
హెలికాప్టర్ ఎక్కుతూ జారిపడ్డ జైట్లీ
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ప్రమాదం తప్పింది.
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ప్రమాదం తప్పింది. ఆదివారం ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఆయన హెలికాప్టర్ ఎక్కేక్రమంలో కాలు జారి పడ్డారు. సిబ్బంది వెంటనే ఆయనకు సపర్యలు చేపట్టారు. ఈ ఘటనలో జైట్లీకి చిన్న గాయమైందని, ఎలాంటి ప్రమాదం లేదని తెలుస్తోంది.
జైట్లీ అదే హెలికాప్టర్లో హరిద్వార్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. యోగా గురు బాబా రాందేవ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు జైట్లీ హరిద్వార్ వెళ్లారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత జైట్లీ సిబ్బంది సహాయం లేకుండా విమానాశ్రయం నుంచి బయటకు నడుచుకుంటూ వస్తున్నప్పటి ఫొటోలు జాతీయ మీడియాలో వచ్చాయి.