సకల జన‘భేరీ’లో నేతలు ఎవరేమన్నారు? | Leaders Voice on Telangana in Sakala Jana Bheri Sabha | Sakshi
Sakshi News home page

సకల జన‘భేరీ’లో నేతలు ఎవరేమన్నారు?

Sep 30 2013 2:31 AM | Updated on Jul 29 2019 5:28 PM

రాష్ట్రం విడిపోతే నీటి దోపిడీ ఆగిపోతుందన్నదే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ అని బీజేపీ నేత, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు.

నీటి దోపిడీ ఆగుతుందనే కిరణ్‌ బాధ: నాగం, బీజేపీ
రాష్ట్రం విడిపోతే నీటి దోపిడీ ఆగిపోతుందన్నదే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ అని బీజేపీ నేత, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు ముందు హైదరాబాద్‌ రాష్ట్రంలో ఉండే ఐదు జిల్లాలు కర్ణాటకలో కలిసి పోయాయని, మరో మూడు జిల్లాలు మహారాష్టల్రో భాగమయ్యాయన్నారు. ఇప్పుడున్న బాబ్లీ ప్రాజెక్టు, ఆల్మట్టి ప్రాజెక్టు ప్రాంతాలు హైదరాబాద్‌ రాష్ట్రంలో పరిధిలో ఉండేవని, భాషోన్మాదంతో హైదరాబాద్‌ రాష్ట్రం విడగొట్టడంతో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వని పక్షంలో వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేస్తామని తమ పార్టీ నాయకులు సుష్మాసర్వాజ్‌ చెప్పినట్లు గుర్తుచేశారు. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు యెండల లకీష్మనారాయణ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నిక ల్లోపే రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేసి, అభివృద్ధి అంశంపైనే 2014 ఎన్నికలు జరగాలన్నది బీజేపీ ఉద్దేశమని చెప్పారు.

తక్షణమే బిల్లు పెట్టాలి: గోవర్ధన్‌, సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ
యూపీఏ ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్‌ సమావేశాలను ఏర్పాటు చేసి తెలంగాణ బిల్టు పెట్టాలని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఒక వర్గం నేత గోవర్ధన్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ఏర్పాటులో జాప్యం చేస్తే తిరగబడి తెలంగాణ సాధించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. హైదరాబాద్‌కు అడ్డుపడితే తెలంగాణ మొత్తం ఆగ్నిగుండం అవుతుందన్నారు. న్యూడెమోక్రసీ మరో వర్గం నేత సూర్యం మాట్లాడుతూ.. హైదరాబాద్‌ యూటీ చేయడంగానీ, రాష్ట్రం సమైక్యంగా ఉంచడం వల్ల ఆ ప్రాంతంలోని సామాన్య ప్రజలకు ఒనగూరే ప్రత్యేక ప్రయోజనమేమీ ఉండదన్నారు. పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కిరణ్‌ బేవకూ్‌ఫ్‌ అని దుయ్యబట్టారు.

ఆంధ్రలో పోరాటం అప్రజాస్వామికం: గుండా మల్లేశ్‌, సీపీఐ
ఆంధ్రా ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలు అప్రజాస్వామికమని సీపీఐ శాసనసభాపక్ష నాయకుడు గుండా మల్లేష్‌ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌, టీడీపీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు తెలంగాణ అంశంలో మాట మార్చాయని, అవేమి ప్రజాస్వామ్య పార్టీలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంతో హుందాగా, బాధ్యత… గా వ్యహరించాల్సి ఉన్నా.. విషపురుగులా మాట్లాడుతున్నారని తప్పుపట్టారు.

హైదరాబాద్‌పై కిరికిరిలేమీ ఉండవు: కేకే, టీఆర్‌ఎస్‌
హెదరాబాద్‌ అంశంలో ఎలాంటి కిరికిరిలు ఉండవని టీఆర్‌ఎస్‌ పార్టీ నేత కే.కేశవరావు అన్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను తెచ్చుకునే సత్తా ఉందన్నారు. తాను కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ అంశం ఎలా ఉండాలన్నది టైపు చేసింది ఇప్పుడు సీఎంగా ఉన్న కిరణేనని చెప్పారు. ముఖ్యమంత్రికి తమను పాలించే హక్కులేదని, నిజాయితీ ఉంటే ఆయన తక్షణమే రాజీనామా చేయాలని టీఆర్‌ఎస్‌ నేత ఈటెల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు.

సీమాంధ్రుల సమస్యలపై చర్చకు సిద్ధం: మల్లేపల్లి, జేఏసీ నేత

రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతంలో తలెత్తే సమస్యలపై చర్చకు తెలంగాణ జేఏసీ సిద్ధంగా ఉందని జేఏసీ కో చైర్మన్‌ మల్లేపల్లి లకష్మయ్య చెప్పారు. సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్న సీఎం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ మాట్లాడుతూ.. తక్షణమే తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. సీమాంధ్రలో ఉద్యమంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

 

తెలంగాణ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘ నేత శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ఏపీఎన్జీవో సభలో జై తెలంగాణ అన్నందుకే కానిస్టేబుల్‌ను విపరీతంగా కొట్టారని, కానీ తమది అలాంటి సంస్కృతి కాదన్నారు. రాష్ట్రం వచ్చాక తెలంగాణ పబ్లిక్‌ స్వరీస్‌ కమిషన్‌ ద్వారా ఒకే రోజు లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల చేయాలని తెలంగాణ ఉద్యోగ సంఘం నాయకుడు విఠల్‌ అన్నారు. సీమాంధ్రలో జరుగుతున్నది ఆందోళన, తెలంగాణలో జరిగేది ఉద్యమం అని ఆంధ్రా ప్రాంతానికి చెందిన న్యాయవాది ప్రసాద్‌ అన్నారు. కడుపు మండినవాళ్లది ఉద్యమమని, సీమాంధ్రులది ఉద్యమం కాదని పేర్కొన్నారు. విద్యుత్‌ జేఏసీ నాయకులు రఘు, జేఏసీ నాయకులు అద్దంకి దయాకర్‌, వెంకటేశం, కందుల పార్థసారథిరెడ్డి, కత్తి వెంకటస్వామి, అశ్వత్థామరెడ్డి, రాజేందర్‌రెడ్డి తదితరులు వేదికపై మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement