
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాలను వినియోగిస్తూ తెలంగాణ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నియంత్రణ అంశంపై గోదావరి బోర్డు ముందు తన వాదనను గట్టిగా వినిపించేలా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చేనెల రెండోవారంలో సమావేశం ఉంటుందని బోర్డు స్పష్టం చేయడం, అందులో వర్కింగ్ మాన్యువల్ అంశాన్ని ప్రధానాంశంగా చేర్చడంతో దీనిపై ఎలా సమాధానమివ్వాలనే దాన్ని ఇప్పటికే డ్రాఫ్ట్ నోట్ సిద్ధంచేసింది. గోదావరి బోర్డుకు వర్కింగ్ మాన్యువల్ అక్కర్లేదని స్పష్టం చేయాలని నిర్ణయించింది.
గోదావరిలోని ప్రాజెక్టులకింద ఇరురాష్ట్రాలు నీటిని కానీ, విద్యుత్నుగానీ పంచుకోనప్పుడు వాటిని ఉమ్మడి ప్రాజెక్టులుగా భావించలేమని, వాటిని బోర్డు పరిధిలోకి తేవాల్సిన అవసరం లేదని తెలంగాణ మొదటి నుంచీ చెబుతోంది. అయితే దీనికి విరుద్ధ వాదనలు వినిపిస్తున్న ఏపీ, ప్రాజెక్టులను నియంత్రించాల్సిందేనంటూ కేంద్ర జల వనరుల శాఖ, కేంద్ర జల సంఘం, గోదావరి బోర్డులపై ఒత్తిడి తెస్తోంది.
దీనికి తలొగ్గిన బోర్డు తెలంగాణకు చెందిన శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, లోయర్ మానేరు, కడెం, ఎల్లంపల్లిలు, ఏపీకి చెందిన సర్ అర్థర్కాటన్ బ్యారేజీలు తమ పరిధిలోకి తెచ్చుకునే యత్నాలు చేస్తోంది. ఈ వివాదమే కొనసాగుతుండగా, తాజాగా ఎస్సారెస్పీ స్టేజ్ 1, 2, అలీసాగర్–గుత్ప, సదర్మఠ్, దేవాదుల, తుపాకులగూడెం, ప్రాణహిత–చేవెళ్ల, కాళేశ్వరంలను బోర్డు నియంత్రణలో ఉంచాలని కోరుతోంది. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న తెలంగాణ... ప్రాజెక్టులపై బోర్డు పర్యవేక్షణ సరిపోతుందని, నియంత్రణ అక్కర్లేదని గట్టిగా వాదించాలని భావిస్తోంది.