బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
శివ్వంపేట (మెదక్): బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం.. మెదక్ జిల్లా కొల్చారం మండలానికి చెందిన బాలిక (16) శివ్వంపేట మండలం పాంబండ గ్రామంలోని తన సోదరి ఇంటికి మూడు రోజుల క్రితం వచ్చింది. సోమవారం గ్రామ శివారుకు వెళ్లగా, అదే గ్రామానికి చెందిన యువకులు చింతగారి బాల్రాజ్, తలారి ప్రభాకర్ ఆమెను అటకాయించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అఘాయిత్యానికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.
అనంతరం గ్రామంలోకి వచ్చిన బాలిక జరిగిన విషయం కుటుంబ సభ్యులకు తెలిపింది. పాంబండ గ్రామ పెద్దలు సదరు యువకులను గుర్తించి పిలిపించారు. ఒకే కులానికి చెందినందున బాలికను పెళ్లి చేసుకుంటానని ఇద్దరు యువకుల్లో ఒకరు అంగీకరించారు. అలా చెప్పిన యువకుడు, వారి కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి చెప్పా పెట్టకుండా గ్రామం నుంచి వెళ్లిపోయారు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు బుధవారం శివ్వంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికపై లైంగికదాడికి పాల్పడిన యువకులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తూప్రాన్ సీఐ రమేష్బాబు తెలిపారు.