నాట్య మయూరాలను ఆదుకోరూ.. | two talented girls from telangana lost their fee reimbursement because of government negligence | Sakshi
Sakshi News home page

నాట్య మయూరాలను ఆదుకోరూ..

Feb 2 2018 4:34 PM | Updated on Oct 2 2018 5:51 PM

two talented girls from telangana lost their fee reimbursement because of government negligence - Sakshi

కళాప్రదర్శనకు ముస్తాబైన సుజాత, లలిత(ఫైల్‌) , ఇంటికి చేరిన సుజాత, లలిత

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల) : గిరిపుత్రికల కళలకు ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌సాయం అందడం లేదు. ఉజ్వల భవిష్యత్‌ ఉన్న నాట్యమయూరాలు చదువుసగంలోనే ఆపి ఇంటిదారిపట్టారు. ఫీజులు చెల్లించేందుకు ఆర్థిక స్థోమత లేక మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులు సంగీతవిద్యకు దూరవుతున్నారు. వీర్నపల్లి మండల కేంద్రం పరిధి గోల్యాతండాకు చెందిన బట్టు సుజాత, బట్టు లలిత స్థానికంగా డిగ్రీ చదివారు. పీజీ కోసం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో(ఎస్‌వీ) ఫార్ఫమెన్స్‌ ఆర్ట్స్‌లో సంగీతవిద్యను అభ్యసిస్తున్నారు. రెండేళ్ల ఈ కోర్సును పూర్తి చేయాల్సి ఉండగా మొదటి సంవత్సరం పూర్తయింది. సంవత్సరం పాటు వీరికి ప్రభుత్వ పరంగా అందాల్సిన రియింబర్స్‌మెంట్‌ అక్కడి ప్రభుత్వం వర్తింపజేయలేదు. దీంతో యూనివర్సిటీ వారు ఏడాదికి రూ.20వేల చొప్పున ఒక్కొక్కరు ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేశారు. ఈ ఫీజు కట్టలేని నిరుపేద కుటుంబాలకు చెందిన గిరిజన బాలికలు ఇంటికి వచ్చారు.  

ప్రైవేట్‌ హాస్టల్‌లో ఖర్చుల మోత
ఒకవైపు చదువుకోవడానికి యూనివర్సిటీలో ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతూనే మరోవైపు ప్రైవేట్‌ హాస్టల్‌లో నెలకు రూ.2వేల మెస్‌బిల్లుతో పాటు పరీక్షల ఫీజు, పుస్తకాలు, నాట్యం, పాటలు, ఇతర సంగీత వి ద్య కోసం అధనంగా నెలకు రూ.5వేల చొప్పున ఖర్చు చేస్తూ ఏడాది పాటు నెట్టుకొచ్చారు. తిరుపతిలో యూ నివర్సిటీ తరఫున నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో ఈ విద్యార్థినులు తమ ప్రతిభ కనబర్చారు. ప్రతిభకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం లభించడం లేదని ఆ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

చదివించే స్థోమత లేని వ్యవసాయ కుటుంబాలు  
ఆడపిల్లలను దూరంగా ఉంచి వారికి సంగీతవిద్యనందించే స్థితిలో తల్లిదండ్రులు లేరు. కూలీ, వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉన్నంతలో వారికి హాస్టల్‌ ఫీజులు చెల్లించేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి. దీంతో తమ పిల్లలను రెండోసంవత్సరం చదివించలేక పీజీ విద్యను మధ్యలోనే ఆపివేసి ఇంటికి రప్పించుకున్నారు. తమతోపాటే తమ పిల్లలు కూడా కూలీ నాలీ పనులు చేస్తూ ఇంటివద్ద ఉంటారని తల్లిదండ్రులు బట్టు హరిచంద్, హింగవ్వ, బట్టు భూమయ్య, వీరవ్వ ఆవేదన వ్యక్తం చేశారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement