బస్సులపై దాడి చేసిన ఆర్టీసీ కార్మికులు | TSRTC Strike: Driver suicide attempts for Job Tension In Khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం

Oct 12 2019 5:27 PM | Updated on Oct 12 2019 7:50 PM

TSRTC Strike: Driver suicide attempts for Job Tension In Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం:  ఓ వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతంగా సాగుతుంటే.. మరోవైపు ప్రభుత్వ వైఖరితో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు.  తాజాగా ఓ ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. గత ఎనిమిది రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మెతో తన కుటుంబం రోడ్డున పడిందంటూ ఖమ్మం డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి శనివారం ఒంటిపై కిరోసిన్‌ పోసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. 

ఖమ్మం కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత
శ్రీనివాస్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆర్టీసీ కార్మికులు ...ఖమ్మం కలెక్టరేట్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బస్సులపై ​కార్మికులు దాడి చేయడంతో నాలుగు బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా సమ్మెలో పాల్గొన్న వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, వారికి జీతాలు కూడా చెల్లించేది లేదంటూ ప్రభుత్వం ప్రకటించడంతో తీవ్ర మనస‍్తాపానికి గురై మియాపూర్‌ డిపో ఆర్టీసీ డ్రైవర్‌ లక్ష్మయ్య నిన్న (శుక్రవారం) గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే సమ్మె నేపథ్యంలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు కార్మికులు కూడా ఆస్పత్రి పాలైయ్యారు. మరోవైపు సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చలు జరిపేది లేదని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. సమ్మెలో ఉన్నవారికి జీతాలు చెల్లించేది లేదని, విధుల్లో ఉన్నవారికి మాత్రమే జీతాలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement