‘కాంగ్రెస్, బీజేపీని ఓడించడమే మా లక్ష్యం’
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజల అభిష్టం మేరకు టీఆర్ఎస్లో చేరానని ఆ పార్టీ ఖమ్మం లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు వివరించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తనపాత్ర ఎంతో ఉందని, బిల్లుపై తొలిసంతకం తానే చేసినట్లు ఆయన గుర్తుచేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను చూసి టీఆర్ఎస్లో చేరాని చెప్పారు. ఆ పథకాలే తనను ఎంపీగా గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్నబయ్యారం స్టీల్ ప్లాంట్, కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు.
ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ మద్దతు కోరానని, తన తరఫున ప్రచారం చేస్తానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. రేపటి నుంచి ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పార్టీ కార్యకర్తల మద్దతు తనకు సంపూర్ణంగా లభిస్తోందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఓడించడమే టీఆర్ఎస్ లక్ష్యమని నామా స్పష్టం చేశారు.