మన భూగర్భ జలాలు విషతుల్యం | indian ground water poisonous, reports cgwg | Sakshi
Sakshi News home page

మన భూగర్భ జలాలు విషతుల్యం

May 5 2015 6:41 PM | Updated on Sep 18 2018 7:36 PM

దేశంలో సగానికన్నా ఎక్కువ భూభాగంలో భూగర్భ జలాలు విషతుల్యమయ్యాయి. దేశంలోని 676 జిల్లాల్లో 21 రాష్ట్రాల పరిధిలోని 387 జిల్లాల్లో భూగర్భ జలాలు విషతుల్యమయ్యాయని సాక్షాత్తు కేంద్ర భూగర్భ జలాల బోర్డు (సీజీడబ్లూబీ) ఓ నివేదికలో వెల్లడించింది.

దేశంలో సగానికన్నా ఎక్కువ భూభాగంలో భూగర్భ జలాలు విషతుల్యమయ్యాయి. దేశంలోని 676 జిల్లాల్లో 21 రాష్ట్రాల పరిధిలోని 387 జిల్లాల్లో భూగర్భ జలాలు విషతుల్యమయ్యాయని సాక్షాత్తు కేంద్ర భూగర్భ జలాల బోర్డు (సీజీడబ్లూబీ) ఓ నివేదికలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తదితర 15 రాష్ట్రాల్లోని 113 జిల్లాల్లోని భూగర్భ జలాల్లో మోతాదుకు మించి భారలోహాలు, సీసం, కాడ్మియం, క్రోమియం, ఫ్లోరైడ్ ఉన్నాయని నివేదిక హెచ్చరించింది. దేశంలోని 276 జిల్లాల భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ శాతం మరీ ఎక్కువగా ఉందని వెల్లడించింది.

గత మూడు దశాబ్దాలుగా కాలుష్య నియంత్రణ బోర్డులు, కమిటీలు నిద్రపోతుండటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రముఖ పర్యావరణవేత్త మనోజ్ మిశ్రా ఆరోపించారు. పది రాష్ట్రాల్లోని 86 జిల్లాల భూగర్భ జలాల్లో స్లో పాయిజన్‌గా పనిచేసే విషపదార్థాలు కలిశాయని, వాటిని తొలగించడం అంత సులువైన విషయం కాదని కేంద్ర భూగర్భ జలాల బోర్డు చైర్మన్ కేబీ బిశ్వాస్ తెలిపారు. గంగా జలాల ప్రక్షాళన ప్రధాన ఎజెండాగా పెట్టుకొని కూడా  ఏమీ చేయలేక సుప్రీంకోర్టు చేత చీవాట్లు తింటున్న కేంద్రం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోగలదో ఊహించవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement