సవారీ కోసం గుర్రం వద్దకు వెళ్లిన బాలుడు
వెనుక నుంచి తన్నగా తీవ్రగాయాలు.. చికిత్స పొందుతూ మృతి
ఏకశిల పార్కు ఎదుట బాలుడి బంధువుల ధర్నా
వరంగల్: సరదా విషాదమైంది. సవారీ చేసేందుకు కట్టేసిన గుర్రం వద్దకు వెళ్లిన బాలుడిని గుర్రం తన్నింది. దీంతో బాలుడికి తీవ్రగా గాయాలు కావడంతో కుటుంబీకులు హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో గుర్రం యజమాని నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని సోమవారం సాయంత్రం ఖిలా వరంగల్ ఏకశి చిల్ర్డన్పార్క్ గేట్ ఎదుట నిర్వహించారు.
గుర్రం యజమాని, పార్కు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిల్స్కాలనీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గుర్రం యజమానిపై కేసు నమోదు చేయడంతోపాటు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మృతుడి బంధువుల ధర్నా విరమించారు. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. వరంగల్ శివనగర్ ఏసీరెడ్డినగర్కు చెందిన ఆటో డ్రైవర్ మిర్యాల కృష్ణ కుమారుడు గౌతం(12) ఈనెల 10వ తేదీన ఉదయం బాబాయి రాజేందర్తో కలిసి ఏకశిల చిల్ర్డన్ పార్క్కు వెళ్లాడు.
పార్కులో సవారీ చేసేందుకు సోదరుడు మహేశ్తో కలిసి గుర్రం వద్దకు వెళ్లాడు. అంతలోనే గుర్రం వెనుక నుంచి తన్నడంతో గౌతంకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గౌతంను రాజేందర్ హుటాహుటిన ఎంజీఎం తరలించారు. వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు విలపించారు. కాగా, శివనగర్లోని ఏసీరెడ్డి నగర్ బాలుడి అంత్యక్రియలు నిర్వహించగా కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్, పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు తరలొచ్చి గౌతం మృతదేహం వద్ద నివాళులరి్పంచారు.


