క్రికెట్ లెజెండ్ల ఆశీస్సులు అందుకున్నాను:కైఫ్ | Mohd Kaif hopes to pitch in Sachin, Ganguly in his campaigning | Sakshi
Sakshi News home page

క్రికెట్ లెజెండ్ల ఆశీస్సులు అందుకున్నాను:కైఫ్

Mar 15 2014 7:42 PM | Updated on Aug 29 2018 8:54 PM

కాంగ్రెస్ పార్టీ తరపున ఉత్తరప్రదేశ్‌లోని పూల్‌పూర్ లోక్‌సభ టికెట్‌ను సంపాదించిన క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ తనకు క్రికెట్ లెజెండ్ల ఆశీస్సులు ఉన్నాయని ప్రకటించారు.

అలహాబాద్: కాంగ్రెస్ పార్టీ తరపున ఉత్తరప్రదేశ్‌లోని పూల్‌పూర్ లోక్‌సభ టికెట్‌ను సంపాదించిన క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ తనకు క్రికెట్ లెజెండ్ల ఆశీస్సులు ఉన్నాయని ప్రకటించారు. క్రికెట్‌లో తనకు సీనియర్లు అయిన సచిన్, ద్రవిడ్, గంగూలీ, హర్బజన్, సెహ్వాగ్‌లతో మాట్లాడానని,  వారి నుంచి అభినందనలు అందుకున్నానని కైఫ్ చెప్పారు. వీలైనప్పుడు ఎన్నికల ప్రచారంలో తన తరపున పాల్గొని సహకారం అందిస్తామని వారు తనకు చెప్పినట్లు వెల్లడించారు.

 

కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించిన అనంతరం శనివారం అలహాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యూపీలో అభివద్ధి లోపించిందన్నారు. క్రికెటర్‌గా తాను దేశవ్యాప్తంగా పర్యటించానని.. అభివద్ధి, క్రీడా మౌలిక వసతుల విషయంలో మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాలకు.. యూపీకి మధ్య తేడాను చూసిన తర్వాత ఆవేదన చెందానన్నారు. దీంతో తన రాష్ట్రానికి, అలహాబాద్‌కు ఏదైనా చేయాలనుకున్నానని.. ఇప్పుడు అందుకు తగిన వేదిక లభించిందన్నారు. పరిస్థితుల ఆధారంగా క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించడంపై నిర్ణయం తీసుకుంటానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

 

Advertisement
 
Advertisement
Advertisement