6 నెలల్లో 12 కొత్త మోడళ్లు: హీరో | Hero to have 20 units, 12 million sales by 2020 | Sakshi
Sakshi News home page

6 నెలల్లో 12 కొత్త మోడళ్లు: హీరో

Aug 9 2013 1:28 AM | Updated on Sep 1 2017 9:44 PM

6 నెలల్లో 12 కొత్త మోడళ్లు: హీరో

6 నెలల్లో 12 కొత్త మోడళ్లు: హీరో

భారత ద్విచక్రవాహనాల దిగ్గజం హీరో మోటోకార్ప్ భారీ ప్రణాళికలకు సిద్ధం అవుతోంది. 2020 కల్లా రూ.60 వేల కోట్ల టర్నోవర్ సాధించడం లక్ష్యమని కంపెనీ ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ గురువారం చెప్పారు.

 గుర్గావ్: భారత ద్విచక్రవాహనాల దిగ్గజం హీరో మోటోకార్ప్ భారీ ప్రణాళికలకు సిద్ధం అవుతోంది. 2020 కల్లా రూ.60 వేల కోట్ల టర్నోవర్ సాధించడం లక్ష్యమని కంపెనీ ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ గురువారం చెప్పారు. ఈ లక్ష్య సాధన  కోసం 2020 కల్లా ప్రపంచవ్యాప్తంగా 20 ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని, 50 కొత్త మార్కెట్లకు విస్తరించనున్నామని వివరించారు. ఆర్నెల్లలో 12 కొత్త మోడళ్లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. 
 
 10 కోట్ల బైక్‌ల ఉత్పత్తిపై దృష్టి
 వచ్చే ఏడాదికల్లా మూడు ఖండాల్లో ఆరు అసెంబ్లింగ్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయనున్నామని పవన్ ముంజాల్ వివరించారు.  5 కోట్లవ బైక్‌ను ఇక్కడి ప్లాంట్‌లో ఉత్పత్తి చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 10 కోట్ల బైక్‌ల ఉత్పత్తిపై దృష్టిసారించామని పేర్కొన్నారు. ఇటీవలే  కెన్యాలో బైక్‌లను మార్కెట్లోకి విడుదల చేశామని, మరికొన్ని విదేశాల్లో కూడా తమ టూవీలర్లను విక్రయించనున్నామని వివరించారు. వచ్చే ఏడాది మార్చి కల్లా మరిన్ని టూవీలర్ల మోడళ్లను ఆఫ్రికా దేశాల్లో అందించనున్నామని పేర్కొన్నారు.
 
 పండుగలపైనే ఆశలన్నీ... 
 గత ఆర్థిక సంవత్సరంలో రూ.24 వేల కోట్ల టర్నోవర్ సాధించామని పేర్కొన్నారు. 2017 కల్లా విదేశాల్లో పదిలక్షల బైక్‌లను విక్రయించడం లక్ష్యమని, ఇది తమ మొత్తం అమ్మకాల్లో 10 శాతమని వివరించారు. 2020 కల్లా తమ టూవీలర్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.2 కోట్లకు చేరుకోగలదని పేర్కొన్నారు. ప్రస్తుతం తమకున్న మూడు ప్లాంట్ల(గుర్గావ్, దరుహెర, హరిద్వార్) మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 62 లక్షలని చెప్పారు.  
 
 వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా 12కు పైగా కొత్త మోడళ్లను అందించాలని యోచిస్తున్నామని వివరించారు. కొత్త టూవీలర్ల డిజైనింగ్‌లో తమ ఆర్‌అండ్‌డీ సెంటర్ ఎంతో ప్రగతి సాధించిందని వివరించారు. అమ్మకాలు మందగమనంగా ఉన్నప్పటికీ, పండుగల సీజన్‌లలో విక్రయాలు జోరుగా ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక నాలుగో ప్లాంట్‌ను నీమ్‌రాన(రాజస్థాన్)లోనూ, ఐదో ప్లాంట్‌ను గుజరాత్‌లోనూ ఏర్పాటు చేయనున్నామని కంపెనీ గత ఏడాదే ప్రకటించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement