డీఎంకే నుంచి 33 మందికి ఉద్వాసన
చెన్నై : డీఎంకే నుంచి 33 మంది నాయకులకు తాత్కాలికంగా ఉద్వాసన పలుకుతూ ఆ పార్టీ అధినేత ఎం కరుణానిధి నిర్ణయించారు. తమిళనాడులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో డీఎంకే డిపాజిట్లు గల్లంతయ్యాయి. పార్టీ పలు చోట్ల మూడో స్థానానికి దిగజారిపోవడం, ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గడాన్ని కరుణానిధి తీవ్రంగా పరిగణించారు. పార్టీలో పూర్తి స్థాయి ప్రక్షాళన లక్ష్యంగా ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ గత వారం కరుణానిధికి తన నివేదికను సమర్పించింది. దీని ఆధారంగా పార్టీ నాయకులపై కొరడా ఝుళిపించే పనిలో కరుణానిధి పడ్డారు. శనివారం పార్టీకి చెందిన ఐదు జిల్లాల కార్యదర్శులతో పాటుగా కొన్ని నగర, పంచాయతీ యూనియన్ల కార్యదర్శులు ఇన్చార్జ్లు మొత్తం 33 మందిని తాత్కాలికంగా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
వారంలోపు వివరణ ఇవ్వాలని, దాని ఆధారంగా శాశ్వత వేటు ఉంటుందన్న సంకేతాన్ని ఇచ్చారు. బహిష్కరణ వేటు పడ్డ వారిలో కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎస్ పళని మాణిక్యం, ఎంపీ కేపి రామలింగం ఉన్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు గాను తన పెద్దకుమారుడు అళగిరిని ఇప్పటికే కరుణానిధి బహిష్కరించిన విషయం తెలిసిందే.