ఢిల్లీ తెలంగాణ భవన్లో శ్రీ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు
ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: బోనాల పండుగ భక్తి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో లాల్ దర్వాజా బోనాల మహోత్సవాలు మంగళవారం రెండో రోజు ఘనంగా కొనసాగాయి. ఈ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై శ్రీ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘దేశ రాజధానిలో బోనాలను ఘనంగా నిర్వహించడం ద్వారా తెలంగాణ ప్రత్యేక సాంస్కృతిక వైభవం దేశవ్యాప్తంగా పరిచయమవుతోంద’’న్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎ.పి. జితేందర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఈ ఉత్సవాలు ఢిల్లీలోని తెలుగువారికి మాతృభూమితో అనుబంధాన్ని పెంచుతున్నాయ’’న్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


