అసెంబ్లీ ఎన్నికలపై ‘నోట్ల’ ప్రభావం | Demonetization effect in upcoming elections | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ ఎన్నికలపై ‘నోట్ల’ ప్రభావం

Nov 28 2016 5:44 PM | Updated on Sep 27 2018 9:08 PM

అసెంబ్లీ ఎన్నికలపై ‘నోట్ల’ ప్రభావం - Sakshi

అసెంబ్లీ ఎన్నికలపై ‘నోట్ల’ ప్రభావం

పెద్ద నోట్ల రద్దు.. ఏడాది మొదట్లో జరుగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏ విధమైన ప్రభావాన్ని చూపుతుంది?

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో కలిగే లాభ నష్టాల గురించి ఓ పక్క చర్చ జరుగుతుండగానే మరో పక్క వచ్చే ఏడాది మొదట్లో జరుగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ధన బలం, కండ బలం ప్రతిసారి ప్రధాన పాత్ర పోషిస్తాయన్నది అందరికి తెల్సిందే.

 ఎన్నికల ఖర్చుపై సాధారణంగా ఎన్నికల సంఘం నిఘా ఉంటుంది కనుక ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు ప్రచార వ్యూహం కోసం డబ్బులు ఖర్చు పెడతారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందన్నది తెల్సిందే. యూపీ, పంజాబ్ ఎన్నికలకు చాలా ముందే మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో ఇతర పార్టీలపై ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ రెండు రాష్ట్రాల్లో చాలా పార్టీలు అభ్యర్థుల దగ్గర డబ్బులు తీసుకొని టిక్కెట్లు ఇస్తాయి. అదంతా సాధారణంగా బ్లాక్ మనీ రూపంలోనే ఉంటుంది.

 అభ్యర్థిగా ఖరారైన వ్యక్తి పలుకుబడి కలిగిన స్థానిక నాయకులను తనవైపు తిప్పుకోవాల్సి ఉంటుంది. వారు మరో పార్టీలోకి ఫిరాయించకుండా డబ్బులతోని వారికి ఎరవేస్తారు. వారి ద్వారా కింది కార్యకర్తస్థాయి వరకు తన కోసం పనిచేసేందుకు కూడా నల్లడబ్బునే ఖర్చు పెడతారు. ఆ తర్వాత సభలు, సమావేశాల నిర్వహణకు, ప్రచార సామాగ్రి ముద్రణకు భారీగా ఖర్చు పెడతారు. పోలింగ్ రోజున ఓటర్లను తరలించేందుకు, వారిని ప్రభావితం చేసేందుకు కూడా డబ్బును నీళ్లలా ఖర్చు పెడతారు. ఇందులో ఎన్నికల ఖర్చు పరిధిలోకి వచ్చే సభలు, సమావేశాలు, ముద్రణా ఖర్చులకు మినహా మిగతా వాటన్నింటికీ అభ్యర్థులు నల్లడబ్బునే ఖర్చు పెడతారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో ఈసారి పలు పార్టీలకు నల్లడబ్బును ఖర్చు పెట్టేందుకు అవకాశం లేదు.

 బీజేపీకి ఈ కష్టాలు లేవు. డబ్బులు తీసుకొని అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అధికారంలోవున్న జాతీయ పార్టీ అవడం, అభ్యర్థుల ఎంపికలో ఆరెస్సెస్ లాంటి సంస్థల ప్రభావం ఉండడం, పార్టీ ప్రచారం కోసం స్వచ్ఛందంగా పనిచేసేందుకు ఆరెస్సెస్, పార్టీ కార్యకర్తలు ఉండడం కారణం. స్థానిక నాయకత్వంపై ఆధారపడకుండా కేంద్రంలోని మోదీ ప్రతిష్ట మేరకు ఓట్లేసే అవకాశం ఉండడం తదితర కారణాల వల్ల బీజేపీ నల్లడబ్బును ఖర్చు పెట్టాల్సిన అవసరం అంతగా లేదు. పైగా అవినీతికి, నల్లడబ్బుకు పోరాడుతున్న ఏకాకి పార్టీ తమదేనంటూ చెప్పుకోవడం ద్వారా, దేశభక్తి నినాదాన్ని ప్రచారం చేయడం ద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందే అవకాశం కూడా ఉంది.

 పెద్ద నోట్ల రద్దు వ్యవహారం గురించి బీజేపీ నేతలకు ముందే తెలుసుకనుక వారు ముందే సర్దుకున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం నిజమే అయితే అది కూడా బీజేపీకి అదనంగా కలిసొచ్చే అంశం. అయితే పెద్ద నోట్ల రద్దుతో నేడు అష్టకష్టాలు పడుతున్న ప్రజల్లో మోదీ పట్ల ఎంత కోపం ఉందో, ఆ కోపం అసెంబ్లీ ఎన్నికల నాటికి చల్లారుతుందా, లేదా ? వారు ఎవరికి ఓటు వేసే అవకాశం ఉంటుందో ఇప్పుడే అంచనా వేయలేం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement