ప్రతి బుధవారం మొయిలీ బస్సుప్రయాణం | Sakshi
Sakshi News home page

ప్రతి బుధవారం మొయిలీ బస్సుప్రయాణం

Published Fri, Sep 27 2013 2:49 PM

Veerappa Moily to travel by public transport every Wednesday

ఒక్కో మనిషి ఒక్కో కారులో వెళ్తుంటే బోలెడంత పెట్రోలు ఖర్చవుతుంది. అదే 20-30 మంది కలిసి ఒక్క బస్సులో వెళ్తే చాలా ఆదా అవుతుంది. సరిగ్గా ఇదే సూత్రాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ చెబుతున్నారు. చెప్పడమే కాదు, ఆయన దీన్ని స్వయంగా కూడా ఆచరించి చూపిస్తానంటున్నారు. వారానికి ఒకరోజు చొప్పున తాను కేవలం బస్సుల్లోనే ప్రయాణిస్తానని మొయిలీ స్పష్టం చేశారు.

అక్టోబర్ 9వ తేదీ నుంచి ప్రతి బుధవారం తాను కారులో ప్రయాణం చేయబోనని, ప్రజారవాణానే వినియోగిస్తానని ఆయన చెప్పారు. చమురు దిగుమతుల బిల్లు 500 కోట్ల డాలర్లకు చేరుకుంటున్నందున దాంట్లో కొంతయినా ఆదా చేయాలంటే అందరూ బస్సుల్లో ప్రయాణించాలని, వీలైనంత వరకు వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించాలని మొయిలీ పిలుపునిచ్చారు. తనతో పాటు తన మంత్రిత్వశాఖ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసేవాళ్లు కూడా ప్రతి బుధవారం బస్సుల్లోనే తిరగాలని ఆయన కోరారు.

Advertisement
Advertisement