ప్రతిపాదనలపై రుసరుస

ప్రతిపాదనలపై రుసరుస - Sakshi


‘మన జిల్లా-మన ప్రణాళిక’ ఖరారే ప్రధానంగా గురువారం చేపట్టిన జిల్లా పరిషత్ తొలి సమావేశం గరంగరంగా సాగింది. సమస్యల ప్రస్తావన, ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రతిపక్ష సభ్యుల వాగ్బాణాలు వాతావరణాన్ని వేడెక్కించాయి. తమతో చర్చించకుండానే పనుల ప్రతిపాదనలను రూపొందించడంపై విపక్ష కాంగ్రెస్ జెడ్పీటీసీల రుసరుసలాడగా.. కలెక్టర్ ‘కూల్’గా సమాధానమిచ్చి చల్లబరిచారు. వర్షాభావ పరిస్థితులను ఏకరువు పెడుతూ టీడీపీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ‘కరువు జిల్లా’గా ప్రకటించాలని తీర్మానం చేయాలని పట్టుబట్టడం... దానిని సభ ఆమోదించడం చకచకా సాగిపోయాయి. తొలిసారి సమావేశ మందిరంలోకి అడుగిడిన కొత్త సభ్యులు స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ తడబాట్లతో సాగించిన ప్రసంగాలు ఆసక్తి కలిగించాయి.

- వాడివేడిగా సాగిన జిల్లా పరిషత్ తొలి భేటీ

- సమస్యలు ఏకరువు పెట్టిన కొత్త సభ్యులు

- ‘కరువు జిల్లా’గా తీర్మానం

సాక్షి, రంగారెడ్డి జిల్లా :
జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం గురువారం గందరగోళంగా మారింది. తమ ప్రమేయం లేకుండానే ప్రణాళిక తయారు చేయడంపై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వర్గానికి చెందిన వారితో ప్రణాళిక తయారు చేయించి సభలో ఆమోదించాలనడం సరికాదంటూ కాంగ్రెస్ జెడ్పీటీసీలు మండిపడ్డారు. సభ్యుల సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకొని ప్రణాళిక తయారు చేస్తేనే.. పక్కాగా ఉంటుందని, సొంత ఆలోచనలు మానుకోవాలని సూచించారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పి.సునీతారెడ్డి అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి, కలెక్టర్ ఎన్.శ్రీధర్ హాజరయ్యారు. ‘మన జిల్లా-మన ప్రణాళిక’ నేపథ్యంలో చేపట్టిన ఈ సమావేశం.. ప్రజా సమస్యలపై కాకుండా పార్టీలపై విమర్శలు, ప్రతివిమర్శలకు దారితీసింది.

 

కనీస సమాచారం ఇవ్వరా?

చైర్‌పర్సన్ సునీతారెడ్డి సమావేశం ప్రధాన ఎజెండాను ప్రస్తావిస్తూ.. రూ.40 కోట్లతో రూపొందించిన ‘జిల్లా ప్రణాళిక’లో లోటుపాట్లను వివరించి సవరణలు సూచించాలని సభ్యులను కోరారు. ఇంతలో కాంగ్రెస్ జెడ్పీటీసీలు ఏనుగు జంగారెడ్డి, బి.మహిపాల్ కల్పించుకుంటూ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా ఏవిధంగా ప్రణాళిక తయారు చేస్తారంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రణాళికపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ వాగ్వాదానికి దిగారు.



టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలవుతున్నా ఏ సమస్యకూ పరిష్కారాన్ని చూపలేదని పేర్కొన్నారు. దీంతో మంత్రి మహేందర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం అభివృద్ధి చేశారంటూ ఎదురు ప్రశ్నించారు. దీంతో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. ఇంతలో కలెక్టర్ శ్రీధర్ కల్పించుకుని ప్రణాళికపై మాట్లాడాలని, సభ్యుల సందేహాలకు తాను ప్రత్యేకంగా సమాధానం ఇస్తానని పేర్కొనడంతో ప్రశాంత వాతావరణం నెలకొంది.

 

సమస్యల ప్రస్తావన

కొత్తగా ఎన్నికైన పాలకవర్గం తొలి భేటీ కావడంతో పలువురు సభ్యులు సమస్యల ప్రస్తావనలో కొంత తడబడ్డారు. సమావేశంలో అన్ని మండలాల ప్రజాప్రతినిధులకు ప్రాధా న్యం ఇచ్చారు. దీంతో దాదాపు అందరు జెడ్పీటీసీలు, ఎంపీపీలు తమ పరిధి సమస్యల్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. సభ్యులు పేర్కొన్న సమస్యల్ని నోట్ చేసుకున్న అనంతరం వాటిని మండల, జిల్లాస్థాయి ప్రణాళికలో తగిన ప్రాధాన్యం ఇస్తామని చైర్‌పర్సన్ సునీతారెడ్డి హామీ ఇచ్చారు.

 

కరువుపై తీర్మానం..

జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంపై దృష్టిసారించి ప్రత్యేక చర్చ జరపాలంటూ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, యాదయ్య, తీగల కృష్టారెడ్డి సభలో ప్రస్తావిం చారు. గతేడాది పంట నష్టపరిహారం సైతం అందలేదని, రైతులు పలురకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు లేవనెత్తారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ జిల్లాలోని తాజా పరిస్థితిని వివరించాలని జేడీఏ విజయ్‌కుమార్‌ను ఆదేశిం చారు. జిల్లాలో వర్షపాతం, సాగు వివరాలు ప్రకటించగా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.



క్షేత్రస్థాయిలో పరిస్థితులకు, అధికారుల నివేదికలకు పొంతనలేదని, వర్షపాత వివరాలు తీసుకోవడంలో ఆయా శాఖలు పూర్తిగా విఫలమవుతున్నాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నష్టానికి సంబంధించిన సరైన అంచనాలతో నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి ఇవ్వాలని ఎమ్మెల్యే యాదయ్య సూచించారు. జిల్లాలోని పరిస్థితుల దృష్ట్యా కరువు ప్రాంతంగా ప్రకటించాలంటూ సభ్యులు ఈ సందర్భంగా తీర్మానం చేశారు.  సమావేశంలో ఎమ్మెల్సీలు నరేందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సంజీవరావు, ప్రకాష్‌గౌడ్, కేఎం వివేక్, సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.

 

‘ప్రణాళిక’పై స్పష్టత ఏదీ? ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి

‘మన జిల్లా- మన ప్రణాళిక’లో భాగంగా జిల్లా యంత్రాంగం తయారుచేసిన ప్రణాళికపై స్పష్టత ఇవ్వాలంటూ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రణాళికలో గ్రామానికి మూడు, మండలానికి పది పనుల చొప్పున ప్రణాళికలో పేర్కొన్నారని, మొత్తంగా వేల కోట్ల రూపాయలతో కూడిన ఈ ప్రణాళిక కేవలం ఏడాది కాలానికా, లేక ఐదేళ్ల ప్రణాళికా అంటూ ప్రశ్నించారు. నిధుల విడుదలపైనా స్పష్టతలేదని, మొత్తంగా ఈ ప్రణాళికకు సంబంధించి నెలకొన్న సందేహాలపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ సభ ముగిసే వరకు అటు అధికార యంత్రాంగం, ఇటు జెడ్పీ పాలకవర్గం స్పష్టత ఇవ్వకపోవడం కొసమెరుపు.

 

ఎత్తిపోతల పథకాన్ని ప్రణాళికలో చేర్చాలి: ఎమ్మెల్యే టీఆర్‌ఆర్

 జిల్లాకు కీలకం కానున్న పాలమూరు ఎత్తిపోతల పథకానికి ప్రత్యేకంగా కొంత బడ్జెట్‌ను జిల్లా ప్రణాళికలో పొందుపర్చాలని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి సూచించారు. కనిష్టంగా మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించాల న్నారు. అదేవిధంగా అనంతగిరిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని, హైదరాబాద్-  బీజాపూర్ రోడ్డును నాలుగు లైన్లతో ఏర్పాటు చేయాలన్నారు. ఈ అంశాలపై సీఎం కేసీఆర్‌ను కలిసి వివరించే ఏర్పాటు చేయాలని ఆయన కోరగా.. మంత్రి మహేందర్‌రెడ్డి స్పందిస్తూ త్వరలో జిల్లాలోని ప్రజాప్రతినిధులను సీఎం వద్దకు తీసుకెళ్లి భేటీ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top