బాహాటంగా బాబు కుమ్మక్కు
రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఏనాడో లేఖ ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు.. విభజన సజావుగా సాగటానికి కాంగ్రెస్ పార్టీకి తన వంతు సాయం అందిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ను వీడి బయటకొచ్చిన తర్వాత ఆయనపై హైకోర్టులో కేసులు వేయడం మొదలుకుని నాలుగేళ్లుగా అన్ని విషయాల్లోనూ కాంగ్రెస్కు చంద్రబాబు పూర్తిగా సహకరిస్తున్న వైనం బహిరంగ రహస్యమే. విభజన విషయంలోనూ సీఎం కిరణ్కుమార్రెడ్డితో కలసి.. ఒకవైపు సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తూ.. మరోవైపు విభజన ప్రక్రియ సజావుగా పూర్తి చేసేలా కేంద్రానికి అండగా నిలుస్తున్నారు.
* రాష్ట్రాన్ని విభజించాలంటూ సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించిన జూలై 30 నుంచి ఇప్పటిదాకా సమైక్యం గురించి చంద్రబాబు ఏ రోజూ ఒక్క మాటైనా మాట్లాడలేదు.
* సీడబ్ల్యూసీ విభజన నిర్ణయం ప్రకటించిన రోజునే ‘సీమాంధ్ర రాజధాని నిర్మాణం కోసం నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు కావాలి’ అని డిమాండ్ చేస్తూ విభజనకు బాహాటంగా మద్దతు తెలిపారు.
* కానీ సీమాంధ్రలో సమైక్య ఉద్యమం చెలరేగటంతో చంద్రబాబు వ్యూహాత్మకంగా ‘సమస్యలను పట్టించుకోకుండా విభజన చేయడమేంటి?’ అంటూ విభజనకు అనుకూలంగానే కొత్త వాదనను తెరపైకి తెచ్చారు.
* అక్టోబర్ రెండో వారంలో ఢిల్లీలో చంద్రబాబు చేపట్టిన నిరాహార దీక్ష సందర్భంగా కూడా సమైక్యమన్న పదం ఉచ్చరించడానికే ఇష్టపడలేదు.
* ఢిల్లీలో బాబు దీక్ష మొదలుపెట్టిన రోజు నుంచే కేంద్రం మళ్లీ విభజన చర్యలను వేగవంతం చేసింది. బాబు దీక్ష తొలి రోజునే విభజన విధివిధానాలను సూచించటానికి కేంద్ర మంత్రుల బృందాన్ని నియమించింది.
* సరిగ్గా అదే సమయంలో రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలతో మాట్లాడిన కిరణ్.. ‘అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడిస్తాం’ అనే మాయ హామీలతో ఆందోళన విరమించేలా ఒత్తిడి తెచ్చారు.
* ఆ తర్వాత కూడా సీమాంధ్రకు న్యాయం చేయాలంటున్నారు తప్ప సమైక్యంగా ఉంచాలని ఎక్కడా చెప్పలేదు. పైగా ఇటీవల విలేకరుల సమావేశంలో ‘మేం విభజనకు వ్యతిరేకం’ కాదు అని చంద్రబాబు ప్రకటించారు. కానీ విభజిస్తున్న తీరుకే తాము అభ్యంతరం చెప్తున్నామన్నారు. ఇరు ప్రాంతాల వారితో చర్చించాకే విభజన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
సంబంధిత వార్తలు