ఇద్దరు భారత మతగురువులు క్షేమమే: పాక్‌ | Missing Nizamuddin Dargah Clerics safe, says Pakistan | Sakshi
Sakshi News home page

ఇద్దరు భారత మతగురువులు క్షేమమే: పాక్‌

Mar 19 2017 10:11 AM | Updated on Sep 5 2017 6:31 AM

ఇద్దరు భారత మతగురువులు క్షేమమే: పాక్‌

ఇద్దరు భారత మతగురువులు క్షేమమే: పాక్‌

పాకిస్తాన్‌లో అదృశ్యమైన భారత ముస్లిం మతగురువులు క్షేమంగా ఉన్నట్లు ఆ దేశ ప్రభుత్వం తెలిపింది.

కరాచీ/న్యూఢిల్లీ : పాకిస్తాన్‌లో అదృశ్యమైన భారత ముస్లిం మతగురువులు క్షేమంగా ఉన్నట్లు ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. భారత్‌ నుంచి లాహోర్‌కు వెళ్లి అదృశ్యమైన హజ్రత్‌ నిజాముద్దీన్‌ దర్గా పీఠాధిపతి సయ్యద్‌ అసిఫ్‌ నిజామీ(80), ఆయన మేనల్లుడు నాజిమ్‌ నిజామీ శనివారం సాయంత్రం కరాచీకి చేరుకున్నట్లు పాక్‌ విదేశాంగ కార్యాలయం పేర్కొంది. మార్చి 20న వారిద్దరు భారత్‌కు తిరిగిరానున్నారు. భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్, పాక్‌ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తార్‌ అజీజ్‌తో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత పాక్‌ ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది.

మార్చి 8న పాక్‌లోని తన సోదరిని చూడడానికి బయలుదేరిన అసిఫ్‌ నిజామీ 14న లాహోర్‌కు చేరుకున్నారు. తర్వాత ఆచూకీ లేకుండా పోయారు. నిషేధిత ముత్తహిద క్వామీ మూవ్‌మెంట్‌తో(ఎంక్యూఎం) సంబంధాలున్నాయన్న ఆరోపణలతో వీరిని పాక్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలు విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నాయి. రహస్య ప్రాంతానికి తరలించి విచారణను ప్రారంభించాయి.

మరోవైపు ఎటువంటి కమ్యూనికేషన్‌ లేని మధ్యసింధ్‌ ప్రాంతంలో ఇద్దరు మతగురువులు చిక్కుకోవడంతోనే ఎటువంటి వివరాలు తెలియరాలేదని పాక్‌ మీడియా పేర్కొంది. కాగా, వీరిద్దరూ రేపు(సోమవారం) ఢిల్లీ చేరుకుంటారని ట్విటర్ ద్వారా సుష్మా స్వరాజ్ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement