నేడు జెడ్పీ ప్రత్యేక సమావేశం | Sakshi
Sakshi News home page

నేడు జెడ్పీ ప్రత్యేక సమావేశం

Published Sun, Dec 21 2014 10:32 PM

నేడు జెడ్పీ ప్రత్యేక సమావేశం

సాక్షి, సంగారెడ్డి: జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం సోమవారం జరగనుంది. సమావేశంలోజిల్లా మంత్రి హరీష్‌రావు, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హాజరుకానున్నారు. సమావేశంలో మిషన్ కాకతీయ, వ్యవసాయం, ఆహారభద్రత కార్డుల పంపిణీపై మంత్రులు సమీక్ష జరపనున్నారు. కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, జెడ్పీటీసీలు, తహశీల్దార్‌లు పాల్గొననున్నారు.

ఈ సమావేశం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సమీక్షా సమావేశంలో భాగంగా  నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు జిల్లాలో ‘మిషన్ కాకతీయ’ పనులపై సమీక్షి ంచనున్నారు. మిషన్ కాకతీయకు జిల్లాలో తొలి విడతగా ఎంపిక చేసిన చెరువులు, ప్రతిపాదనల రూపకల్పన, పనుల అమలుకు తీసుకుంటున్న చర్యలను మంత్రి హరీష్ అధికారులతో చర్చించి పలు సూచనలు చేయనున్నారు.

వ్యవసాయం, అనుబంధ శాఖలకు సంబంధించి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమీక్షిస్తారు. జిల్లాలో పంటల సాగు, పంటరుణాలు, నష్టపరిహారం పంపిణీ తదితర అంశాల పురోగతిని ఆయన సమీక్షిస్తారు. ఆహారభద్రత కార్డుల పంపిణీ ఇతర ఆర్థిక అంశాలపై మంత్రి ఈటెల రాజేందర్ అధికారులతో మాట్లాడతారు. జిల్లా పరిషత్, నీటిపారుదల శాఖ అధికారులు సమీక్షా సమావేశానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు.

Advertisement
Advertisement