ఏప్రిల్ ఫూల్ పేరిట తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు
స్టేషన్ఘన్పూర్: ఏప్రిల్ ఒకటిన సరదాగా చేసే ఫూల్ సందర్భంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తప్పుడు ప్రచారం చేయొద్దని సీఐ రాజిరెడ్డి ప్రజలు, ముఖ్యంగా యువతకు సూచించారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోషల్ మీడియాలో ఎవరైనా పరిధి దాటితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. పోస్టులు చేసేవారితో పాటు ఆయా గ్రూపుల అడ్మిన్లపై చర్యలు ఉంటాయని తెలిపారు. తప్పుడు పోస్టులు పెట్టి అనవసరంగా కేసుల్లో ఇరుక్కొని జీవితాలు పాడు చేసకోవద్దన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి కోవిడ్ –19 బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామన్నారు.