పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు మంచి మనసుతో మద్దతిచ్చి.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని బీజేపీకి టీ కాంగ్రెస్ ఎంపీలు విజ్ఞప్తి చేశారు.
* టీ బిల్లుపై బీజేపీకి టీ కాంగ్రెస్ ఎంపీల విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు మంచి మనసుతో మద్దతిచ్చి.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని బీజేపీకి టీ కాంగ్రెస్ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. సభలో గందరగోళం లేకుంటేనే మద్దతు ఇస్తామని బీజేపీ చెప్పడం సరికాదని పేర్కొన్నారు. ఉభయ సభల్లో విభజన బిల్లుకు ఆమోదం లభించడంలో కాంగ్రెస్కు ఎంత బాధ్యత ఉందో.. ప్రతిపక్షం బీజేపీకి అంతే బాధ్యత ఉందన్నారు.
పార్లమెంటు వెలుపల బుధవారం తెలంగాణ ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. జగన్, చంద్రబాబు ఇద్దరూ తెలంగాణను అడ్డుకోవడానికి జాతీయ నేతలను కలుస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం కిరణ్ ఢిల్లీలో దీక్ష చేపట్టడం స్వార్థరాజకీయాలకు నిదర్శనమన్నారు.