారం మధ్యాహ్నం ఓ గుర్తు తెలియని మహిళ సజీవ దహనమైంది.

పెద్దపల్లి(కరీంనగర్): కరీంనగర్ జిల్లా పెద్దపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద బుధవారం మధ్యాహ్నం ఓ గుర్తు తెలియని మహిళ సజీవ దహనమైంది. మధ్యాహ్నం సమయంలో మంటల్లో కాలుతున్న మహిళ ఆర్తనాదాలు చుట్టుపక్కల వారికి వినిపించాయి. పొలాల్లో ఉన్న రైతులు సంఘటన స్థలం వైపు పరుగెత్తగా అక్కడున్న ఓ వ్యక్తి బైక్‌పై పారిపోయాడు.

మహిళ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచనలం సృష్టించింది. అక్కడున్న రైతులు అందించిన సమాచారం మేరకు పెద్దపల్లి డీఎస్పీ నల్ల మల్లారెడ్డి, సీఐ ప్రశాంత్‌రెడ్డి వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మహిళ పూర్తిగా కాలిపోరుుంది. పోలీసులు మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, డీఎన్‌ఏ పరీక్షలకు శాంపిళ్లు పంపించారు.

ఎవరీ మృతురాలు..?
పెద్దపల్లి రైల్వేస్టేషన్ నుంచి ద్విచక్ర వాహనంపై ఓ జంట వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. పథకం ప్రకారమే మహిళను ఓ వ్యక్తి ఇక్కడికి రప్పించి సజీవ దహనం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న పెట్రోల్ చల్లి నిప్పు అంటించడంతో పాటు మంటల్లో కాలుతూ మహిళ కిందపడిపోగానే చుట్టుపక్కల ఉన్న కర్రలను ఆమె దేహంపై వేసి మంటకు తోడుచేశాడు. కాళ్ల భాగం మాత్రమే మిగిలి ఉండడంతో గుర్తుపట్టడం ఇబ్బందిగా మారింది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనా... లేక దూరమవుతున్న ప్రియురాలును ఉన్మాదిగా మారిన ప్రేమికుడు దారుణంగా సజీవ దహనం చేశాడా అని పలువురు అనుమానిస్తున్నారు. మహిళ వయసు 25-30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. ఆమె ఒంటిపై పంజాబీ డ్రెస్, కాళ్లకు పట్టీలు, ఎడమకాలికి ఎర్రటి దారం ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement