కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల శివారులో ఉన్న శ్మశాన వాటిక రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టింది
కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల శివారులో ఉన్న శ్మశాన వాటిక రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టింది. శ్మశానానికి చెందిన భూమి విషయంలో వివాదం తీవ్ర రూపం దాల్చింది. శ్మశాన వాటికకు ఇచ్చిన స్థలం తమ గ్రామానికి చెందిందని మోతే గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో జగిత్యాల- మోతే గ్రామస్థుల మధ్య వివాదం రోజు రోజుకూ ముదురుతోంది.
ఈ క్రమంలో గురువారం రెండు గ్రామాలకు చెందిన వ్యక్తులు ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడం కోసం శ్మశాన వాటికలో సమావేశమయ్యారు. చర్చల మధ్యలో ఇరు వర్గాలు దూషణలకు దిగడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శ్మశానం పరిధిలో మోతే గ్రామస్తులు తవ్విన బావిని జగిత్యాల వాసులు పూడ్చేయడంతో వివాదం ముదిరినట్లు తెలుస్తోంది. రెండు గ్రామాల మధ్య ఉద్రిక్తతలు తగ్గేలా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.