సాక్షి, రంగారెడ్డి జిల్లా : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో కాంట్రాక్టు కార్మికుల సమ్మె మొదలైంది. గురువారం నుంచి కాంట్రాక్టు ఉద్యోగులంతా విధులు బహిష్కరించి ఉద్యమబాట పట్టారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో కాంట్రాక్టు కార్మికుల సమ్మె మొదలైంది. గురువారం నుంచి కాంట్రాక్టు ఉద్యోగులంతా విధులు బహిష్కరించి ఉద్యమబాట పట్టారు. తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరించడంతోపాటు వేతనాలు పెంచాలనే డిమాండ్తో వారంతా ఉద్యమబాట పట్టారు. అందులో భాగంగా గురువారం జిల్లా నీటియాజమాన్య సంస్థ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అదేవిధంగా మండల స్థాయిలోనూ ఉద్యోగుల వారి కార్యాలయాల ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ నినాదాలు చేశారు.
కలెక్టరేట్లోని డ్వామా కార్యాలయం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో ఈజీఎస్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘాల ఐక్య కార్యచరణ సమితి ప్రతినిధులు రాజశేఖర్, రవీందర్రెడ్డి, హైమద్, వెంకటేశ్వర్, తిరుపతాచారి తదితరులు మాట్లాడుతూ 48రోజుల క్రితమే తమ డిమాండ్లు పేర్కొంటూ ప్రభుత్వానికి వినతి అందజేశామన్నారు. కానీ ఇప్పటివరకు వాటిపై ఏమాత్రం స్పందించకపోవడం శోచనీయమని, తమ డిమాండ్లు పరిష్కరించేవరకు ఉద్యమాన్ని ఆపేదిలేదన్నారు.
త్వరలో అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులంతా సమ్మెలోకి దిగుతారని, దీంతో పాలన స్తంభించిపోనుందన్నారు. ఆ పరిస్థితి తలెత్తకముందే ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.