తినే పదార్థం అనుకుని పురుగు మందు తాగి..

Two students killed with Pesticides - Sakshi

ఇద్దరు విద్యార్థుల మృతి

హుస్నాబాద్‌ రూరల్‌: పంటలకు వాడే పురుగు మందు ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంది. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లి పంచాయతీ పరిధిలోని పిట్టలగూడెంలో బుధవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న తుమ్మల భాస్కర్‌ (12), కాలీయ రవీందర్‌ (11) అనే విద్యార్థులు సాయంత్రం పాఠశాల వదిలేసిన తర్వాత ఇంటికి వస్తున్న సమయంలో సమీపంలో ఉన్న పత్తి చేనుకు వెళ్లారు. వారికి అక్కడ కవర్‌లో కట్టిన పురుగు మందు బాటిల్స్‌ కనిపించాయి.

వాటిలో ఉన్నది తినే పదార్థం అనుకొని పిల్లలిద్దరూ బాటిళ్లలో ఉన్న ద్రవం తాగి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన చిన్నారులు కళ్లు తిరిగిపడి పోవడంతో కుటుంబ సభ్యులు ఇద్దరినీ చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఒకరు మరణించగా మరొకరికి విషమంగా ఉందని వైద్యులు సిద్దిపేటకు పంపించారు. సిద్దిపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరో విద్యార్థి కూడా మరణించాడు. ఇద్దరు పిల్లలు మరణించడంతో పిట్టలగూడెంలో విషాదం నెలకొంది. అన్నా చెల్లెళ్ల కొడుకులు ఇద్దరూ ఒకేసారి మృతి చెందడంతో రెండు కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోయాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top