హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి ప్రమాణం

Vijaysen Reddys Oath As High Court Judge - Sakshi

ప్రమాణం చేయించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌

14కు చేరిన హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ బొల్లంపల్లి విజయ్‌సేన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ ప్రమాణం చేయించారు. న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమానికి అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎ.నర్సింహారెడ్డి, హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, న్యాయాధికారులు, జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి కుటుంబసభ్యులు హాజరయ్యారు.

కరోనా వైరస్‌ నేపథ్యంలో వీరంతా మాస్క్‌లు ధరించి భౌతిక దూరం పాటిస్తూ కోర్టు హాల్లోకి ప్రవేశించారు. తొలుత హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి నియామక ఉత్తర్వులను చదివి వినిపించారు. జస్టిస్‌ విజయసేన్‌ రెడ్డి 12 ఏళ్లపాటు న్యాయమూర్తిగా కొనసాగే సర్వీస్‌ ఉంది. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి ప్రమాణస్వీకారాన్ని యూట్యూబ్‌ ఆన్‌లైన్‌ ద్వారా వీక్షించే సౌకర్యం కల్పించడంతో వెయ్యి మంది ప్రత్యక్షంగా చూశారు. ప్రధాన న్యాయమూర్తితో కలిపి హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 14కు చేరింది. మరో పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చదవండి: కామన్‌ పేపర్‌.. ఎక్కువ చాయిస్‌లు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top