అప్పులంటే ఆమడదూరం..!
బ్యాంక్ రుణాలను తీసుకునేందుకు వెనుకాడుతున్న ప్రజల సంఖ్య భారత్లో పెరుగుతోంది. ఆర్థిక మందగమనం, ఈ నేపథ్యంలో ఉద్యోగాల విషయంలో
న్యూఢిల్లీ: బ్యాంక్ రుణాలను తీసుకునేందుకు వెనుకాడుతున్న ప్రజల సంఖ్య భారత్లో పెరుగుతోంది. ఆర్థిక మందగమనం, ఈ నేపథ్యంలో ఉద్యోగాల విషయంలో నెలకొంటున్న అనిశ్చిత పరిస్థితులే దీనికి కారణం. అసోచామ్ సర్వే ఒకటి ఈ విషయాన్ని పేర్కొంది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే ముందు ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. ప్రత్యేకించి ఫిక్స్డ్ డిపాజిట్లు, షేర్లు లేదా బాండ్లను తనఖాగా ఉంచి వాటిపై రుణాలను తీసుకోవడం గణనీయంగా తగ్గిపోయినట్లు సర్వే పేర్కొంది. బ్యాంకింగ్ డేటా ప్రకారం- ఫిక్స్డ్ డిపాజిట్లపై రుణాలు తీసుకునే వినియోగదారుల రేటు 2012 ఆగస్టు-2013 ఆగస్టు మధ్య 20 శాతం వృద్ధి చెందింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ ఈ రేటు 1.6% క్షీణించింది.
క్రెడిట్ కార్డ్ లావాదేవీల్లోనూ...: క్రెడిట్ కార్డ్ల విషయంలోనూ రుణాలు తీసుకోవడానికి వినియోగదారులు వెనుకడుగు వేస్తున్నారు. చెల్లించాల్సిన మొత్తాలపై అధిక వడ్డీరేట్ల భయాలే ఇందుకు కారణం. ఇప్పటికే రుణాలు తీసుకున్నవారు సైతం అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ- చెల్లింపులను సకాలంలో చెల్లించేస్తూ, జరిమానాలకు గురికాకుండా చూసుకుంటున్నారు. షేర్లు, బాండ్లను తనఖాగా ఉంచి రుణాలను తీసుకునే వ్యక్తులు లేదా సంస్థల విషయానికి వస్తే- ఈ రేటు కూడా గణనీయంగా పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల కాలంలో ఇందుకు సంబంధించి వృద్ధి రేటు 8.8% కాగా ఈ ఆర్థిక సంవత్సరం అసలు వృద్ధిలేకపోగా -6.6%(క్షీణత)లోకి జారిపోయినట్లు సర్వే వెల్లడించింది. దీనికి రుణ గ్రహీతలు అనుసరిస్తున్న జాగరూకత ధోరణి ఒక కారణం కాగా, షేర్ మార్కెట్లో ప్రస్తుత తీవ్ర ఒడిదుడుకుల ధోరణి పట్ల బ్యాంకులు పాటిస్తున్న జాగ్రత్తలు సైతం మరో కారణం.