రూ.వేయి కోట్లు ఇవ్వండి 

TSRTC proposal to State Govt - Sakshi

ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదన

గత ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌లో రూ.525 కోట్లు కేటాయింపు

సాక్షి, హైదరాబాద్‌: ఈ బడ్జెట్‌లో రూ.వేయి కోట్లు కేటాయించాలని ఆర్టీసీ ప్రభుత్వాన్ని కోరింది. కొత్త బస్సులు కొనుగోలు చేసి చాలా కాలం గడిచిపోయినందున, సత్వరం బస్సుల కొనుగోలుకు నిధులు ఇవ్వాలని కోరింది. బస్‌పాస్‌ల రాయితీకి సంబంధించి రీయింబర్స్‌మెంటు కోసం రూ.600 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుతో తీసుకున్న బ్యాంకు రుణం తిరిగి చెల్లింపునకు సంబంధించి రూ.200 కోట్లు, కొత్త బస్సుల కొనుగోలు కోసం రూ.150 కోట్లు, ఇతర ఖర్చులు కలిపి మొత్తం రూ.వేయి కోట్లు కేటాయించాలని ఆర్టీసీ ఆర్థిక శాఖకు ప్రతిపాదించింది.

గత ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌లో ప్రభుత్వం ఆర్టీసీకి రూ.525 కోట్లు ప్రకటించింది. కానీ ఇప్పటివరకు రూ.30 కోట్లు మించి అదనంగా విడుదల చేయలేదని సమాచారం. గడచిన రెండు నెలలుగా వేతనాలు చెల్లించేందుకు ఆర్టీసీ వద్ద నిధులు లేకపోవటంతో ప్రభుత్వం బకాయిపడ్డ బస్‌పాస్‌ రాయితీ రీయింబర్స్‌మెంటు నిధుల నుంచి రూ.200 కోట్లు విడుదల చేసింది. గతేడాది సాధారణ బడ్జెట్‌లో రూ.960 కోట్లు కేటాయించినా, మొత్తం నిధులు మాత్రం ఆర్టీసీకి అందలేదు. ఈసారి ప్రకటించిన నిధులతోపాటు పాత బకాయిలు కూడా ఇవ్వాలని కోరింది.  

కొత్త మంత్రికి కొత్త ఛాంబర్‌.. 
కొత్త సచివాలయ నిర్మాణానికి ప్రస్తుత సచివాలయ భవనాలను ఖాళీ చేయటంతో మంత్రులకు వివిధ ప్రాంతాల్లో కార్యాలయాలు కేటాయించిన విషయం తెలిసిందే. రోడ్లు భవనాల శాఖతోపాటు రవాణా శాఖను పర్యవేక్షించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఎర్రమంజిల్‌లోని రోడ్లు భవనాల శాఖ ఈఎ న్‌సీ కార్యాలయంలో ఛాంబర్‌ ఇచ్చారు. తాజా విస్తరణలో రవాణా శాఖను అజయ్‌కుమార్‌కు కేటాయించటంతో రవాణా శాఖ కార్యాలయంతోపాటు  బస్‌భవన్‌లో కొత్త ఛాంబర్‌ ఏర్పాటును అధికారులు పరిశీలిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top