యూఎస్‌లోని విదేశీ విద్యార్థుల్లో 16 శాతం భారతీయులే | US Education Fair in Taj Krishna Hotel - 2017 | Sakshi
Sakshi News home page

యూఎస్‌లోని విదేశీ విద్యార్థుల్లో 16 శాతం భారతీయులే

Nov 2 2017 6:00 AM | Updated on Aug 24 2018 8:18 PM

US Education Fair in Taj Krishna Hotel - 2017 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని విదేశీ విద్యార్థుల్లో 16 శాతం భారతీయులే ఉన్నారని యూఎస్‌ కాన్సులేట్‌ హైదరాబాద్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరీన్‌ హడ్డా పేర్కొన్నారు. విదేశీ విద్యార్థుల్లో మొదటిస్థానంలో చైనా, రెండో స్థానంలో భారత్‌ ఉందన్నారు. తాజ్‌ కృష్ణా హోటల్‌లో యూఎస్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌–2017ను బుధవారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. యూఎస్‌లో ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలున్నాయని, వీటితోపాటు మరో 4,500 యూనివర్సిటీలు/కాలేజీలు వివిధ కోర్సులు నిర్వహిస్తున్నాయని చెప్పారు.

2015–16 విద్యాసంవత్సరంలో లక్షా 66 వేల మంది భారతీయ విద్యార్థులు ప్రవేశాలు పొందారని, వీరిలో 60 శాతం పీజీ, ఎంఎస్‌ కోర్సుల్లో చేరారని తెలిపారు. యూఎస్‌ వర్సిటీల్లో ప్రవేశాలపై అవగాహన కల్పించేందుకు జాతీయ స్థాయిలో ఎనిమిది పట్టణాల్లో ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ప్రారంభిం చినట్లు తెలిపారు. యూఎస్‌ వర్సిటీల్లో ప్రవేశాలకు భారత్‌ నుంచి పురుషులే అధికంగా వస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల సంఖ్య పెరగాల్సి ఉందని అన్నారు. గతేడాది 600 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా... ఈసారి వెయ్యి మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement